కరీంనగర్, మార్చి 29: యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే మరో ఉద్యమం చేస్తామని అన్ని వర్గాలు స్పష్టం చేస్తునాన్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై తీవ్ర వివక్షను చూపుతూ ఉద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని తీర్మానాలు పరంపర కొనసాగుతున్నది. అన్ని పంచాయతీలు, పరిషత్తులు, సహకార సంఘాలు, మార్కెట్ కమిటీలలో సభ్యులు, రైతు బంధు సమితి సభ్యులు తీర్మానం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు లేఖలు పంపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని, మరో ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని పాలకవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీర్మానాలు కొనసాగాయి. రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించిన కేంద్ర మంత్రి పీయుష్ గోయల్పై నిరసనలు వెల్లువెత్తున్నాయి.
కరీంనగర్ జిల్లాలో..
రాష్ట్ర రైతాంగం పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని మానకొండూర్ విశాల సహకార పరపతి సంఘం అధ్యక్షుడు నల్ల గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మాన పత్రాన్ని రిజిస్టర్ పోస్ట్ద్వారా ప్రధాని మోడీకి పంపించినట్లు ఆయన తెలిపారు. సైదాపూర్ మండలం వెన్కేపల్లిలో సర్పంచ్, పాలకవర్గం తీర్మానం చేశారు. వీణవంక పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన ప్రతిని మోడీ కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ చేశారు.