కోరుట్ల, జూలై 2: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తున్నదని, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకేచోట నిర్మిస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని కల్లూరు రోడ్డులో ఉన్న ఎస్సారెస్పీ స్థలంలో రూ.50 లక్షలతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించి, ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకొని అందరికీ అందుబాటులో ఉండేలా పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని వివరించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోనే గత 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి, తొమ్మిదేండ్లలోనే సాధ్యమైందని, ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలువాలన్నారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్ భవన నిర్మాణ నమూన చిత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఆర్ఆండ్బీ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యాలయాన్ని సాధ్యమైనంత త్వరలో నిర్మించి ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అనంతరం పట్టణంలోని 4వ వార్డుకు చెందిన సుమలత అనే మహిళకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.20 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ఎంపీపీ తోట నారాయణ, కౌన్సిలర్లు జిందం లక్ష్మీనారాయణ, ఎంబేరి నాగభూషణం, నాయకులు రుద్ర శ్రీనివాస్, ప్రభాకర్, ఫహీం, మోసీన్ తదితరులు పాల్గొన్నారు.