కరీంనగర్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మన ఊరు.. మన బడి’తో సర్కారు బడి మారబోతున్నది. ఎన్నో ఏండ్లుగా పేద, మధ్యతరగతివర్గాలు ఎదురుచూస్తున్న ఆంగ్ల మాధ్యమం వచ్చే ఏడాది నుంచే అందుబాటులోకి రాబోతున్నది. ప్రాథమిక దశ నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు కానుండగా, ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లోని పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందనే ధీమా కనిపిస్తున్నది. ఇప్పుడు అందరి చూపూ ఆంగ్లంవైపు మళ్లుతుండగా, ఇంగ్లిష్ మీడియం అమలుతో సర్కారు బడుల్ల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ఒక అంచనా ప్రకారం వచ్చే ఏడాదిలో ప్రైవేట్ స్కూళ్ల నుంచి 50వేల పైచిలుకు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల బాట పట్టే అవకాశమున్నది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం నడుపుతున్న సర్కారు పాఠశాలల్లో కొనసాగుతున్న ట్రెండ్ ఇదే సూచిస్తున్నది. 2020-21 విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని సర్కారు బడుల్లో 37,312 మంది విద్యార్థులు పెరుగడం ఆంగ్ల విద్యకున్న క్రేజ్ను తెలుపుతున్నదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇంగ్లిష్పైనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారని చెప్పడానికి పెరిగిన విద్యార్థుల సంఖ్యే నిదర్శనమంటున్నారు విద్యావేత్తలు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బళ్లలో ప్రవేశాలు పెరుగుతాయని, కొత్తగా 50వేల మంది విద్యార్థులు చేరే అవకాశముందని చెబుతున్నారు.
ఇది గొప్ప నిర్ణయం..
ఇంగ్లిష్ మీడియం ఇంతకాలం కొన్ని ప్రాంతాల విద్యార్థులకు, కొన్ని సామాజిక వర్గాల పిల్లలకు, ఆర్థికంగా ఉన్న వారికి మాత్రమే లభించింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంగ్లిష్ అన్ని వర్గాల పిల్లలకు చేరువైతుంది. ఉన్నత విద్య చదువాలని కోరుకునే ప్రతి విద్యార్థీ ఉన్నతంగా ఎదిగేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు ఉర్దూ, తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఆ తర్వాత అతి కష్టం మీద ఇంగ్లిష్ నేర్చుకున్నాం. పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఈ భాష అవసరమవుతుంది. అమ్మ భాష తెలుగును మరువకుండానే ఇంగ్లిష్ జ్ఞానాన్ని పునికి పుచ్చుకోవాలి. ఎన్ని తెలివి తేటలున్నా ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్లం వచ్చి ఉండాలి. విద్యార్థికి ఎంతజ్ఞాన సంపత్తి ఉన్నా భాషతోనే తన ప్రతిభను చాటగలుగుతారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ‘మనఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని తీసుకోవడం ఒక గొప్ప నిర్ణయం.
-అష్టధని గంగాధర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు (మంథని)
అన్ని వర్గాలకు ఆంగ్ల విద్య
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని క్యాబినెట్ నిర్ణయించడం హర్షణీయం. దీని వల్ల అన్ని వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ బోధన జరుగుతుంది. ఇంతకాలం పేద, మధ్య తరగతి పిల్లలకు ఆంగ్ల విద్య అందలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వారందరికీ ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించడంతోపాటు వారికి ఆంగ్ల మాధ్యమ బోధనలో సరైన శిక్షణ ఇప్పిస్తే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. సర్కారు బడులకు పూర్వ వైభవం వస్తుంది. ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
ఆంగ్ల మాధ్యమంపై మక్కువ
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ బడుల తీరుతెన్నులను ఒకసారి పరిశీలిస్తే.. మెజార్టీ తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు మక్కువ చూపుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 2514 సర్కారు బడులుండగా, అందులో 1,90,198 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,787 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతుండగా, 1,66,278 మంది చదువుతున్నట్లు ఆయా జిల్లా విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఆంగ్లమాధ్యమం అమలు తర్వాత.. మూతపడే దశకు చేరుకున్న దాదాపు 300 స్కూళ్లు తిరిగి కొనసాగుతున్నాయి.
కొన్నేళ్లుగా ప్రభుత్వ బడుల్లో సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ, ఇంగ్లిష్ మీడియంతో మళ్లీ తిరిగి పుంజుకున్నాయి. దీనికి నిలువెత్తు నిదర్శనమే ఈ యేడాది ఉమ్మడి జిల్లాలో 37,312 మంది విద్యార్థులు పెరుగడం.
వచ్చే యేడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమల్లోకి రానున్నది. తద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 50వేల పైచిలుకు విద్యార్థులు ప్రభుత్వ బాట పట్టే అవకాశముంది. ఇదే అభిప్రాయాన్ని విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నెన్నో ప్రయోజనాలు..