ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల జాతరకు నేటి నుంచే తెరలేవబోతున్నది. హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర సర్కారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన కసరత్తు చేసింది. రాష్ట్ర విద్యాశాఖను అలర్ట్ చేసి, వెనువెంటనే విధివిధానాలు ఖరారు చేసి షెడ్యూల్ ఇచ్చింది. ఆదివారం నుంచి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమై, వచ్చే నెల 3తో ముగియనున్నది. మొదట పదోన్నతులు, ఆ తర్వాత బదిలీలు చేపట్టనుండగా, ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే కొనసాగనున్నది. నిజానికి 2023 జనవరిలోనే బదిలీలకు శ్రీకారం చుట్టినా.. పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించడంతో ఇన్నాళ్లూ ఆలస్యమైంది. తాజాగా కోర్టు పచ్చజెండా ఊపడంతో ముందు పదోన్నతులు, ఆ తర్వాత బదిలీలు మొదలవుతుండగా, వేలాది మందికి స్థానచలనం జరగడమే కాకుండా, ఉద్యోగోన్నతులు లభించే అవకాశమున్నది. మొత్తంగా ప్రభుత్వం చూపిన చొరవపై ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 2 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర సర్కారు పచ్చజెండా ఊపింది. ఆదివారం నుంచే ఈ ప్రక్రియ మొదలు కాబోతున్నది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వందలాది మంది ఉపాధ్యాయులకు వివిధ గ్రేడ్స్ లో పదోన్నతులు వరించనున్నాయి. అధికారుల అంచనా ప్రకారం చూస్తే.. సుమారు 300 నుంచి 400 మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు దక్కనున్నాయి. దీని ద్వారా దాదాపు ప్రతి పాఠశాలకు శాశ్వత ప్రధానోపాధ్యాయుల సమకూరే అవకాశమున్నది. ఫలితంగా బడి పర్యవేక్షణ పక్కాగా జరగడమే కాకుండా, షెడ్యూల్ ప్రకారం సెలబస్ పూర్తవు తుంది. అలాగే ఉపాధ్యాయులంతా విధిగా సమ యానికి విధులకు హాజరవుతారు. హెచ్ఎంలు ఇన్చార్జిగా ఉండేదానికన్నా, శాశ్వతంగా ఉంటే బడి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఉపాధ్యా యులే చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. సుమారు 1100 నుంచి 1200 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కనున్నాయి. తద్వారా ఉన్నత పాఠశాలల్లో విద్యబోధనకు పూర్తి స్థాయిలో స్కూల్ అసిస్టెంట్లు ఉండే అవకా శాలుంటాయి. తద్వారా బోధన రంగం పూర్తిగా మెరుగు పడుతుంది. అలాగే ఉన్నత పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టీచర్లు ఇక ముందు అందుబాటులోకి ఉండే అవకాశ ముంటుంది.
భారీగా స్థానచలనాలు
టీచర్ల ప్రమోషన్లు చివరిసారిగా 2018 జూలైలో జరిగాయి. ఆ తర్వాత ఉపాధ్యాయుల కోరిక మేరకు ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఏదో ఒక న్యాయపరమైన చిక్కు తో ముందుకెళ్లలేదు. చివరకు 2023 జనవరిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే అప్పుడు స్పౌజ్ కేటగిరికి అదనంగా పది పాయింట్లు, అలాగే యూనియన్ నాయకులకు అదనంగా పది పాయింట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో బదిలీలకు బ్రేక్ పడింది. దాదాపు ఎనిమిది నెలలుగా ఈ ప్రక్రియ పెడింగ్లో పడిపోయింది. తాజాగా హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర సర్కారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కసరత్తు మొదలు చేపట్టింది. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియ శనివారం నుంచి మొదలై, అక్టోబర్ 3తో ముగియనున్నది. సెప్టెంబర్ ఒకటిని కటాఫ్ తేదీగా నిర్ణయించడంతోపాటు లాంగ్ స్టాండింగ్ ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు, ప్రధానో పాధ్యాయులకు 5 సంవత్సరాల నిబంధనను బదిలీలకు వర్తింప జేసింది. 5 నుంచి 8 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా చూపింది. ఇలా పలురకాల నినబంధనలతో ఉమ్మడి జిల్లాలో భారీగా ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. అంచనా ప్రకారం సుమారు 7వేల నుంచి 8వేల మంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ జాబితాను రూపొందించడంలో బీజీగా మారారు. పాదర్శకతకు పెద్దపీట వేస్తూ, ఎటువంటి పైరవీలకు ఆస్కా రం లేకుండా బదిలీల పక్రియ అంతా ఆన్లైన్లో నిర్వహించనున్నారు.
పాఠశాలలు యథాతథం
ఆదివారం నుంచి ప్రారంభం కానున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వచ్చే నెల 3వరకు కొనసాగనున్నది. నెలపాటు ఈ ప్రక్రియ కొనసా గనున్న నేపథ్యంలో పాఠశాలలు నడుస్తాయో..? లేదో..? అన్న అనుమానం పలువురిలో వ్యక్తమవు తున్నది. గతంలో మాదిరిగా కాకుండా బదిలీలు, పదోన్నతుల అన్నీ ఆన్లైన్లోనే నిర్వహించ నుండగా, బడులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. బదిలీలు జరిగినా.. సదరు ఉపాధ్యాయులు తమకు అలాంట్ మెంట్ అయిన పాఠశాలలో వెనువెంటనే చేరేందుకు ఆదేశాలున్నాయి. ఏవైనా అభ్యంతరాలుంటే.. వచ్చే నెల 3 తర్వాత అప్పీలు చేసుకోవచ్చు. దీని వల్ల ఎక్కడా ఇబ్బందులు రావని అధికారులు చెబుతున్నారు. ఏడు నుంచి ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగినా.. బడి కొనసాగింపులోనూ, అలాగే బోధన విషయంలోనూ ఎటవంటి తేడాలుండవని స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు
ప్రభుత్వం వివిధ పనుల్లో ఎంతో బీజీగా ఉన్నా హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని వెనువెంటనే బదిలీలు, పదోన్నతులు చేపడుతున్నందుకు మా కృతజ్ఞతలు. నిజానికి ఇప్పటికిప్పుడు చేపడుతుందా..? లేదా..? అన్న అనుమానం చాలా మందిలో ఉండేది. వాటిని పటాపంచలు చేస్తూ.. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయానికి చొరవ చూపడం అభినందనీయం. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఈ పదోన్నతులు, బదిలీలు చేయాలని చూస్తున్నది. ఆ మేరకు పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉన్నది. ఇప్పటికే మల్టీజోన్ పరిధిలో సీనియారిటీ జాబితాలు పెట్టారు. మిగిలిన సీనియారిటీ జాబితాల తయారీలోనూ ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా చూడాలి. ఒక పద్ధతి ప్రకారం అవసరమున్న చోట వెకెన్సీలు చూపించాలి.
– రాజభానుచంద్రప్రకాశ్, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
చాలా సంతోషం
పదోన్నతులు, బదిలీలపై స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అను గుణంగా ప్రభుత్వం తీసుకున్న చొరవను పీఆర్టీయూ జిల్లా శాఖ తరఫున గౌరవిస్తున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పచ్చజెండా ఊపి.. వెంటనే విధివిధానాలను ఖరారు చేసి అమలు చేయడం చాలా సంతోషం. రాష్ట్రంలో 2వేల మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందే అవకాశం ఏర్పడింది. 6వేల మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందుతారు. 5 నుంచి 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ కలిగిన టీచర్లు, ఇతరులు 60 వేల మంది బదిలీ అవుతారు. కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో పనిచేసే 70శాతం మంది బదిలీలు అవుతారని భావిస్తున్నాం. గత ఎనిమిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఈ ప్రక్రియతో ప్రయోజనం చేకూరుతుంది.
-ఎం ముస్కూ తిరుపతి రెడ్డి, పీఆర్టీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు