ధర్మపురి, ఆగస్టు 12 : ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానం మూడరోజుల ముచ్చటగా మారింది. ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభమైన ఈ వ్యవస్థ.. అంతలోనే నీరుగారిపోయింది. విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు తాజాగా డిఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లో స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అంటిండెన్స్ పేరిట కొత్త మాడ్యూళ్లను పొందుపరిచింది.
ఉపాధ్యాయులందరూ పాఠశాల విద్యాశాఖ రికగ్నైజేషన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రారంభమైన రోజు నుండి మూడు రోజులు ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాల ఆవరణలోనే ఉపాధ్యాయుల హాజరును యాప్ ద్వారా నమోదు చేసుకున్నారు. అయితే ఇది మూడు రోజులకే పరిమితమైంది. పాఠశాల ఆవరణ కాకుండా మరోచోట నుండి నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తే హాజరు నమోదు కాలేదు. కానీ మూడు రోజుల తర్వాత నుండి పాఠశాల ఆవరణ కాకుండా ఎక్కడ నుండి చేసినా యాప్లో హాజరు నమోదు అవుతున్నది. ఉపాధ్యాయుల ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టం(ముఖ గుర్తింపు) హాజరు సమోదు కోసం రూపొందించిన పాఠశాల విద్యాశాఖ యాప్ గందరగోళంగా ఉంది.
జియో ట్యాగింగ్ ఆప్లికేషన్ ను ఉపయోగించి సమాచారాన్ని సేకరించి ఏకీకృతం చేయాలని విద్యాశాఖ నిర్ణయం. ఈ వ్యవస్థ అమలులో ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలు, పనితీరును నిశితంగా పర్యవేక్షించడం ఈ శాఖ లక్ష్యం. జియో ట్యాగింగ్ ఆధారంగానే అగస్టు 1 నుండి టీచర్ ఎస్ఆర్ఎస్ను అమలు చేశారు. ఉపాధ్యాయుల సంఖ్య మేరకు యాప్ను రూపొందించకపోవడం వల్ల హాజరు నమోదులో హ్యాంగ్ అవతున్నదని పేర్కొంటున్నారు. యాప్ను మరింత డెవలప్ చేయాల్సి ఉందని పలువరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 2,416 పాఠశాలల్లో 13,189 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,416 ప్రభుత్వ పాఠశాలలుండగా ఇందులో 13,189 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పెద్దపెల్లి జిల్లాలో 532 ప్రభుత్వ పాఠశాలల్లో 2,633 మంది, జగిత్యాల జిల్లాలో 765 పాఠశాలలో 4,369 మంది, కరీంనగర్ జిల్లాలో 631 పాఠశాలల్లో 3,644 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 488 పాఠశాలల్లో 2,493 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఆగస్టు 1 నుండి ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టం యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకుంటున్నారు.
టీచర్ ఎస్ఆర్ఎస్ను ప్రస్తుతం రోజుకు రెండు సార్లు నమోదు చేసుకునే విధంగా రూపొందించారు. అయితే రోజుకు నాలుగుసార్లు హాజరు నమోదు చేసుకునే విధంగా ఉంటే బాగుంటుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉదయం, సాయంత్రం కాకుండా మద్యాహ్న భోజన విరామ సమయంలో కూడా రెండు సార్లు మొత్తం నాలుగుసార్లుగా హాజరు నమోదు చేసుకునే విధంగా యాప్ను అభివృద్ధి చేయాలని మేధావులు సూచిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు మధ్యాహ్నం భోజన నిరామంలో పాఠశాల నుండి బయటకు వెళ్లి వ్యక్తిగత పనులు పూర్తిచేసుకొని సాయంత్రం 4 పాఠశాలకు చేరి యాప్లో హాజరు నమోదు చేసుకుంటున్నారనే ఆరోపణలు రావడమే అందుకు కారణం.
ప్రతీ పాఠశాలకు జియో ట్యాగింగ్ ఉంది. ఉపాధ్యాయుల హాజరు నమోదును పాఠశాల ఆవరణ నుండే యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. అందుకు అనుగుణంగా టీచర్ ఎఫ్ ఆర్ఎస్ యాప్ రూపొందించారు. పాఠశాల ఆవరణ నుండి కాకుండా ఇతర చోట నుండి నమోదు చేసుకుంటే ఎంత దూరం నుండి నమోదు జరిగిందనేది తెలుస్తుంది. ప్రస్తుతం యాప్ టెస్టింగ్ దశలో ఉంది. యాప్ను మరింత అభివృద్ధి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాం. ఏవైనా లోపాలుంటే పరీక్షించి సరిచేయడం జరుగుతుంది – జిల్లా విద్యాధికారి కే. రాము.
కే. రాము, మాన్య పవన్ కుమార్
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎఫ్.ఆర్ఎస్ అటెండెన్స్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎఫ్.ఆర్ఎస్ వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. అలాగే ఉపాధ్యాయులకు పాఠశాలలో ఆన్లైన్, బోధనేతర పనుల భారం అధికం కావడం వల్ల విద్యార్థుల్లో పూర్తిస్థాయిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించలేకపోతున్నారు. కాబట్టి ప్రతీ పాఠశాలలో బోధనేతర పనులకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి – మాన్య పవన్ కుమార్, టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు.