విద్యార్థులకు పాఠాలు చెప్పి పరీక్షలు రాయించిన గురువులను ఇన్నాళ్లు చూశాం. కానీ, ఆ పంతుళ్లే ఇప్పుడు పరీక్ష రాయాల్సి వస్తున్నది. ఉద్యోగోన్నతులు రావాలన్నా.. ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత తప్పక సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యువ ఉపాధ్యాయుడు నుంచి ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయుడి వరకు దాదాపుగా అందరూ ఈ పరీక్ష రాయాల్సిన అవసరం కనిపిస్తున్నది. పాఠశాల విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ), టెట్ను తప్పనిసరి చేస్తుండగా, ఉపాధ్యాయుల్లో అలజడి రేగుతున్నది. ఉమ్మడి జిల్లాలో 13 వేల మంది టీచర్లు పనిచేస్తే దాదాపు 8 వేల మంది ఈ పరీక్ష రాసి అర్హత పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో ఎవరికీ మినహాయింపు ఉండదని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం స్పష్టం చేస్తున్నది.
కరీంనగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలోని చాలా రాష్ర్టాల్లో వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు బీఈడీ, టీటీసీ వంటి కోర్సులు పెట్టి సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. అయితే, వాటి ద్వారా ఉపాధ్యాయులుగా నియమితులైన చాలా మందిలో బోధనకు తగినంతగా పరిణితి లేదని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) 2010లో టెట్ను తెరపైకి తెచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలన్నా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగోన్నతి పొందాలన్నా.. టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు 2010లోనే నిబంధనలను నిర్దేశించింది. ఈ అర్హత సాధించడానికి 2015వరకు అవకాశం కల్పించింది.
ఆ తర్వాత మరో ఐదేళ్లు పొడిగిస్తూ 2019 వరకు అవకాశం ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా చేపడుతున్న నియామకాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ, పదోన్నతులకు మాత్రం ఇన్నాళ్లుగా వర్తింప చేయలేదు. అయితే ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ ఉత్తీర్ణత సాధించిన వారికే ఉద్యోగోన్నతులు ఇవ్వాలని పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ మేరకు ప్రమోషన్ పొందేందుకు టెట్లో పాస్ అయిన వారితో సీనియారిటీ జాబితా సమర్పించాలని గతేడాది సెప్టెంబర్ 27న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రమోషన్లకు బ్రేక్ పడింది.
ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని నాటి కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు టెట్ నిర్వహించడం సాధ్యం కాదని, ఈ సారి పాత నిబంధనల ప్రకారమే ఉద్యోగోన్నతులు నిర్వహించే అవకాశం ఇవ్వాలని, అలాగే ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించడానికి కొంత సమయం ఇవ్వాలని కోరుతూ ఎన్సీటీఈకి లిఖిత పూర్వక లేఖ రాసింది. ఎన్సీటీఈ దానిని అంగీకరించకుండా కచ్చితంగా టెట్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని తిరిగి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఓవైపు హైకోర్టు ఆదేశాలు, మరోవైపు ఎన్సీటీఈ ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం టెట్ అర్హత తప్పనిసరిగా మారింది. నిజానికి 2010లోనే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినా ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎక్కడా కూడా ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరని లేదు. అంతే కాకుండా టెట్ అర్హత సాధించడానికి గరిష్ఠ వయసు 45 ఏండ్లలోపు ఉండాలని పేర్కొన్నది. దీంతోపాటు ఇన్నాళ్లుగా కేంద్రం కూడా ఈ విషయంలో ఒత్తిడి తేకపోవడంతో అంతా మామూలుగానే నడిచింది.
ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో మొత్తం 150 మార్కులకు గాను ఓసీలు 90 మార్కులు (60 శాతం).. అలాగే బీసీలు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు (40 శాతం) సాధిస్తేనే ఉతీర్ణత అయినట్లుగా భావిస్తారు. ఇప్పుడు పదోన్నతులకు నిర్వహించే టెట్కు ఇదే విధానం పాటిస్తారా..? లేక అందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తారా..? అన్న అంశంపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, అందరితో పాటే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు టెట్ రాయాలా? లేక సర్వీసులో ఉన్నవారికి ప్రత్యేకంగా ఏమైనా నిర్వహిస్తారా..? అన్న అంశంలోనూ స్పష్టత రావాల్సి ఉన్నది.
ఒకవేళ ప్రత్యేకంగా నిర్వహించాలనుకుంటే.. దానికి ఎన్సీటీఈ అనుమతి ఇస్తుందా..? లేదా..? అన్నది సందేహమే. ప్రస్తుతమున్న ఉపాధ్యాయుల వివరాలను బట్టి చూస్తే.. 2010, 2011, 2012, 2017 డీఎస్సీలో నియమితులైన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించారు. నిజానికి 2010 నుంచి టెట్ తప్పనిసరి చేసినా.. 2005, 2008 డీఎస్సీలో నియామకమైన ఉపాధ్యాయుల్లోనూ చాలా మంది ఆ తర్వాత టెట్ అర్హత సాధించి ఉద్యోగంలో కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. అంతకుముందు నియమితులైన టీచర్లు ఈ టెట్ అర్హత సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ లెక్కన చూస్తే.. ప్రతి జిల్లాలో ఇప్పటికే టెట్ అర్హత సాధించిన ఉపాధ్యాయులు కేవలం 30 శాతం ఉంటే.. టెట్ అర్హత సాధించాల్సిన ఉపాధ్యాయులు సుమారు 70శాతం ఉంటారని అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. మొత్తంగా టెట్ వ్యవహారంపై ఉపాధ్యాయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది.
ఇక ముందు ప్రమోషన్లు పొందే టీచర్లు మాత్రమే టెట్ అర్హత సాధిస్తే సరిపోతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ, నిబంధనలను లోతుగా చూస్తే.. ఇంక్రిమెంట్ల వంటి ప్రయోజనాలు పొందాలంటే కూడా విధిగా టెట్ అర్హత ఉండాల్సిందే. ఈ విషయమే ప్రతి ఒక్కరిలో ఆందోళనకు కారణమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుల నుంచి రెండు రకాల డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఇప్పటికే టెట్ అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఒక సంఘంగా ఏర్పడి.. ఉద్యోగోన్నతుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత సాధించిన వారితో సీనియారిటీ జాబితా తయారు చేసి.. వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం కొంత సమయం ఇచ్చి టెట్ నిర్వహించాలని, ఆ తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటే.. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికారులతో ఒక సమన్వయ కమిటీ వేసి, అక్కడ తీసుకునే నిర్ణయాల ప్రక్రారం పదోన్నతుల ప్రక్రియలో ముందుకెళ్తే బాగుంటుందని పేర్కొంటున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే.. ఈ ప్రక్రియ మళ్లీ వివాదాస్పదం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ఇటు ఉపాధ్యాయుల్లోనూ అలజడి కనిపిస్తున్నది.