రామడుగు/ కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 19: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అద్భుతమని, సంక్షేమంలో తెలంగాణ భేష్ అని తమిళనాడులోని కట్టుమన్నార్ కోయిల్ శాసన సభ్యుడు సింతనై సెల్వన్ కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ గొప్ప పాలనాదక్షత కలిగినవారని, అతి తక్కువ సమయంలోనే రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపడంలో ఆయన కృషి గొప్పదని ప్రశంసించారు. తమిళనాడుకు చెందిన మరో ఎమ్మెల్యే ఎస్ఎస్ బాలాజీ, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు డా సుధన్ తిరుమల కుమార్, నాగమల్లి వీపీ కెవలౌర్, డాక్టర్ రీచర్డ్ దేవదాస్తో కలిసి కరీంనగర్ జిల్లాలో అభివృద్ధిపై అధ్యయనానికి వచ్చారు. ముందుగా కరీంనగర్లో మంత్రి కమలాకర్ను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో దళితబంధు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివరాలను ఎమ్మెల్యేలకు మంత్రి వివరించారు. దళితబంధు ఎంపిక విధానం, అమలు తీరును వారికి క్షుణ్ణంగా వివరించారు. వీటితో పాటుగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలను అందించగా, దళిత సాధికారత కోసం తెలంగాణ చేస్తున్న కృషిని ఎమ్మెల్యేలు ప్రశంసించారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి చొప్పదండి, రామడుగు మండలాల్లో పర్యటించారు.
ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల పరిశీలన
రామడుగు మండల కేంద్రంలో దళితులకు అందించిన మూడెకరాల వ్యవసాయ భూములను తమిళనాడు ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు నాగి దుర్గమ్మ, కుక్కల అంజమ్మతో మాట్లాడి వారి కుటుంబ స్థితిగతుల ను తెలుసుకున్నారు. తాను మళ్లీ వస్తానని, ఈ సా రి వచ్చినప్పుడు ఈ భూమిలో మీరు పండించే ధా న్యంతో మీ ఇంట్లో భోజనం చేస్తానని సింతనై సెల్వన్ చెప్పారు. అనంతరం రామడుగు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో కంటివెలుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకెతో కలిసి హా జరైన సింతనై సెల్వన్, ఆ తర్వాత కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటివెలుగు యొక్క ఆవశ్యకతను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే సింతనై సెల్వన్కు ఎమ్మెల్యే సుంకె కంటి అద్దాలను బహూకరించారు. అనంతరం చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ పాఠశాలను పరిశీలించారు. స్కూల్లో మౌలిక వసతులు, పాఠశాలలో జరిగే విద్యాభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన జిమ్, ఆర్బిర్, బాక్సింగ్, రెస్లింగ్ విభాగాలను చూసి, విద్యార్థుల ప్రదర్శనను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
తెలంగాణ పథకాలు అద్భుతం..
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే సింతనై సెల్వన్ కితాబిచ్చారు. దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇంతటి గొప్పవ్యక్తి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ప్రజలకోసం పనిచేసే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నట్టు తెలిపారు.
ఇక్కడి అభివృద్ధిని తనవెంటే ఉండి చూపించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు తమిళనాడు ఎమ్మెల్యే సింతన్ సెల్వన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట తమిళనాడు రాష్ట్ర కోఆర్డినేటర్ మురుగప్పన్, సోషల్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్, సాసి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్నాథన్తోపాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, సర్పంచు పంజాల ప్రమీల జగన్మోహన్గౌడ్, గిర్దావర్ బాలకిషన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.