పెద్దపల్లి, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ) : సాధారణంగా జ్వరం వచ్చిన వ్యక్తి ప్రైవేట్ దవాఖానకు వెళ్తే తప్పనిసరిగా సీబీపీ, వైడల్, మలేరియా, యూరిన్ అనాలసిస్ తదితర పరీక్షలు చేస్తున్నా రు. వీటికి కనీసంగా వెయ్యి రూపాయల దాకా ఖర్చవుతుండగా, పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కారు వైద్య సేవలను మరింత చేరువ చేస్తున్నది. పేదలకు రోగ నిర్ధారణ పరీక్ష ఫీజుల భారాన్ని తగ్గించి, టెస్టుల పేరిట ప్రైవేట్ దవాఖానలు చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు టీ- డయాగ్నోసిస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నది. పెద్దపల్లి జిల్లాకు సెంటర్ను మం జూరు చేసింది. 1.50 కోట్లు మంజూరు చేయ గా, జిల్లా దవాఖాన ఆవరణలో భవన నిర్మాణాన్ని చేపట్టింది. పనులు శరవేగంగా చేయగా, నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చింది. మరో పది రోజుల్లో అందుబాటులోకి రాబోతున్నది. ఈ క్ర మంలో పరీక్షల కోసం వైద్య యంత్రాంగం 50 లక్షల ప్రత్యేక నిధులతో పరికరాలను కొనుగోలు చేసి తెచ్చింది. ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఒక నోడల్ ఆఫీసర్, ఒక చీఫ్ టెక్నీషియన్ పోస్టులను కూడా మంజూరు చేసింది.
57 రకాల టెస్టులు ఇవే..
టీ డయోగ్నోస్టిక్ అందుబాటులోకి వస్తే ఒకే చోట 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయవచ్చు. ఒకేసారి రక్త, మూత్ర, అవయవ పనితీరు, థైరాయి డ్, లివర్, కిడ్నీ పనితీరు, కొలెస్ట్రాల్, చికున్గు న్యా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, క్యాల్షి యం, సిరమ్ క్రియాటిన్, డీహెచ్డీఎల్, ఎలొక్టోరైట్స్, హెచ్బీఎస్హెచ్జీ వంటి 57 రకాల పరీక్షలు చేస్తారు. వీటితో పాటు ఖర్చుతో కూడుకున్న సిటీస్కాన్, 2డీ ఈకో, అల్ట్రా సౌండ్, మమోగ్రఫీ లాంటి స్కానింగ్ పరీక్షలు చేస్తారు. జిల్లాలోని పీ హెచ్సీలు, యూపీహెచ్సీలతోపాటు జిల్లా దవాఖానల నుంచి వచ్చే శాంపిళ్లను సైతం వెనువెంటనే పరీక్షించి రిపోర్టులు ఇవ్వడంతోపాటు వ్యక్తి మొబైల్ నంబర్కు కూడా నిర్ధారణకు సంబంధించిన మెస్సేజ్ పంపించనున్నారు.
నిరుపేదలకు భరోసా
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 18, పట్టణ ప్రాం తాల్లో 6 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 104సబ్ సెంటర్ కేంద్రాలు, 3సీహెచ్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎక్కడ ఎవరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరం అయినా రక్త నమూనాలను అక్కడే సేకరిస్తారు. తర్వాత జిల్లా కేంద్రంలోని టీహబ్ డ యోగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తారు. ఈ కేంద్రంలో జరిగే ప్రతి పరీక్షలను రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షిస్తారు. అందుకు బయో కెమి స్ట్రీ, ఫాథాలాజిస్టు, మైక్రో బయోలజిస్ట్లైన వైద్య నిపుణులు హైదరాబాద్ కేంద్రంగా ప్రతి రిపోర్ట్ను పరిశీలిస్తారు. వీటిని తిరిగి స్థానిక నిర్ధారణ పరీక్షల కేంద్రానికి నివేదిస్తారు. రోగుల మొబైల్ ఫోన్లకు కూడా అటాచ్ చేస్తారు. మాన్యువల్ రిపోర్టులు అవసరమున్న రోగులు తాము రక్త, మూత్ర నమూనాలు ఇచ్చిన కేంద్రాలకు వెళ్లి తీసుకునే సదుపాయం కల్పించారు.
పది రోజుల్లో అందుబాటులోకి..
ప్రతి పేద కుటుంబానికి ఖరీదైన వైద్యాన్ని చే రువ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇంకా వ్యాధి నిర్ధారణ పరీక్షలను సైతం ఉచితంగా అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా 57రకాల నిర్ధారణ పరీక్షలను టీ-డయాగ్నస్టిక్ కేంద్రం ద్వారా ప్రజలకు అందుతాయి. మరో పది రోజుల్లోనే సెంటర్ను ప్రారంభిస్తాం.
– డా కొండ శ్రీధర్, డీసీహెచ్ఎస్ (పెద్దపల్లి)