Godavarikhani | కోల్ సిటీ, జులై 2 : గోదావరిఖని నగరం లో ప్రధాన వ్యాపార కేంద్రం లో ఒకటైన కళ్యాణ్ నగర్ బజార్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫుట్ పాత్ లు భద్రమేనా..? ఇవి కూడా ఆక్రమణలు జరిగితే ప్రజాధనం రోడ్డు పాలేనా..? అసలు ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్మాణాలు.. అని వ్యాపారులు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. పైగా పైపైకి పూతగా నిర్మిస్తున్న ఈ ఫుట్ పాత్ లు ఎంతకాలం ఉంటాయని వాపోతున్నారు. రోడ్డు పక్కన కంకర పోయకుండానే సిమెంట్ మిశ్రమం పోసి పైన బిల్లలు బిగిస్తున్నారని, ఈ నాసిరకం పనులపై నగరపాలక ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ కొరబడిందని ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా సుమారు రూ.2కోట్ల వ్యయంతో నిర్మించిన ఫుట్ పాత్ లు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి.
ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ఫుట్ పాత్ లు ప్రైవేటు వ్యక్తులు ఎక్కడికక్కడ కబ్జాలు చేసి దర్జాగా ఫుట్ పాతు లపైనే దుకాణాలు నిర్మించుకున్నారు. ఆ ఫుట్ పాతులను వినియోగంలోకి తీసుకురావడంలో నగరపాలక అధికారులు వైఫల్యం చెందారన్న బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కళ్యాణ్ నగర్ బజార్ లో నిర్మించే పుట్ పాత్ ల ను సక్రమంగా వినియోగంలోకి తీసుకు వస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. నాసిరకం పనుల వల్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా..? అని స్థానిక వ్యాపారులు సవాల్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం తప్ప ప్రజల కోసం కాదని వాదనలు చేస్తున్నారు. కాగా ఫుట్ పాత్ ల క్వాలిటి ని పరిశీలించాల్సిన బాధ్యత నగరపాలక అధికారులపై ఉందని గుర్తు చేస్తున్నారు.