Korutla | కోరుట్ల రూరల్ : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్కు చెందిన ఓ విద్యార్థి గత నెల 27న హైదరాబాద్లో తప్పిపోయాడు. పలుచోట్ల తల్లిదండ్రులు, పోలీసులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో అతడి మృతదేహం లభ్యమవడంతో గ్రామంలో విషాధం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదవుకుంటున్నాడు. గత నెల 27న హైదరాబాద్లో మిస్సింగ్ అయ్యాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు హైదరాబాద్ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ ఆచూకీ తెలిస్తే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని రాహుల్ కుటుంబ సభ్యులు ఓ వీడియో తీసి వాట్స్అప్ గ్రూపులో షేర్ చేశారు. అంతేకాక పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని అనుకుంటున్న కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ సమీపంలో ఓ బావిలో రాహుల్ మృతదేహం ఉందని అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. దీంతో ఐలాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుమ్ముకున్నాయి సమాచారమందుకున్న రాహుల్ కుటుంబ సభ్యులు సింగరాయకొండకు బయలుదేరారు. రాహుల్ మృత దేహానికి బండరాయి కట్టి ఉండడంతో ఇది హత్యనా..? ఆత్మహత్యనా..? అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు పూర్తి చేస్తేనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఇతర కాలేజీ వారితో గడవలు జరిగినట్లు సమాచారం. చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ లో రాహుల్ సీపీ కెమెరాలో కనిపించినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.