Road accidents | పెద్దపల్లి మే 2: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో డీ సీ పీ కరుణాకర్ తో కలిసి కలెక్టర్ రోడ్డు ప్రమాదాల నియంత్రణ పై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని, రోడ్డు భద్రత ప్రమాణాల పై విస్తృత ప్రచారం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లాలో అధికంగా ట్రాఫిక్ ఉండే జంక్షన్ల వద్ద అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ప్రతి పాఠశాల వద్ద స్కూల్ జోన్ బోర్డులు ఉండాలని స్పష్టం చేశారు. పెద్దపల్లిలోని కూనారం రోడ్, కమాన్ , బస్ స్టాండ్ జంక్షన్, మంథని ఫ్లైఓవర్ వద్ద సాధ్యమైన మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని, అవసరమైన లైటింగ్ సౌకర్యం కల్పించాలని, జంక్షన్ల కంటే ముందు ఇరు వైపులా అవసరమైన బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లారీలు, ట్రాక్టర్ లు, భారీ వాహనాలు, కార్లకు ముందు వెనుక తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రాజీవ్ రహదారి పై అవసరమైన చోట పోలీస్, ఆర్ టీ ఓ అధికారుల సమక్షంలో రంబల్ స్ట్రీప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారి పై అవసరమైన చోట హై మాస్ లైటింగ్ కోసం ప్రతిపాదనలు అందించాలని అన్నారు. రహదారి పై టర్నింగ్ దగ్గర వెంటనే రేడియం స్టిక్కర్లతో బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం పై విస్తృత ప్రచారం కల్పించాలని, జిల్లాలోని బ్లాక్ స్పాట్స్ వద్ద స్పీడ్ లిమిట్ బోర్డులను, యాక్సిడెంట్ ఏరియా లో స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
హెల్మెట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ధరించడం మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదకరమని, చట్ట ప్రకారం నేరమని ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ భావ్ సింగ్, ఏసీపీలు కృష్ణ, రమేష్, పెద్దపల్లి మున్సిపల్ ఆకుల కమిషనర్ వెంకటేష్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు బండి ప్రకాష్, ట్రాఫిక్ సీఐ, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.