జగిత్యాల టౌన్, మే 27: తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లె పల్లెనా ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ యాస్మిన్బాషా అధ్యక్షతన జరిగిన దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల్లో నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేల చొరవ తీసుకొని అందరూ ప్రజాప్రతినిదులు, అధికారులతో కలిసి ప్రభు త్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జూన్ 2న పతాకావిష్కరణ దశాబ్ది ఉత్సవ సందేశంతో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22న అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం ఆవిష్కరణతో ముగుస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని, తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలన్నారు.
రాష్ట్రం రాక ముందు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని అన్నారు. రాష్ట్రం ఏర్పాటులాగే జగిత్యాల జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని, నూతన మండలాలు, గ్రామ పంచాయితీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటైన జగిత్యాల జిల్లా కేంద్రంలో సంబురాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. మన ఊరు-మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలని పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మిష న్ కాకతీయ పథకం ద్వారా సాగునీటి చెరువుల పునరుద్దరణ, గ్రామాల్లో చెక్ డ్యాములు, ఊట చెరువుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు విద్యుత్తు వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని గర్వాంగా చాటుకుం టు ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని, ఒక్కో గ్రామానికి అందుతున్న రైతుబంధు, రైతు బీమా వివిధ రకాల పెన్షన్లు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, చెరువుల్లో వదిలిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పా టు చేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన పనుల వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచా రం చేయాలన్నారు. ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కులవృత్తుల వారికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించి లక్ష రూపాయలు ఇవ్వాల ని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అందజేయాలని సూచించారు. పోడు పట్టాలు, గిరిజనులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత గల వారికి ఇంటి స్థలాలు పట్టాలు అందజేయాలని తెలిపారు.
2నుంచి వేడుకలు
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న అవతరణోత్సవ వేడుకలు, 3న తెలంగాణ రైతు దినోత్సవం, 4న సురక్షాదినోత్సవం, 5న విద్యుత్తు విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమం, 14న వైద్య ఆరోగ్యం, 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం, 18న మంచినీటి పండుగ, 19న హరితోత్సవం, 20న విద్య, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, చివరగా 22న అమరుల సంస్మరణ కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, మంద మకరంద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, ఆర్డీవోలు జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎమ్మార్వోలు, జిల్లా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.