కోరుట్ల/ఇల్లంతకుంట, అక్టోబర్ 5: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ముందుగా కోరుట్ల పట్టణానికి రానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు హెలీకాఫ్టర్లో అయిలాపూర్లోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కోరుట్లలోని ఐబీ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వందపడకల దవాఖానకు ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 3గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి బయలుదేరుతారు.
అక్కడ వ్యవసాయ మార్కెట్, పల్లె దవాఖాన, మహిళ సంఘ భవనాలకు ప్రారంభోత్సవంతోపాటు 50 పడకల దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తిరిగి 5గంటలకు పర్యటన ముగించుకొని తిరిగి పయనమవుతారు. కాగా, కోరుట్లలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు లక్షపై చిలుకు పాల్గొనే సభలో ప్రజలకు సరిపడా కుర్చీలు, ఇతర సదుపాయాలు కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా షామియానాలు, స్టేజీని నిర్మిస్తున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, బీఆర్ఎస్ కోరుట్ల నియోజకర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల దగ్గరుండి మంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇల్లంతకుంటలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సభను విజయంతం చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కోరారు. గురువారం మండల కేంద్రంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను ఏర్పాట్లను, హెలీప్యాడ్, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. తర్వాత గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఆరుగురు దివ్యాంగులకు స్కూటీలు, ఇద్దరికి బ్యాటరీ ట్రై సైకిళ్లు, క్రికెట్ కిట్లను అందజేశారు. తర్వాత మాట్లాడారు. బహిరంగ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, సెస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహా రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, ఉప సర్పంచ్ సాదుల్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.