Duddilla Sridhar Babu | మంథని, సెప్టెంబర్ 11: మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం మంథనిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంథని మున్సిపాలిటీలో రూ.80 లక్షలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ సెంటర్కు శంఖుస్థాపన చేశారు. అదే విధంగా స్థానిక ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ మంచు లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను సైతం మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్య అందాలని స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సేవలు అందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో స్పష్టమైన మార్పు తీసుకుని రావాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలో ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తూ పిల్లలకు మెరుగైన బోధన అందించేందుకు సహకారం అందిస్తున్న టీచ్ ఫర్ చేంజ్ సంస్థ స్థాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు డిజిటల్ తరగతులను, మూడు సంవత్సరాల వరకు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ అందించే సేవలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లల్లో మంచి మార్పు తీసుకు రావాలన్నారు.
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ప్రతినిధులు, ప్రముఖ సినిమా నటీ మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మంథనిలో ఆరు తరగతి గదులను డిజిటలైజ్ చేశామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొత్తం మా సంస్థ ద్వారా 51 తరగతి గదులలో డిజిటల్ సౌకర్యాలు కల్పించామని చెప్పారు. తమ కుటుంబ నేపథ్యం విద్య రంగం నుంచి వచ్చిందని, తన తాత హెడ్ మాస్టర్గా పని చేసేవారని తెలిపారు. మంచి నాణ్యమైన విద్య ప్రతీ ఒక్కరికి అందాలనే లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిల్లలు మంచి నాయకత్వ లక్షణాలు, జీవితంలో ఒక మంచి లక్ష్యం కలిగి ఉండాలన్నారు. మా సంస్థ సహకారంతో ఇక్కడి పాఠశాలల్లో మంచి మార్పులు వస్తే మరిన్ని పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ముందుకు వస్తామన్నారు.
అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్, మంథని, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో ఎంపికైన 205 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకో వాలని, ప్రతీ సోమవారం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ్యగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, మంథని పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ కమిటీ చైర్మన్ వెంకన్న, ఆర్డీవో సురేష్, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.