కరీంనగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : రేషన్ డీలర్ల్లు ఆనందంలో మునిగిపోయారు. ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు రాష్ట్ర సర్కారు పరిష్కారం చూపడంతో సంబురపడుతున్నారు. ప్రస్తుతం టన్నుకు ఇస్తున్న కమీషన్ను 900 నుంచి 1400కు పెంచడం, ప్రతి డీలర్కూ రైతుబీమా తరహాలో 5లక్షల బీమా, ఆథరైజేషన్ రెన్యూవల్ 2 నుంచి 5 ఏండ్ల వరకు పెంపు, డీలర్ చనిపోతే అంత్యక్రియలకు ప్రభుత్వం తరఫున 10 వేలు, ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్ దగ్గర వే బ్రిడ్జిల ఏర్పాటు, కుటుంబానికి 5లక్షల వరకు దవాఖాన ఖర్చుల కోసం హెల్త్ కార్డులను జారీ చేయాలని నిర్ణయం తీసుకోగా, హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. కమీషన్ పెంపు సహా ఇతర సమస్యలు పరిషరించి, తమ కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు.
రేషన్ డీలర్లు సంబురాలు జరుపుకుంటున్నారు. కమీషన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, మరో 13 సమస్యలకు పరిష్కారం చూపడంతో మురిసిపోతున్నారు. ప్రస్తుతం టన్నుకు ఇస్తున్న కమీషన్ను 900 నుంచి 1400 పెంచడమే కాకుండా, రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 సమస్యలను ప్రభుత్వం పరిషరించింది. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతు, నేత, గౌడ తదితరులకు అమలవుతున్న బీమా తరహాలో రేషన్ డీలర్లకు కూడా 5 లక్షల బీమా అమలు చేయనున్నది. ప్రతి డీలర్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం రేషన్ డీలర్లు తమ డీలర్షిప్ను ఏటా రెన్యూవల్ చేసుకొంటుండగా, ఆ రెన్యూవల్ కాలపరిమితిని 5 ఏండ్లకు పెంచింది. ఇక రేషన్ డీలర్షిప్ వయోపరిమితిని 40 నుంచి 50 ఏండ్లకు పెంచింది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు తక్షణ సాయం కింద 10 వేలు ప్రభుత్వం ఇవ్వనున్నది. 1.5 క్వింటాళ్ల వేరియేషన్ను కేసుల పరిధి నుంచి తీసివేయడం, హైదరాబాద్లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తంచేయగా, రేషన్ డీలర్లు సంబురపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో సంబురాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మాండ్లు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సంబురాలు జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. డీలర్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని ఆంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రేషన్ డీలర్ల సంఘం మండలాధ్యక్షుడు తాండ్ర సురేశ్, ఉపాధ్యక్షుడు మహేశ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వినయ్ భాస్కర్, పద్మా దేవేందర్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినదించారు. మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి చిత్రపటాలకు రేషన్డీలర్లు పాలాభిషేకం చేశారు. అంతకు ముందు స్థానిక రాజగృహలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ది పెద్ద మనసు
ఏండ్ల నుంచి రేషన్ డీలర్గా పనిచేస్తున్న. చాలీచాలని కమీషన్తో ఇబ్బందులు పడుతున్న. లారీలోడు దింపడం నుంచి మొదలు బియ్యం తూకం వేయడం, దుకాణం అద్దె భారమైపోతున్నది. నెట్బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్న మా సమస్యలను సీఎం కేసీఆర్ సార్ పెద్దమనసుతో అర్థం చేసుకుని ఇప్పుడున్న కమీషన్ను రెండింతలు చేసిండు. ఇంకా మా డిమాండ్లను కూడా నెరవేర్చిండు. చాలా సంతోషంగా ఉంది.
-తాటి పద్మ, డీలర్ బీవైనగర్ (రాజన్న సిరిసిల్ల)
రుణపడి ఉంటం
గత ప్రభుత్వాలు డీలర్లకు ఏమాత్రం న్యాయం చేయలే. చాలా ఇబ్బందులు పడ్డం. వేలిముద్రలు తీసుకోవాలంటే నెట్ కావాలి. దాని బిల్లు, కరెంటు బిల్లులు, దుకాణం కిరాయిలు చాలీచాలని కమీషన్లతో ఎట్ల ఎల్లుతయి. మా సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినం. ఆయన సానుకూలంగా స్పందించారు. క్వింటాల్కు 70 ఉన్న కమీషన్ను రెండింతలు చేసి న్యాయం చేసిండు. సీఎంసార్ డీలర్లను ఆదుకుంటాడన్న నమ్మకం ఉంది. ఆయన ఉన్నన్ని రోజులు మాకే కాదు ప్రజలందరికి భరోసా ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్ సార్లకు రుణపడి ఉంటం.
– కొండ పద్మ, డీలర్ శివనగర్ (రాజన్న సిరిసిల్ల)
మా ఆత్మగౌరవం పెరిగింది
ప్రజా పంపిణీ కమీషన్ పెంచడం, డీలర్ల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మా ఆత్మగౌరవం పెరిగింది. ఇన్నాళ్లూ తమకు సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడ్డం. గత ప్రభుత్వాల పాలనలో క్వింటాల్ బియ్యం కమీషన్ రెండుపదులు దాటలే. స్వరాష్ట్రంలో కేసీఆర్ 70కి పెంచిండు. ఇప్పుడు రెండింతలు పెంచి 140 చేసిన్రు. ఆరోగ్య భద్రత కార్డు, బీమా సౌకర్యం కల్పించడం, రేషన్ డీలర్ల లైసెన్స్ గడువును పెంచడం సంతోషంగా ఉంది. మేమంతా కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం.
– దొనికెని తిరుపతి గౌడ్, రేషన్ డీలర్ల సంఘం మండలాధ్యక్షుడు (ధర్మారం)
మా బాధలను అర్థం చేసుకుంది
మా కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కల్పించేందుకు కమీషన్ను పెంచింది. ఎన్నో ఏండ్లుగా కమీషన్ పెంచాలని కోరుతున్నాం. అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలే. స్వరాష్ట్రంలో కేసీఆర్ ఒక్కరే ఆదుకుంటున్నరు. మా సమస్యను పెద్దమనస్సుతో అర్థం చేసుకుని మరోసారి కమీషన్ పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం సంతోషంగా ఉంది. సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
– నారె గోదావరి, రేషన్ డీలర్ (వర్షకొండ)