కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 25 : బంజారాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి కమలాకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సప్తగిరి కాలనీలోని సంత్ శ్రీ సేవాలాల్ మందిర స్థలంలో నిర్వహించిన జయంత్యుత్సవాలకు మంత్రి హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేవా నీరతి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. స్వరాష్ట్రంలోని సేవాలాల్ జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు.
జంతు హింస వద్దని, హిందూ ధర్మాన్ని దేశమంతా ప్రచారం చేసిన మహనీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మంత్రి కొనియాడారు. సేవాలాల్ మహారాజ్ మందిర, భవన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా రూ. 30 లక్షలు కేటాయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రొసీడింగ్స్ను మంత్రి సభాముఖంగా బంజారా నాయకులకు అందజేశారు. ప్రస్తుతం ఇచ్చిన నిధులతో భవన నిర్మాణం ప్రారంభించాలని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
అంతకుముందు బంజారాలు నిర్వహించిన హోమంలో మంత్రి.. మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణీహరిశంకర్, కార్పొరేటర్ దిండిగాల మహేశ్, చింతకుంట ఎంపీటీసీ తిరుపతి నాయక్తో కలిసి పాల్గొన్నారు. ఇక్కడ ఉత్సవ కమిటీ నాయకులు లక్ పతి నాయక్, భాసర్ నాయక్, డీటీ నాయక్, బీమా సాహెబ్, తిరుపతి, రాజు నాయక్, రవి నాయక్, సంతోష్ నాయక్, శంకర్ నాయక్ ఉన్నారు.