కార్పొరేషన్, అక్టోబర్ 25: నగరంలో గత పదేళ్లల్లో జరిగిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తున్నదని, ఈ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. నగరంలో సాగుతున్న కాపువాడ రోడ్డు, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, రాత్రిళ్లు వెలుగులు చిమ్ముతున్న వీధి దీపాలను చూసి ఓటు వేయాలన్నారు. నగరంలోని కాపువాడ శివాలయం వద్ద బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరించి ఓటు వేయాలని కోరారు. కాపువాడ శివాలయం నుంచి మారుతీనగర్ మీదుగా మంగళివాడ వరకు జోరుగా ప్రచారం సాగింది.
మహిళలు, కార్యకర్తలు మంగళహారతులు, పూలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి జరుగలేదని, ఎకడ చూసినా మట్టి, ఇరుకు రోడ్లు, రోడ్లపై వంగిపోయిన కరెంటు స్తంభాలు ఉండేవని గుర్తు చేశారు. గతంలో శివారు కాలనీలకు ఆటోలు రాని పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ హయాంలో సీఎం కిరణ్కుమార్రెడ్డి వద్దకు వెళ్లి నిధులు అడిగితే వెకిలిగా నవ్వడం తప్ప రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. స్వరాష్ట్రంలో కరీంనగర్ అభివృద్ధికి నిధులు అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ వందల కోట్లు మంజూరు చేశారన్నారు.
ప్రస్తుతం నగరంలో ఎకడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నగర రూపు రేఖలు మార్చి వేశామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధిష్టానం ఢిల్లీలో ఉంటాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతదని, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ రూ. 5000కు పెంచుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తోడు దొంగలన్నారు. వారికి ఓటు వేస్తే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు నీటి ముటలయ్యాయని ఎద్దేవా చేశారు. అక్కడ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులు ఎత్తివేశారన్నారు.
కరీంనగర్ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, ఓ వైపు కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, మెడికల్ కాలేజ్, వేంకటేశ్వర టెంపుల్, కృష్ణమందిరం నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వెయ్యాలని కోరారు. తనకు మళ్లీ అవకాశం ఇస్తే నగరాన్ని రాష్ట్రంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే మీ పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు కోల మాలతి-సంపత్, నేతికుంట యాదయ్య, నాంపెల్లి శ్రీనివాస్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కుమారుడు ప్రతీక్రావు, నాయకులు గందె కల్పన, శ్రీనివాస్, అర్ష మల్లేశం తదితరులు పాల్గొన్నారు.