కార్పొరేషన్, ఏప్రిల్ 19: కరీంనగర్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 25న నిర్వహించే సమావేశాలను విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మంత్రి నివాసంలో మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రతి కార్యకర్త గుండె నిండా గులాబీ జెండా ఉందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి (వార్డు), గ్రామాల్లో ఇప్పటికే జెండా గద్దెల ని ర్మాణం పూర్తయిందని, లేని ప్రాంతాల్లో వెంట నే నిర్మించి ఈనెల 25న జెండా పండుగ చేయాలన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో, గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ జెండా ఎగరేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3వేల నుంచి 5వేల మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశాలకు జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండ ల పార్టీ అధ్యక్షులు సమన్వయంతో ముందుకు నడిపించాలన్నారు. ఈ మేరకు కరీంనగర్ నియోజకవర్గ సమావేశం రాజశ్రీ గార్డెన్లో, మానకొండూర్ నియోజకవర్గం సమావేశం సుప్రీం ఫంక్షన్ హాల్లో, చొప్పదండి సమావేశం గంగాధర మండలకేంద్రంలోని బీఏఎస్ గార్డెన్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశాలు ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, భోజన విరామం తర్వాత కూడా కొనసాగించాలన్నారు. ఈసమావేశంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఎంపీపీలు పిల్లి శ్రీలత, తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీలు పురమల్ల లలిత, పిట్టల కరుణా, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్, నాయకులు వాసాల రమేశ్, జమీలొద్దీన్, గొనె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.