‘కాంగ్రెస్, బీజేపీ రైతుల పాలిట శత్రువులు. మోటర్లకు మీటర్లు పెట్టి 24గంటల ఉచిత కరెంట్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నయి. కాంగెస్ పాలిత రాష్ర్టాల్లో కూడా మీటర్లు పెడుతున్నారని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలతో నిజమేదో.. అబద్ధమేదో తేలిపోయింది. సీఎం కేసీఆర్ ముందు నుంచి చెబితే ఏదో అనుకున్నం. ఇప్పుడు అర్థమైతున్నది. ఆ పార్టీ అసలు రంగు బయటపడింది. ఇంకా నమ్మి మోసపోం.
పొరపాటున కూడా ఓటు వేయం’ అని జిల్లా రైతులు తేల్చి చెప్పారు. మీటర్లు పెట్టనందుకు రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా నష్టం చేసిన బీజేపీకి ఓట్లడిగే అర్హత లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ, మాయమాటలతో ఆగం చేస్తున్నదని, నమ్మి ఓటేస్తే మన రాష్ట్రంలో కూడా మీటర్లు పెడుతుందని మండిపడ్డారు. అన్నదాతను ముంచే ఆ పార్టీలు మనకెందుకని ప్రశ్నించారు. రైతులకు అండగా నిలుస్తూ.. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్కే ఓటేస్తమని ముక్తకంఠంతో చెబుతున్నారు.
మా బాపు ఇచ్చిన ఐదెకరాలు ఇచ్చిండు. నా చిన్నప్పటి సంది ఎవుసం చేస్తన్న. అప్పట్ల కరెంట్ కోసం అరిగోస పడ్డం. లో వోల్టేజీ, కోతలతో ఆగమైనం. నీళ్లు లేక తిప్పలు వడ్డం. మా బాధలు చెప్తే ఒడిశేటివి కాదు. మళ్లీ ఆ బాధలు పడాలని ఏ రైతు కూడా కోరుకోడు. కోరి కరెంటు కోతలు తెచ్చుకోడు. కేసీఆర్ వచ్చినంక కరెంటు బాధలు తప్పినయ్. నేను ఇప్పుడు ఆడుతూ, పాడుతూ రెండు పసలు సాగు చేస్తున్న. నాడు అరిగోస పెట్టిన కాంగ్రెస్ మళ్లీ ఇప్పుడు మాయమాటలు చెబుతున్నది. అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు కానీ, రైతులను ఆగం చేస్తున్నది. మోటర్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నరని ఇయ్యాలే తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ రైతులపై కుట్రలు చేస్తున్నయని ముందు నుంచి సీఎం కేసీఆర్ చెబుతనే ఉన్నడు.
మాకిప్పుడే అర్థమైంది. కాంగ్రెస్, బీజేపీని ఇంక నమ్ముతమా..? తప్పిదారి ఓటేత్తే కచ్చితంగా మోటర్లకు మీటర్లు పెట్టి ఉచిత కరెంట్ లేకుండా చేస్తరు. అట్లయితే ఇక ఎవుసం పోయినట్టే. మా రైతుల జీవితాలు ఆగమైనట్టే. అందుకే రైతులందరూ అప్రమత్తంగా ఉండాలె. కరెంట్, నీళ్లిచ్చి సాగును బంగారం చేసిన కేసీఆర్కు అండగా ఉండాలె. మూడోసారి సీఎంను చేసుకోవాలె. అనవసరంగా ఆగం కావద్దు.
కరీంనగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కాంగ్రెస్కు ఓటేస్తే బాయిలకాడ మీటర్ల పెడుతరని మాకిప్పుడు అర్థమైంది. నిన్ననే బీజేపీ కేంద్ర మంత్రి నిర్మలమ్మ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం టీవీల్లో జూసినం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అనేక రాష్ర్టాల్లో బాయిల కాడ మీటర్లు పెట్టడానికి అక్కడి ప్రభుత్వాలు ఒప్పుకున్నట్లు వార్తలు జూసినం. ఒక్క కేసీఆరే దీన్ని వ్యతిరేకించినట్టు కేంద్ర మంత్రే చెప్పింది. పాపం కేసీఆర్ ఇన్నాళ్లూ మీటర్ల మాట చెప్తే ఏమో అనుకున్నం. కాంగ్రెస్, బీజేపీ చెప్పే మాటలు నిజం కావొచ్చనుకున్నం. కానీ, ఇప్పుడు అసలు రంగు బయటపడ్డది. ఇంకా నయం. ఎలక్షన్ల తర్వాత అయితే మోసం జరిగేది’ అని జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా తమ మంచికే జరిగిందని, ఇప్పుడు తమకు పూర్తిగా అర్థమైందని చెబుతున్నారు.
రైతుల మీద కేసీఆర్కు ఎంతో ప్రేమ ఉన్నదని, తమ బతుకు దెరువు కోసం కేంద్రంతోనే కొట్లాడిన కేసీఆర్కు కాకుండా ఇంకెవరికి ఓటేస్తామని, బరాబర్ కారు గుర్తుకే ఓటేస్తామని స్పష్టం చేస్తున్నారు. ‘అవ్వా ఇన్ని అబద్ధాలా..? మేం మీటర్లు పెడుతం అనలేదని బీజేపోళ్లు, మేం ఏ రాష్ట్రంలో మీటర్లు పెట్టడానికి ఓప్పుకోలేదని కాంగ్రెసోళ్లు ఇప్పటి వరకు చెప్పిన్రు. మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసిన్రు. మాయమాటలతో మమ్మల్ని మోసం చేసేతందుకు చూసిన్రు. మరి ఇప్పుడు అసలు గుట్టు బయట పడ్డది’ అని మండిపడుతున్నారు. ఇవన్నీ చూస్తే ఎవరేం చెప్పినా వినిపించుకునేది లేదని, తమకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా ఇస్తూ ఆసరా అవుతున్న కేసీఆర్కే అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కరెంటుతోపాటు బావుల కాడ మోటర్ల బిగింపు విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు బీజేపీ కాంగ్రెస్ వ్యవహార శైలిని బట్టబయలు చేసిన నేపథ్యంలో రైతులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు మళ్లీ వస్తయ్. వాళ్లు మూడు గంటల కరెంట్ చాలంటున్నరు. ఇలా ఇచ్చే కరెంట్ రైతులకు ఏ మాత్రం సరిపోదు. నాకు రెండెకరాల పొలం ఉంది. ఈ మూడు గంటల కరెంట్తో ఎట్ల పారుతది. తెలంగాణ వచ్చినంకనే కరెంట్ కష్టాలు పోయినయ్. మళ్లీ కాంగ్రెసోళ్లు చెబుతున్న మాటలను బట్టి చూస్తే ఆనాటి రోజులు గుర్తుకు వచ్చి భయమేస్తంది. ఎప్పుడో అర్ధరాత్రి గంట, రెండు గంటలు ఇచ్చే కరెంట్తో చాలా ఇబ్బందులయ్యేవి. కరెంట్ కష్టాలతో కొంతమంది ఎవుసం వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నయ్. సీఎం కేసీఆర్ హయాంలోనే రైతులు చాలా సంతోషంగా ఉన్నరు. 24 గంటల పాటు ఇస్తున్న కరెంట్తో రైతులు అవసరమైన సమయంలనే నీళ్లు వాడుకొనే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి రైతుల్లో లేదు.
– జీ లక్ష్మయ్య, కొండాపూర్ (కొత్తపల్లి)
కాంగ్రెస్కు ఓటేస్తే రైతులకు పాత కష్టాలు తప్పవు. పంట పండించుకునే పరిస్థితులు ఉండవు, మళ్లీ బీడు భూములే దర్శనమిస్తయి. కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయం మీద సరైన అవగాహన లేదు. ఆ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు. వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ సరిపోతదని, 10హెచ్పీ మోటర్లను వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన రేవంత్రెడ్డికి కనీస జ్ఞానం లేదు. కనీసం 10 నుంచి 12 మంది రైతుల మోటర్ల విద్యుత్ కనెక్షన్లు ఒక 50 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్పై ఆధారపడి ఉంట యి. అదే 25 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్ అయితే 6 నుంచి 7 మోటర్లు ఉంటయి. అవి కూడా 3, 5హెచ్పీ మోటర్లు మాత్రమే. కానీ, ఒక్క వ్యవసాయ బావి వద్ద 10హెచ్పీ మోటరు పెడితే ఎలా సాధ్యమైతది. ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ తక్కువ ఉండడంతో రైతుల మోటర్లు కాలిపోతయ్. మళ్లీ కరెంట్ కష్టాలు వస్తయి.
-కొమ్ముల కరుణాకర్రెడ్డి, రైతు, సదాశివపల్లి (మానకొండూర్)
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మితే రైతులు ఆగమైతరు. రేవంత్రెడ్డికి వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లేనట్టుంది. ఏవో నోటికొచ్చిన ఉత్తి మాటలు చెప్పిండు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలనలో రైతులు కేవలం 5 హెచ్పీ మోటర్లు అంతకంటే తకువ మోటర్లు పెట్టి వ్యవసాయం చేసేటోళ్లు. అలాంటి చిన్న మోటర్లకే బావుల్లో నీరు ఉండక మోటర్లు మొత్తం కాలిపోయేవి. పైగా అప్పుడు నాణ్యమైన కరెంటు ఉండేది కాదు. అప్పుడు కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో ఎవరికీ తెల్వదు. కరెంట్ రాగానే రైతులు మొత్తం ఒకేసారి మోటర్లు వేయడం వల్ల ట్రాన్ఫార్మర్ పేలిపోయేది.
వాటిని రైతులే తీసుకుపోయి రోజుల తరబడి కాపు కాస్తు మరమ్మతులు చేయించుకునేది. రైతులు రోజుల తరబడి దుకాణం చుట్టూ తిరిగి తిప్పలు పడేటోళ్లు. రేవంత్రెడ్డి చెప్పినట్టు 10 హెచ్పీ మోటర్ పెడితే కనీసం గంట కూడా నడువది. ఎంత పెద్ద బావి అయిన సరే గంటలోపే మొత్తం బావిలో నీళ్లన్నీ ఎత్తిపోస్తయి. ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెడతమంటన్రు. చచ్చినా కాంగ్రెస్, బీజేపీ మాట నమ్మం. నమ్మితే మళ్లీ మా బతుకులు ఆగం చేస్తరు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నింటినీ మరిచిపోయి రైతులమంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నం. కేసీఆర్ వెంటే ఉంటం.
-ఎల్లాల లచ్చిరెడ్డి, రైతు, పారువెల్ల (గన్నేరువరం)
మూడు గంటల కరెంటిస్తే రైతులంతా మళ్లీ ఎనుకటి బాట పట్టుడే. ఇష్టమచ్చినప్పుడు సైప్లె చేస్తే బాయిలకాడికి పోయి ప్రమాదాల బారిన పడుతరు. అటు ట్రాన్స్ఫార్మర్లు, ఇటు మోటర్లు కూడా కాలిపోతయి. ట్రాన్స్ఫార్మర్ కోసం వేలకు వేల రూపాయలు కరెంటోళ్ళకియ్యాలె. మోటర్లు కాలిపోతే వేల రూపాయలు వెట్టి మల్ల వైండింగ్ చేయించాలె. పెట్టుబడి తీసుకునుడు పోయి, ఉల్టా మేమే పెట్టుబడి పెట్టాలె. ఇప్పుడు ఐదెకరాల పొలం పారుతంటే, అప్పుడు వాళ్ళిచ్చే కరంటుతో ఎకరం పొలం కూడా పారది. దీంతోని రైతులమంతా పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలు కావాల్సి వస్తది. మళ్ళ ఎవుసం చేయడానికి పెట్టుబడి దొరుకక, తెచ్చిన అప్పులు తీర్చలేక నిండా మునుగుడే అయితది. మళ్లీ ఎనుకటి లెక్క భూములన్నీ పడావు పడుతయి. మేమంతా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు పోవాల్సి వస్తది. మేమోకాడ, మా కుటుంబమోకాడ అన్నట్లుగా మారుతది. మాకు ఇప్పుడున్నట్లుగనే కరెంటు కావాలె. సౌకర్యాలు కల్పించాలె.
– దాడి లక్ష్మణ్, రైతు, ముగ్దుంపూర్ (కలెక్టరేట్)
మూడు గంటల కరెంటుపై కాంగ్రెసోళ్లు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతు న్రు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయానికి మూడు గంటల కరెంటిచ్చి, మోటర్లకు మీటర్లు పెడితే రైతులంతా రోడ్డున పడుతరు. రైతులు సు ఖంగా ఉండడం కాంగ్రెసోళ్లకు ఇష్టం లేదు. 10 హెచ్పీ మోటర్ వాడితే లోవోల్టేజీ ఏర్పడి మోటర్లు కాలిపోతయ్. అక్కరురాని ముచ్చట్లు చెప్పడం కాదు. రైతులకు ఏమైనా పాయిదా ఉండేటట్టు ఆలోచన చేయాలె. వాళ్లను అస్సలు నమ్మం.
– కేశబోయిన రాజయ్య, బోర్నపల్లి(హుజూరాబాద్)
గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంటుకు ఎంత ఇబ్బంది ఉండేది. కరెంటు కష్టాలతో సతమతమయ్యేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా నిరంతరం కరెంటు ఇస్తుండడంతో మాకు ఇష్టమున్నప్పుడు వెళ్లి కరెంటు మోటర్ పెట్టుకుంటున్నం. కాంగ్రెస్ నాయకులు రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందంటున్నరు. వాళ్ల మాటలు నమ్మితే మళ్లి నాటి ఇబ్బందులు మళ్లి వస్తాయి. ఇప్పుడు కరెంటు పెట్టుకుని ఏదైనా పనిఉంటే చేసుకుంటున్నం. వాళ్లిచ్చే మూడు గంటల కరెంటు కోసం ఎదురుచూడాల్నా? మళ్లీ సీఎం కేసీఆరే రావాలి.
– ఓరుగంటి అంజిరెడ్డి, రైతు, చింతలపల్లి(సైదాపూర్)
ఎవుసానికి గంటల లెక్క కరెంట్ ఇస్తామని కాంగ్రెసోళ్లు చెప్పడం మంచిగా లేదు. 3 గంటలు కరెంట్ ఇస్తే ఎన్ని మడులు పారుతాయో వాళ్లకు తెలువదు. ఎన్టీఆర్ తరువాత రైతులకు మంచి సవులత్ చేసింది కేసీఆర్ సారే. అందుకే మళ్లీ కేసీఆర్ సారే రావాలి. కాంగ్రెసోళ్లకు ఓటు వేయద్దు.. ఆగం కావద్దు. కేసీఅర్ సారు రాక ముందు చాలా ఆగమైనం. మళ్ల అట్లాంటి రోజులు రావద్దనుకుంటున్న. అంతకు ముందు ఇండ్లల్ల సక్కగా కరెంట్ ఉండకపోతుండే. అయినా ఒక్కరోజు ఇండ్ల కాడి కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ పీకేసిండ్రు. పొలాల కాడా కరెంట్ ఎప్పుడత్తదో, ఎప్పుడు పోతదో తెలువక పోతుండే. కరెంట్ కోసం పొలాల వద్ద జాగరం చేసిన రోజులు ఉన్నయి. ఇప్పుడు ఆ కట్టాలు తప్పినయ్. మళ్లీ కేసీఅర్ సారు అత్తేనే అన్ని సవులతులు ఉంటయ్.
– గడ్డం రాజయ్య పటేల్, రైతు, మానకొండూర్
వ్యవసాయ బావుల్లో 10 హెచ్పీ మోటర్లు వాడితే భూమిలో (భూగర్భ) జలాలు ఉంటాయా..? తగ్గిపోయి నీళ్లు మోటర్లు పోస్తయా. విద్యుత్ సరఫరాపై అదనపు భారం పడి, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కాలిబూడిదైతయి. చారన కోడికి భారాన మసాల అవుతుంది. కరెంటు బిల్లు ఎంత రావాలో తెలియదా. నాకున్న 2 ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమి 3 గంటల కరెంటుతో పారుతుందా..? నాలాంటి రైతులు నష్ట పోవల్సిందేనా..? 10 హెచ్పీ మోటర్లు నడిస్తే నీళ్లు ఉండొద్దా.. గీ మాత్రం తెలియదా..?
– బండ విజేందర్ రెడ్డి, రైతు, ముంజంపల్లి (మానకొండూర్ రూరల్)
కాంగ్రెసోళ్లు మూడు గంటల కరంటు సాలంటన్రు. అలా అయితే ఎవుసం బంద్పెట్టుకొని పట్నాలకు వలసపోవా ల్సిందే. గతంలో నాకు ఉన్న నాలుగెకరాల భూమిలో వరి పంటవేస్తే కిందిమడి ఎండిపోయేది. పసలుకు రెండు సార్లు మోటర్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు కూడా కాలిపోతే ట్రాక్టర్లో వేసుకొని రిపేరు చేయించుకొని బిగించే వరకు పొలాలు నెర్రలు పట్టేవి. కరంటు కావాలని ధర్నాలు చేసే వాళ్లం. పోలీసులు కేసులు కూడా పెట్టేవారు. బావుల కాడా రాత్రి పూట పండుకుంటే పాములు, తేళ్లు పారేవి. అరిగోస వడ్డం. పంటలు పండుతయో ఎండుతయో తెలువని పరిస్థితి ఉండేది. అలాంటిది కేసీఆర్ 24 గంటల కరంటు ఇచ్చినప్పటి నుంచే బంగారు పంటలు పండుతున్నాయి. రైతులం మూడ పూటల తింటన్నమంటే నీళ్లు, కరంటు మంచిగా ఉండడం వల్లనే.
– మిడిదొడ్డి వెంకటయ్య, రైతు, మందాడిపల్లి(హుజూరాబాద్రూరల్)
మూడు గంటల కరెంట్ అయితే రైతుల బతుకు ఆగమైతది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో రైతులు ఎంతో బాగుపడ్డారు. కాల్వల ద్వారా వచ్చిన నీళ్లు, 24 గంటల కరెంట్ రైతు బతుకుకు భరోసానిచ్చాయి. మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అధినాయకుడు రేవంత్రెడ్డి, వాళ్ల నాయకులు చెప్పడం రైతుల పట్ల చిన్న చూపు చూడడమే అవుతుంది. తెలంగాణలో వాళ్లు అధికారంలోకి వస్తే కరెంట్ను పక్క రాష్ట్రం వారికి అమ్ముకుంటరని వాళ్ల మాటలను బట్టి తెలుస్తున్నది. కాబట్టి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, రైతులందరికీ 24 గంటల కరెంట్ కావాలి.
-భూసారపు కనకయ్యపటేల్, రైతు, హుజూరాబాద్టౌన్
మా బావులకు పది హెచ్పీ మోటర్లు ఏర్పాటు చేసుకోవాలంటే కొత్తగా మళ్లీ ఎవుసం మొదలువెట్టాలె. ఎందుకంటే, ఇప్పుడున్న పైపులైన్లు 5 హెచ్పీ మోటర్లతో వచ్చే నీటికి మాత్రమే సరిపోతయి. ఇప్పుడు వాళ్లిత్తామన్న మూడు గంటల కరెంటు కోసం కొత్తగా 10 హెచ్పీ మోటర్లు కొనుక్కోవాలె. కొత్తగా ఆరించుల పైపులు వేసుకోవాలె. ఎనుకటి లెక్క కరెంటెప్పుడత్తదని ఎదురుసూసుకుంటుండాలె. ఎవుసంతో పాటు చేసుకునే ఇతర పనులు మానుకోవాలె. ఆవులు, బర్లను అమ్ముకోవాలె. ఇవన్నీ చేసి ఎవుసంజేత్తే వచ్చేదెంతయ్యా అంటే పెట్టుబడి మందం కూడా రాదు. ఇలాంటి ఆలోచనతో రైతులు మళ్ళోసారి కూలీలుగ మారుతరు. పనుల కోసం పక్క రాష్ర్టాలకు పోతరు. పిల్లల బడి ఫీజులు చెల్లించలేక వాళ్ళ సదువులు మధ్యల్నే ఆపేయిత్తరు. మరికొంత మంది ఉన్న ఊరును, కట్టుకున్న ఇల్లు, భార్యా పిల్లలను వదిలి పొట్టకూటి కోసం ఇతర దేశాల వీసాలు తీసుకుంటరు. మొత్తం కుటుంబమే ఆగమయ్యే పరిస్థితులు వస్తయ్. ఇలాంటి దుస్థితికి అవకాశమిచ్చే మూడు గంటల కరెంటు మనకవసరమా?
– పొలగాని ఓదెలు, రైతు, ముగ్దుంపూర్ (కలెక్టరేట్)