మెట్పల్లి రూరల్, ఏప్రిల్ 26: ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. మెట్పల్లి మండలం రామారావుపల్లె శివారులోని ఎస్సారెస్పీ కాకతీయ కాలువ 47.160 కిలోమీటరు నుంచి 50.130 కిలోమీటరు వరకు 7.60 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మరమ్మతు పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, మద్దతు ధరతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోశారని, దీంతో వరదకాలువ నిండుకుండలా మారిందని పేర్కొన్నారు. కాకతీయ కాలువ చివరి ఆయకట్టుకూ నీరందించాలన్న సంకల్పతోనే మరమ్మతు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని నాన్ ఆయకట్టు గ్రామాలకు సైతం సాగునీరందించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే సంబంధిత గ్రామాలకు సర్వే కోసం ఉన్నతాధికారులు రానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్ ఎగుర్ల లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు తేలుకంటి శంకరయ్య, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు అనిరెడ్డి మారుతి, ఈఈ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ కోరుట్ల మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశం, నాయకులు ఎగుర్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.