తెలంగాణ చౌక్, ఏప్రిల్ 2 : టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు కుదించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థులు భయం వీడి పరీక్షలు రాయండి. విజయం మీదే. ఆల్ ది బెస్ట్.
హుజూరాబాద్ టౌన్, ఏప్రిల్ 2: నేటి నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హుజూరాబాద్ పట్టణంలో నాలుగు, చెల్పూర్లో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎంఈవో కేవీ నరసింహారెడ్డి ఆదివారం తెలిపారు. మాంటిసోరి హైసూల్లో 158 మంది, న్యూ శాతవాహన సూల్లో 163 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 213 మంది, బాలికల ఉన్నత పాఠశాలలో 178 మంది, చెల్పుర్ జిల్లా పరిషత్ హైసూల్లో 200 మంది చొప్పున మొత్తం 912 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. కాగా, పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని హుజూరాబాద్ టౌన్ సీఐ బొల్లం రమేశ్ తెలిపారు. సెంటర్ల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లల్ని వదిలి కేంద్రానికి వందమీటర్లకు దూరంగా ఉండాలని సూచించారు.
వీణవంకలో..
వీణవంక, ఏప్రిల్ 2: మండలంలో మొత్తం 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 2 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, 300 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నట్లు ఎంఈవో వీ శ్రీనివాస్ తెలిపారు. వీరిలో 33 మంది తెలుగు మీడియం కాగా, 267 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులని చెప్పారు. వీణవంక, చల్లూరు, ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే కేంద్రానికి చేరుకోవాలని, హాల్ టికెట్, పరీక్ష పాడ్, పెన్నులు తీసుకొని రావాలని సూచించారు.