కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 17: జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో సప్తమ బ్రహ్మోత్మవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీభూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హోమాలు, నిత్య పూర్ణాహుతి చేశారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీ కులస్తులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పుస్తెమట్టెలు, సారె సమర్పించారు. సాయంత్రం అశ్వ, గజ వాహన సేవలతో ప్రకాశంగంజ్ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి ఎదురోలు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారు, అమ్మవార్ల తరఫున వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ, కల్వకుంట్ల వేదాంతాచార్యులు ప్రతినిధులుగా గుణగణాలను చర్చించారు. అనంతరం సంధానకర్తగా వ్యవహరించిన వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు రాజారామ్మోహన్ లగ్న పత్రిక చదివి వినిపించారు.
అనంతరం శోభాయాత్రగా స్వామి వారు, అమ్మవార్లు ఆలయానికి చేరుకున్నారు. ఎదురోలు వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాంస్కృతిక కళావేదికపై సల్వాజి ప్రవీణ్ నేతృత్వంలో భజనమండళ్ల పారాయణం, భజనలు, కీర్తనలు అలరించాయి. ఈవో ఉడుతల వెంకన్న, అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు, నాగరాజాచార్యులు, వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఆర్డీవో ఉమామహేశ్వర్, నాయకుడు పురమల్ల శ్రీనివాస్, ట్రాన్స్కో ఎస్సీ గంగాధర్, పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, పోపా జిల్లా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ, కొండా లక్ష్మణ్, జిల్లా యువజన అధ్యక్షుడు శ్రీకాంత్, పోపా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మల్లికార్జున్, పాపన్న, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి కనకయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, చంద్రశేఖర్, సంధ్య, జ్యోతి, బొల్లి రవి, నల్ల శ్రీధర్, కార్పొరేటర్ లెకల వేణు-స్వప్న, చొప్పరి జయశ్రీ, పద్మశాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.