తెలంగాణ చౌక్, జనవరి 19: విద్యార్థులు మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లను ప్రోత్సహించేవారికి దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల, వికాస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన చిత్రలేఖనం పోటీలకు ట్రైనీ ఎస్పీ రాహుల్రెడ్డితో కలిసి హాజరయ్యారు.
మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో మాదకద్రవ్యాలను నిర్మూలించేది నేటి తరం విద్యార్థులేనని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుపై దృష్టి సారించి నిషేధిత డ్రగ్స్, ఇతర మ త్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తం గా అన్ని పాఠశాలల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి జిల్లా స్థాయిలో బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ డీఈవో రమేశ్కుమార్, టౌన్ సీఐ రఘుపతి, ఎస్ఐ రాజు, పాఠశాల యాజమన్యం ఉన్నారు.
వేములవాడ, జనవరి 19: దురలవాటు చెడు మార్గం వైపు నడిపించి జీవితంలో అన్ని కోల్పోయేలా చేస్తోందని వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి పేర్కొన్నారు. పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను నిరోధించే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ విద్యార్థులతో మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవడం మంచి ది కాదని సూచించారు. ఎకడైనా వాటి వినియోగం ఉన్న, చెడు అలవాటుకు ఎవరైనా దగ్గరవుతున్న తమకు సమాచారం అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వప్న, సీఐ కరుణాకర్ ఉన్నారు.
ముస్తాబాద్/కోనరావుపేట/సిరిసిల్ల రూరల్, జనవరి 19: యాంటి డ్రగ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోనరావుపేటలోని మోడల్ స్కూల్, తంగళ్లపల్లిలోని శుభోదయ పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగంపై కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
ఈసందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి, ప్రదర్శించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ముస్తాబాద్లో ఎస్ఐ శేఖర్రెడ్డి, మోడల్స్కూల్లో ఎస్ఐ దువ్వాల ఆంజనేయులు, ప్రిన్సిపాల్ కంకణాల సాగర్, శుభోదయలో కరస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.