వానకాలం సీజన్ సన్నవడ్లకు ఫుల్ గిరాకీ పెరిగింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో విపరీతమైన డిమాండ్ ఉన్నది. దీంతో వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతులతో మాట్లాడుకుని కల్లాల వద్దనే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ముందుగా కోతలకు వచ్చే హుజూరాబాద్ డివిజన్లో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యాపారులు రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్లో కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ సన్నవడ్లపై అక్కడి వ్యాపారులు దృష్టి సారించారు. పెద్దాపూర్, మంగపేట నుంచి వచ్చి మరీ కొనేందుకు సిద్ధమయ్యారు. క్వింటాల్ ధర 2,200 నుంచి 2,500 వరకు చెల్లించేందుకైనా రెడీ అంటున్నారు.
కరీంనగర్,అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : గతేడాది రెండు సీజన్లలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన మెలిక కారణంగా చాలా మంది రైతులు సన్నరకాలను సాగు చేశారు. అయితే, అప్పుడు కొనేవారు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. కొందరు నేరుగా మిల్లర్లకు విక్రయించుకోగా, మరికొందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే సాధారణ రకం దొడ్డు వడ్ల ధరకు విక్రయించుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం, దిగుబడుల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఈసారి వానాకాలం సీజన్లో రైతులు ఎక్కువగా దొడ్డు రకం వడ్లనే సాగు చేశారు. దీంతో సన్న రకం విస్తీర్ణం పడిపోయింది. కరీంనగర్ జిల్లాలో 2,70,948 ఎకరాల్లో ఈసారి వరి సాగు చేయగా కేవలం 35 నుంచి 40వేల ఎకరాల్లోనే సన్నాలు సాగైనట్లు తెలుస్తోంది. ఎకరానికి 20 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా జిల్లాలో 80నుంచి 90వేల మెట్రిక్ టన్నుల వరకు సన్నాల దిగుబడులు ఉండవచ్చని తెలుస్తోంది..
ఇతర రాష్ర్టాల నుంచి వ్యాపారులు
జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం, మానకొండూర్, తదితర మండలాల్లోని రైతులు ఎక్కువగా సన్నాలు సాగు చేస్తారు. గత ఇరవై ఏండ్లుగా హుజూరాబాద్ డివిజన్లోనే అత్యధికంగా సన్న రకాలు సాగు చేస్తున్నారు. ఈసారి కూడా ఇదే డివిజన్లో సన్నాలు ఎక్కువగా సాగైనట్లు తెలుస్తోంది. గతేడాది సన్నాలను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడ్డ రైతులకు ఈసారి ఇతర రాష్ర్టాల నుంచి వ్యాపారులు రావడం, స్థానిక మిల్లర్లు కూడా కొనుగోళ్లకు సిద్ధంగా ఉండటంతో సన్నరకాలు సాగు చేసిన రైతుల పంట పండిందని చెప్పవచ్చు. ఈ నెల 22 నుంచి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుండగా అక్కడ దొడ్డురకం వడ్లనే కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం కనీస మద్దతు ధర ఏ-గ్రేడు రకానికి 2,060, సాధారణ రకానికి 2,040 చెల్లించనున్నారు. కానీ, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక మిల్లర్లు సన్నరకాలు సాగు చేసిన రైతులను గుర్తించి వారి నుంచి నేరుగా వడ్లు కొనేందుకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. తాలు తీసేయకుండా పచ్చి వడ్లను కొంటే క్వింటాల్ ధర 1,700 నుంచి 1,800 వరకు, తేమ శాతం తక్కువ ఉన్న వడ్లకు క్వింటాల్కు 2,200 నుంచి 2,500 వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. హుజూరాబాద్ డివిజన్లో ఇప్పటికే సన్న రకాలు సాగు చేసిన కొందరు రైతులతో ఏపీలోని పెద్దాపూర్ నుంచి వచ్చిన వ్యాపారులు అగ్రిమెంట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నాల్లో బీపీటీ, తెలంగాణ సోన, జైశ్రీరాంతోపాటు ఇతర ప్రైవేట్ కంపెనీలు అందించిన సీడ్స్తో సాగైన రకాలను ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇష్టపడి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దొడ్డురకం వడ్లలో 1010 రకాన్ని కూడా కొందరు వ్యాపారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఆనందంలో రైతులు
హుజూరాబాద్ డివిజన్తోపాటు ప్రతి మండలంలో సన్నాల సాగు శాతం పెరుగుతున్నది. మన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సన్న వడ్లు దిగుబడి తక్కువగా ఉంటుందని భావించే రైతులు ఎక్కువగా దొడ్డు రకాలనే సాగు చేసుకుంటారు. గత సీజన్లో కేంద్రం మెలికలతో విధిలేక సన్నా లు సాగు చేసిన రైతులు చాలా మంది సాధారణ రకం ధరలకే వడ్లు అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ, ఈ వానకాలం సీజన్లో సన్నాలు సాగు చేసిన రైతుల పంట పండింది. ఇతర రాష్ర్టాల నుంచి వ చ్చిన వ్యాపారులు, జిల్లాలోని మిల్లర్లుగా నేరుగా రైతుల వద్దకే వెళ్లి సన్నరకం వడ్లను కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. తేమ శాతాన్ని పక్కనబెట్టి పచ్చి వడ్లను కూడా కొనేందుకు ముందుకు వస్తుండడంతో రైతుల ఇబ్బందులు కూడా తీరుతున్నా యి. హార్వెస్టింగ్ కాగానే వ్యాపారులు నేరుగా వడ్ల ను తీసుకెళ్లేందుకు వాహనాలను సమకూర్చుకుంటామని రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
రైతులకు లాభాలుంటాయి
సన్నాలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో రైతులకు అవగాహన కల్పిస్తున్నది. అలాగే వానకాలం సీజన్లోనూ మా శాఖ రైతులకు సూచనలు చేసింది. యాసంగితో పోలిస్తే వానకాలంలో సన్నాల దిగుబడిపై అంతగా ప్రభావం ఉండదు. ఇప్పుడు రైతుల నుంచే నేరుగా వడ్లు కొనుగోలు చేసుకునేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. కోతలు నిర్వహిస్తున్న కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు కొనుగోళ్లు కూడా జరుపుకుంటున్నారు. ఇది మంచి పరిణామంగా భావించవచ్చు. సన్నాలు సాగు చేసిన రైతులకు మేలు జరుగుతుంది.
– వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో