సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్,డిసెంబర్ 5 : సిరిసిల్ల నేతన్న నైపుణ్యానికి అమెరికాకు చెందిన పరిశోధకురాలు (రీసెర్చ్ స్కాలర్) కైరా జాఫ్పీ అబ్బురపడ్డారు. ‘వాట్ ఏ సర్ప్రైజ్’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత నైపుణ్యం ఎక్కడా చూడలేదని కితాబునిచ్చారు. అమెరికా ప్రభుత్వ పరిశోధనా గ్రాంట్తో ఆసియా ఖండంలోని వవిధ దేశాల్లో చేనేత పరిస్థితుల నైపుణ్యం వంటి రంగాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్న ఆమె, ఇప్పటికే పలు దేశాల్లో పూర్తి చేశారు. మన దేశంలోని తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తర్ప్రదేశ్, తదితర రాష్ర్టాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు. అందులో భాగంగా మన రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్, సిరిసిల్ల, సిద్దిపేట జనగామలో పర్యటించనున్నారు. సోమవారం కైరా జాఫ్పీ సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని సిరిసిల్లకు వచ్చారు.
ముందుగా నేతన్నలతో సమావేశమయ్యారు. పట్టణంలోని పలువురు చేనేత కార్మికుల మగ్గాలను, వారు నేస్తున్న బట్టలను, చేనేత నైపుణ్యతకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. తన వినూత్న చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన వెల్దండి హరిప్రసాద్ను కలిశారు. ఆయన రూపొందించిన చేనేత ఉత్పత్తులను, అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి అబ్బురపడ్డారు. ఇంత నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు చూడలేదని అశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో సిరిసిల్ల నేతన్నలకు ఎదురైన ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, వాటి నుంచి బయట పడ్డ విధానం. ప్రభుత్వం అందించిన సహకారం వంటి వివరాలను టెక్స్టైల్స్ అధికారులు కైరా బృందానికి వివరించారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత కార్మికుల నైపుణ్యంతోపాటు ఒక పవర్ క్లస్టర్గా మారిన తీరును హర్షించారు. సంక్షోభం నుంచి నేతన్నలు స్వయం సమృద్ధి వైపు సాగిన విధానాన్ని తెలుసుకొని అభినందించారు. క్షేత్ర పరిశీలనలో అమె వెంట తెలంగాణ మరమగ్గాలు, జౌళీ అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టైక్స్టైల్ అధికారులు ఉన్నారు.