కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదు
కవులు, రచయితలు మతోన్మాదాన్ని తిప్పికొట్టాలి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో విప్లవంలా అభివృద్ధి
కార్యసాధకుడు మంత్రి కేటీఆర్
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్
నేతన్న చౌరస్తా, జూన్ 19: రేపటి తెలంగాణకు సిరిసిల్ల ప్రగతే ప్రతిబింబమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో విప్లవంలా అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణకు గొప్ప చారిత్రక నేపథ్యమున్నదని, ఇక్కడ భూమి కోసం, భుక్తి కోసం, అస్థిత్వం కోసం సాగించిన ఉద్యమాలన్నీ విజయవంతమయ్యాయని చెప్పారు. 14 ఏండ్లపాటు సాగిన ప్రత్యక రాష్ట్రపోరు ప్రతి ఒక్కరీలో చైతన్యస్ఫూర్తిని రగిలించిందన్నారు. ఇక్కడి ప్రజలు కులమతాలకతీతంగా కలిసి మెలిసి జీవిస్తున్నారని చెప్పారు.
కవులు, కళాకారులు, రచయితలు మతం పేరిట జరుగుతున్న ఉన్మాదాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే ఓర్వలేని కొన్ని శక్తులు చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాయని, అలాంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిరిసిల్ల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. నేత కార్మికుల అభ్యున్నతికి ఆయన అనేక పథకాలు అమలుచేయించారని చెప్పారు. అలాగే పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి పట్టణాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా, ఐటీ రంగంలో హైదరాబాద్ను మేటిగా నిలిపిన కేటీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. సమైక్య పాలనలో ఉరిసిల్లగా ఉన్న ఈ గడ్డను సిరులసిల్లగా నిలిపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ సమావేశం అనంతరం జిల్లా మానేరు రచయితల సంఘం ధ్వర్యంలో స్థానిక జిల్లా గ్రంథాలయంలో గూడూరి సీతారాం కథా పురస్కారాన్ని ప్రముఖ రచయిత పూడూరి రాజిరెడ్డికి ప్రదానం చేసి సత్కరించారు.అనంతరం ఆయన రచించిన సహన పరీక్ష పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి ప్రవీణ్, అఖిల భారత తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాథం, మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుడు డాక్ట ర్ పత్తిపాక మోహన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.