‘శక్తివంచన లేకుండా కష్టపడుదాం. జిల్లాను స్వచ్ఛసర్వేక్షణ్లో అగ్రగామిగా నిలుపుదాం’ అనే నినాదంతో రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ముందుకుసాగుతున్నది. పల్లెలు మురిసేలా, పట్టణాలు మెరిసేలా సకల హంగులు కల్పించి మెరుగైన ర్యాంకు సాధనే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నది. ఇటీవలే మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో 28 అంశాలపై దిశానిర్దేశం చేయగా, ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. 40లక్షలతో మండలానికో ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అలాగే జిల్లావ్యాప్తంగా 500 కమ్యూనిటీ ఇంకుడుగుంతలు నిర్మించనున్నది. పర్యవేక్షణకు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలను నియమించడమే కాదు, రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించనున్నది.
రాజన్నసిరిసిల్ల, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో రాజన్నసిరిసిల్ల జిల్లా వరుస అవార్డులతో దూసుకెళ్తున్నది. గతేడాది నాలుగో ర్యాంకింగ్లో నంబర్వన్ స్థానం సాధించింది. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఐదో ర్యాంకింగ్లోనూ అగ్రగామిగా నిలిచేదిశగా ముందుకుసాగుతున్నది. నిర్దేశిత 28 అంశాల్లో గుణాత్మక పురోగతి సాధించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలను రూపొందించింది. పల్లెలు, పట్టణాలకు సకల హంగులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా పారిశుధ్యానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా ప్రతి మండలానికో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్, ప్రతి పంచాయతీకి రెండు కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టనున్నది. చెత్తను రోడ్లపై వేస్తే 500 ఫైన్ వేయనున్నది. పర్యవేక్షణకు 15 మంది స్వచ్ఛ దూతలతో ప్రత్యేక టాస్క్ పోర్సు రూపుదిద్దుకుంటున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్-2024, ఐదోర్యాంకింగ్లో మరోసారి నంబర్వన్గా నిలిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో కలెక్టర్ అనురాగ్ జయంతి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఓసమావేశంలో తీసుకోవాల్సిన 28 అంశాలపై దిశానిర్దేశం చేశారు. పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ కార్పొరేషన్, మండల అభివృద్ధి శాఖ అధికారుల భాగస్వామ్యంతో కార్యాచరణ రూపొందించారు.
ప్రతి పంచాయతీకి రెండు ఇంకుడు గుంతలు
స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన స్థానం దక్కించుకునేందుకు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. అందులో భాగంగా ప్రతి పంచాయతీకి రెండు చొప్పున సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 500 కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. పనులు శరవేగంగా సాగుతుండగా వారం పదిరోజుల్లో పూర్తిచేయనున్నారు. ఇవి అందుబాటులోకి రాగానే గ్రామంలోని డ్రైనేజీల్లోని మురుగునీటిని కమ్యూనిటీ ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తారు. పర్మినెంట్ డ్రైనేజీలు లేని చోట కచ్చా కాలువలు నిర్మించి వాటి చివరన ఇంకుడు గుంత నిర్మిస్తారు. ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కిచెన్ గార్డెన్ ప్లాంటేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు..
పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ను తరిమికొట్టేందుకు యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్లను నిషేధించింది. పక్కాగా అమలు కోసం తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించింది. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి గురువారం ప్లాస్టిక్ ఫ్రీ పేరిట వివిధ పాఠశాలల విద్యార్థులకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రతి మండలానికి 40లక్షలతో ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వినూత్న పద్దతులను అవలంబించనున్నారు. అందులో షెడ్డు నిర్మాణం, ప్లాస్టిక్ క్లీనింగ్ యంత్రం, షెడ్డింగ్, ప్యాకింగ్ యంత్రాలుంటాయి. టాయ్లెట్ వ్యర్థాలను ప్రైవేట్ వాహనాల ద్వారా జిల్లా కేంద్రంలోని రీసోర్సు పార్కుకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.
చెత్త వేస్తే ఫైన్ తప్పదు
రోడ్లపైనా చెత్తా చెదారం వేస్తే ఇక నుంచి ఫైన్ కట్టక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో అధికారులతోపాటు గ్రా మంలోని మహిళలు, యువకులను నియమించనున్నారు. ఈ కమిటీల నిర్వహణను ఏఈ ఆర్ డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ పంచాయతీరాజ్, మండ ల పరిషత్ అధికారులకు అప్పగించారు. అలాగే మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రామానికి 15 మంది స్వచ్ఛ దూ తలను నియమించనున్నారు. వీరికి టీషర్టులు, టోపీలతో గుర్తింపునిస్తారు. స్వచ్ఛదూతలు, టా స్క్ఫోర్సు బృందాలు గ్రామాల్లో పర్యటించి రోడ్లపైన చెత్త వేసిన వారి వివరాలు సేకరించి గ్రామ కార్యదర్శికి నివేదిస్తారు. గ్రామ కార్యదర్శి బాధ్యులకు 500ల వరకు జరిమాన విధిస్తారు. తాగునీరు, మురుగు కాలువలు, కంపోస్టు షెడ్లు, తడి, పొడిచెత్త, నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టారు.