సిరుల వేణి.. సింగరేణి విజయ ప్రస్థానం కొనసాగుతున్నది. నాటి సమైక్య చీకట్లను తొలగించుకొని విజయభేరి మోగిస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో పునర్జీవం పోసుకొని వెలుగుల మణిహారంగా ప్రకాశిస్తున్నది. కార్మికుల సంక్షేమం, కారుణ్య నియామకాలు, కొత్త కొలువులు, ఉత్పత్తి, రవాణా ఇలా అన్నింటా దూసుకెళ్తూ, అంచలంచెలుగా ప్రగతి సాధిస్తున్నది. థర్మల్, సౌర విద్యుత్ ఉత్పత్తితో మరో మైలురాయిని దాటడమేకాదు, దేశంలో మరే సంస్థలో లేనివిధంగా భారీ లాభాలు సాధించి రికార్డులను తిరగరాస్తున్నది. ఓ వైపు విస్తరణలోనూ కీలక అడుగులు వేస్తూ ఇతర రాష్ర్టాల్లోని గనులను దక్కించుకున్న సంస్థ, నేడు 103వ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైంది. మరోవైపు ఏటా పన్నుల రూపంలో సంస్థ నుంచి వేల కోట్లు తీసుకుంటూ కేంద్రం సింగరేణికి మొండిచేయిచూపడం, పైగా నాలుగు బొగ్గు బ్లాకులను అమ్మివేసే చర్యలకు సిద్ధంకావడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.
గోదావరిఖని, డిసెంబర్ 22: సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో అనేక ఇబ్బందుల పాలై, ము క్కుతూ.. మూలుగుతూ నడిచిన సింగరేణి స్వరాష్ట్రంలో జీవం పోసుకున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో పూర్వవైభవం సంతరించుకున్నది. బొగ్గు ఉత్పత్తిలో, లాభాల్లో, సేల్స్ పెంచుకోవడంలో, సింగరేణి విస్తరించడం, వివిధ రంగాల్లోకి వెళ్లడం లాంటి కార్యకలాపాలతో ఊహకందని ప్రగతి సాధిస్తున్నది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వాటా కలిగి ఉన్న సింగరేణికి సీఎం కేసీఆరే పెద్ద దిక్కుగా నిలిచి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకా లు, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, లాభాల్లో 30శాతం వాటా, ఇతర ఎన్నో లాభాలు కల్పిస్తున్నారు. అటు బొగ్గు ఉత్పత్తిలో, లాభాల్లో అగ్రస్థానంలో నిలబెడుతున్నారు.
సింగరేణిపై కేంద్రం కక్ష
సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టింది. కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నది. గడిచిన ఐదేండ్లలో సింగరేణి జీఎస్టీ, ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్, క్లీన్ ఎనర్జీ సెస్, సెంట్రల్ సేల్స్ టాక్స్, సర్వీసు టాక్స్, ఇతర పన్నుల రూపేణా భారీగానే చెల్లిస్తున్నది. 49శాతం వాటా కలిగిన కేంద్రానికి సింగరేణి నుంచి ఎక్కువగా నిధులు వెళ్తున్నా, సంస్థకు మాత్రం కేంద్రం నుంచి నయాపైసా లాభం జరుగడం లేదు. రాష్ర్టానికి సింగరేణి నుంచి ఆదాయం వస్తున్నా అంతకన్నా ఎక్కువగానే సీఎం కేసీఆర్.. కార్మికులకు అందజేస్తూ వారి మన్ననలు పొందుతున్నాడు. కేంద్ర ప్రభు త్వ పరిధిలో ఉన్న సింగరేణి కార్మికుల ఆదాయపన్ను అంశం చాలా ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా పోతుంది. అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపినా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై తమకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్వయంగా ప్రధాని మోదీ ఇటీవల రామగుండం పర్యటనలో చెప్పారు. కానీ నెలరోజులు తిరక్కుండానే 4 బొ గ్గు బ్లాకుల వేలం పాటకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేండ్లలోనే సంస్థ నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిగిన లబ్ధి వివరాలు పరిశీలిస్తే తెలిసిపోతుంది.
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట..
2020-21 ఆర్థిక సంవత్సరంలో 70మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ సారి రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి సాధించడం సాధ్యమని పేర్కొంటుంది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేవలం 50మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి 70మిలియన్ టన్నులకు చేరుకోవడం విశేషం. అంతక్రితం అరకొరగా ఉన్న లాభాలు భారీగా పెంచుకుంటూ, మరింత ముందుకు సాగుతున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రికార్డు స్థాయిలో 1766 కోట్ల లాభాలు ఆర్జించింది. కొవిడ్ సంక్షోభంలోనూ రెండేండ్లలో రెండు దపాలుగా 2400 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్ధూర్లుగా రెగ్యులరైజ్ చేశారు. 100కు పైగా డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు కల్పించారు. కొవిడ్ టైంలో నిలిపివేసిన 15రోజుల వేతనాన్ని తిరిగి చెల్లించడం, ఆన్డ్యూటీలో ఉండి మృతి చెందిన వారికి రూ.5లక్షలు ప్రకటించారు. కొవిడ్తో నిలిచిపోయిన మెడికల్ బోర్డును ప్రారంభించడం ద్వారా కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించేలా చర్యలు పట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణి స్వరూపం మారిపోతుందని ఆనాడు సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యమయ్యాయి.
విస్తరణకు వేగంగా అడుగులు
‘సింగరేణి’ విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఒడిశాలోని నైని, న్యూపాత్రపాద బ్లాకులను చేజిక్కించుకుంది. వీటి ద్వారా ఏటా 10మిలియన్ టన్నులకుపైనే బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశముంది. అయితే ఓసీపీగా ఆవిర్భవించనున్న ‘నైని’ ద్వారా భారీ బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశాలుండగా, మరి కొద్దిరోజుల్లోనే ఉత్పత్తి ప్రారంభించనున్నారు. అయితే సింగరేణి బొగ్గుకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో సింగరేణిని విదేశాల్లో సైతం విస్తరించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రణాళికలు వేస్తున్నారు. సింగరేణిలో యూనియన్లకు చెందిన నాయకులను దక్షిణాఫ్రికా, మొజాంబిక్, అస్ట్రేలియాకు పంపించి పూర్తి స్థాయి అధ్యయనం చేయిస్తూనే, ఆయనే స్వయంగా విదేశాల్లో పర్యటించి సంస్థకు అనువైన బొగ్గు బ్లాకులను దక్కించుకునే ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. విదేశాల్లో బొగ్గు బ్లాకులను కొనుగోలు చేయడం, ఇతర రాష్ర్టాలో విస్తరించడం వల్ల సింగరేణి రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో రామగుండం ఎన్టీపీసీకే 30శాతం బొగ్గును అందజేస్తున్నది. దీనికి తోడుగా టీజెన్కోకు పంపుతున్న సింగరేణి, రానున్న రోజుల్లో ఎంత ఉత్పత్తి చేసినా అందుకుతగ్గ డిమాండ్ ఉండే అవకాశాలున్నాయి. సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తుంటే కేంద్రం మాత్రం సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం ద్వారా అమ్మే ప్రయత్నం చేస్తోంది. దీనిని రాష్ట్ర సర్కారుతోపాటు సింగరేణి సంస్థలోని కార్మిక సంఘాలు, కార్మికులు పూర్తిగా వ్యతిరేకిస్తూ 3 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతున్నారు.
ఇదీ సింగరేణి ఆవిర్భావం..
ఖమ్మం జిల్లా సింగరేణిలో పురుడుపోసుకున్న సంస్థ 1889లో బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నది. 1880 నుంచి బొగ్గు అన్వేషణకు శ్రీకారం చుట్టగా, భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ చొరవతో ఈ అపార బొగ్గు నిక్షేపాల సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. మొదట ఆంగ్లేయుల ఆధీనంలో నడిచిన సంస్థ, ఆ తర్వాత నిజాం నవాబుల ఆధీనంలోకి వచ్చింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధిపతిగా ఉంటూ సింగరేణిని ముందుకు తీసుకెళ్లారు. 1920 డిసెంబర్ 23 నుంచి హైదరాబాద్ సంస్థానం ఈ సంస్థను స్వాధీనం చేసుకొని, కార్యకలాపాలు మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఈ సంస్థ అంచెలంచెలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ముందుకు సాగింది. 1992 నుంచి 1996 మధ్య కాలంలో బీఐఎఫ్ఆర్ అంచుల దాకా వెళ్లి వచ్చిన సింగరేణి ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి వెనుతిరిగి చూడకుండా లాభాలు ఆర్జిస్తూ ముందుకు సాగుతున్నది. అప్పటి నుంచి లాభాల్లో వాటాను 10శాతం నుంచి 2020-21లో 29శాతానికి పెంచి అందిస్తున్నారు.
స్వరాష్ట్రంలో కార్మికులకు లబ్ధి