వీణవంక, ఆగస్టు 16: పరీవాహక రైతులకు వరప్రదాయినిగా ఉన్న మానేరువాగు నిత్యం ఇసుక దోపిడీతో నీళ్లు అడుగంటి వెలవెలబోతున్నది. ఓ వైపు ఇసుక రీచ్లలో రోజుకు వందలాది లారీల్లో ఇతర జిల్లాలకు ఇసుక తరలిపోతుంటే.. మరో వైపు ట్రాక్టర్లలో అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొండపాకలో నుంచి అక్రమంగా తరలుతున్నది. అయితే పోలీసులు పట్టుకుంటుండడంతో ఇసుకాసురులు సరికొత్త దందాకు తెరలేపారు. నిత్యం మానేరు వాగు నుంచి వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. పోలీసులకు దొరికే సమయంలో తెలివిగా వ్యవహరిస్తూ గ్రామపరిసరాల్లో డంపులు చేస్తున్నారు.
అధికారులు ఆ ఇసుక కుప్పలను సీజ్ చేసినా.. వేలం వేసిన సమయంలో ఎవరూ ఊహించని రీతిలో వాళ్లే దక్కింకుంటున్నారు. నెలలు గడిచినా ఆ డంపులనే చూపుతూ ఇసుక తరలిస్తున్నారు. ఇదే సమయంలో గ్రామ పరిసరాల్లో నిల్వ చేస్తున్నారు. వీటిని అధికారులు గుర్తించి మళ్లీ వేలం నిర్వహిస్తున్నా.. ఇసుక అక్రమరవాణా దారులే రంగంలోకి దిగుతున్నారు. వేలం పాట ఇసుక పేరుతో మానేరులో నుంచి బయటకు ఇసుకను తెచ్చి, అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నారు. పంద్రాగస్టు రోజున పోలీసులు జెండా సమయంలో బయటకు రారని తెలుసుకున్న ఇసుకాసురులు అక్రమ రవాణాకు ప్రయత్నించగా.. వచ్చిన సమాచారంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ వెళ్లగా రామకృష్ణాపూర్ రోడ్డుపైనే ఇసుకను డంపు చేసి పారిపోయారు.
ఇలా దందా చేస్తూ లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కొండపాక గ్రామస్తులు కోరుతున్నారు. ఇసుక అక్రమ దందాపై ఎస్ఐ ఆవుల తిరుపతిని వివరణ అడుగగా, కొండపాక మానేరువాగు నుంచి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, గతంలో ఇసుకను తోడే ఎక్స్కవేటర్లు, ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశామని చెప్పారు. పంద్రాగస్టు రోజు ఒకరిని పట్టుకొని కేసు నమోదు చేశామని, అక్రమ ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.