సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ గాడి తప్పింది. ప్రభుత్వ పట్టింపులేమి.. అధికారుల నిర్లక్ష్యంతో సేకరణ పూర్తి అధ్వానంగా.. మందకొడిగా సాగుతున్నది. పలుచోట్ల సెంటర్లకు ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా వెనువెంటనే కొనకపోవడం, మరోవైపు తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలింపులో జాప్యంతో కేంద్రాల్లోనే ధాన్యం మూలుగుతున్నది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు కేవలం 1,25,808 మెట్రిక్ టన్నులు కేవలం (41 శాతమే) పూర్తికావడం పరిస్థితికి అద్దంపడుతున్నది. మరోవైపు తప్ప, తాలు పేరిట అదనపు తూకం వేస్తూ దోపిడీ చేస్తుండడంతో రైతాంగం నిండా మునుగుతున్న పరిస్థితి కనిపిస్తుండగా, పట్టని ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, మే 16( నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగిలో లక్షా 93 వేల 330 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ 132, పీఏసీఎస్ 96, డీసీఎంఎస్ 1, మెప్మా 7 సెంటర్లు ఉండగా, కొనుగోళ్లు మొదలై నెల రోజులు దాటినా సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రక్రియ పూర్తిగా మందకొడిగా సాగుతున్నది. ఇప్పటి వరకు కేవలం లక్షా 25 వేల 808 మెట్రిక్ టన్నులు అంటే 41 శాతం మాత్రమే కొనుగోలు చేయడంతో సెంటర్లలోనే ధాన్యం పేరుకుపోతున్నది. ఈ నెలాఖరు వరకు ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తి చేయాల్సి ఉన్నా, క్షేత్ర స్థాయిలో ఆలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మొదటి నుంచీ నిర్లక్ష్యమే కనిపిస్తున్నది. కేంద్రాలకు ధాన్యం వచ్చినా సెంటర్లు ప్రారంభించకపోవడం, ప్రారంభించిన తర్వాత వెనువెంటనే కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో జాప్యం చేయడం, తూకం వేసిన బస్తాలు ఎండకు బరువు తగ్గుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు.. మండుటెండలతో నిత్యనరకం చూస్తున్నామని వాపోతున్నారు. మరోవైపు తాలు, తప్ప, తరుగు పేరిట ధాన్యంలో కోత పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇక జిల్లాలోని పలు కేంద్రాల్లో లారీల కొరతతో రైతులే ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తున్నారు. అయితే ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై కొద్దిరోజులుగా కోనరావుపేట, ఇల్లంతకుంట, రుద్రంగి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, చందుర్తి పలు మండలాల్లో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉండడంతో ఇటీవల ముఖ్యమంత్రి సైతం కొనుగోళ్లపై సమీక్షించడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ఈ క్రమంలో కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు దీంతో రెవెన్యూ శాఖ అధికారులు సహా పోలీస్, రవాణా విభాగం అధికారులు కేంద్రాల బాట పడుతున్న పరిస్థితి ఉంది. మరో 13 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి వస్తాయని వాతావరణ శాఖ సూచనతో ఆందోళన చెందుతున్న రైతుల్లో పలువురు దళారులకు అమ్ముకోవడం సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నది.
నేను ఎకరంన్నర భూమిలో వరి వేసిన. మూడు ట్రాక్టర్ల వడ్లు పండినయి. 20 రోజుల క్రితం రగుడులోని సెంటర్కు తీసుకవచ్చినం. వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసింది. సెంటర్లోనే ఆరబెట్టుకున్నా. 20 రోజులకు సీరియల్ వచ్చింది. సగం వడ్లే 30 బస్తాలే జోకిర్రు. సగం వడ్లను గడ్డి తాలు ఉందని ఆపిన్రు. మళ్లీ ఆరబెట్టాలని చెప్పిర్రు. చానా రోజులు తిప్పలు పడితే ఆఖరికి మిగిలిన వడ్లు జోకిర్రు. కానీ లారీలు లేక బస్తాలు సెంటర్లనే ఆగినయి. నిన్ననే మిల్లుకు పోయినయి.
– బూర నాగరాజు, యువరైతు రగుడు