Ramagundam | కోల్ సిటీ, జులై 23 : రామగుండం రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది. రామగుండం నగరపాలక సంస్థకు చుక్కెదురైంది. అధికార కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు తేటతెల్లమైంది. ఎన్ఐయూఎం, పురపాలక పరిపాలన శాఖ సంచాలకులు సారథ్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డు సభ్యులకు హైదరాబాద్ గచ్చిబౌలి ఆడిటోరియంలో నాలుగు బ్యాచులుగా విభజించి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం 9:30 గంటలకు రామగుండం కార్పొరేషన్ కు సంబంధించిన కార్పొరేటర్లు శిక్షణ తరగతులకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఊహించని రీతిలో రామగుండం కార్పొరేటర్లు ఈ శిక్షణ తరగతులను బహిష్కరించడం స్థానిక రాజకీయాల్లో పెను దుమారంగా మారింది.
నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ తీరు పట్ల కొద్దిరోజులుగా కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలనే నగరపాలక కార్యాలయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ కార్పొరేటర్లు మూకుమ్మడిగా బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన విధితమే. పాలకవర్గం ఏర్పడిన ఆరు నెలల్లోనే మెజార్టీ కార్పొరేటర్లు తిరుగుబాటుకు సిద్ధం కావడం రామగుండం రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాదులో జరిగే శిక్షణ తరగతులకు రామగుండం కార్పొరేటర్లు వెళ్లకపోవడంతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బస్సులు కదలకుండా ఉండిపోయాయి. కేవలం ఒకరిద్దరు మాత్రమే తమ వ్యక్తిగత వాహనాల్లో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. ఈ పరిణామానికి నగరపాలక అధికారుల సమన్వయ లోపమే కారణంగా కార్పొరేటర్లు బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు ఎక్కడికి దారితీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠగా మారింది.