మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్ ఉద్యోగుల ‘పే స్కేల్ కల’ నెరవేరింది. రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేయగా, సెర్ప్ ఉద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు. జీవో ప్రకటన వెలువడిన నాటి నుంచే సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో స్పందించి తమకు గుర్తింపునిచ్చారని, ఇది తాము మరువలేమని చెబుతున్నారు.
పెద్దపల్లి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : నాడు ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులను ఎవరూ పట్టించుకోలేదు. వేతన స్కేలు కోసం రెండు దశాబ్దాలుగా వేచి చూస్తున్నా వారి కల నెరవేరలేదు. మహిళా సంఘాల చైతన్యం కోసం నిరంతరం శ్రమించినా, ఉద్యోగ భద్రత లేకుండా 9వేల జీతానికి పనిచేసినా గుర్తింపు దక్కలేదు. కానీ, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కల నెరవేరింది. ముఖ్య మంత్రి కేసీఆర్ అప్పటిదాకా ఉన్న ఇందిరాక్రాంతిపథం (ఐకేపీ) పేరును సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ)గా మార్చి సెర్ప్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. 42 శాతం జీతాలను పెంచి అండగా నిలిచారు. గతేడాది ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీని తీసుకువచ్చారు. అదే విధంగా మరోసారి 30 శాతం జీతాలను పెంచారు. దీంతో తెలంగాణ ఆవిర్భావానికి ముందు 9వేల వరకు ఉన్న జీతాలు 25వేలకుపైగా అయ్యాయి.
తా జాగా శనివారం (మార్చి 18న) తెలంగాణ ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు అమలు చేస్తామని నిర్ణయించి జీవో 11 జారీ చేయడంతో మరో 10వేల వరకు జీతం పెరిగే అవకాశమున్నది. ఏప్రిల్ నెల ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రానున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలో 400 మందికిపైగా సెర్ప్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. కరీంనగర్ జిల్లాలో 117 మంది, జగిత్యాలలో 102, పెద్దపల్లి జిల్లాలోనే 95 మంది, సిరిసిల్ల జిల్లాలో ప్రయో జనం దక్కనున్నది. ఇకపై సెర్ప్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు రానుండగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెర్ప్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు పే స్కేల్ వర్తింపజేయడాన్ని స్వాగతిస్తూ శనివారం నుంచే సంబురాలు చేసుకుం టున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ఎక్కడికక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు.
వేతనాలు ఇలా..
సెర్ప్లోని ఒక్కో క్యాడర్ ఉద్యోగికి ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా వేతనం చెల్లించాలో ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉదాహరణకు కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ (సీసీ)లకు జూనియర్ అసిస్టెంట్ హోదా, ప్రాజెక్టు మేనేజర్లకు ఎంపీడీవో హోదా ఇచ్చారు. సెర్ప్ ఉద్యోగులకు ప్రస్తుతం డీఏ అమలులో లేదు. పేస్కేల్ ద్వారా డీఏ కూడా వర్తించనున్నది.
మా చిరకాల కల వేరింది..
తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)ఉద్యోగులకు జీవో నెంబర్ 11 ద్వారా పే సేల్ను అమలు చేయడంతో మా చిరకాల కల నెరవేరింది. నేను 20 ఏండ్లుగా సెర్ప్లో ఉద్యోగం చేస్తున్న. 2,150 జీతంతో ఉద్యోగంలో చేరిన. ప్రస్తుతం నాకు 25వేల వరకు వస్తున్నది. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. మాతో వెట్టి చాకిరి చేయించుకున్నయ్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మా బతుకుల్లో వెలుగులు నింపిండు. ఇక ప్రభుత్వోద్యోగులతో సమానంతో వేతనాలు అందుతయ్. రాష్ట్రంలో 3974 మందికి, పెద్దపల్లి జిల్లాలో 95 మందికి లబ్ధి చేకూరుతుంది. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ కల్పించడం చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, హరీశ్రావు, సీఈవో సందీప్కుమార్ సుల్తానియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్న.
– గుర్రం రమేశ్, సెర్ప్ ఎంప్లాయిస్ యూనియన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, సీసీ (మంథని)
ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతాలు..
ఇంతకుముందు మాకు క్యాడర్ కేటాయింపు అనేది లేదు. పే స్కేల్ అమలుతో క్యాడర్ కేటాయింపు వస్తుంది. ఆఫీస్ సబార్డి నేటర్ మొదలుకొని ఎంపీడీవో స్థాయి వరకు మా డిపార్ట్మెం ట్లో క్యాడర్ ఇస్తరు. మేం ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతాలు తీసుకుంటం. గత ప్రభుత్వాలు మాతో వెట్టి చాకిరీ చేయించుకున్నాయే తప్ప, మా గురించి ఏనాడూ ఆలోచించ లేదు. సీఎం కేసీఆర్ మమ్మల్ని గుర్తించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం.
– శైలజాశాంతి, ఏపీఎం (కమాన్పూర్)