సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న సీఎం కేసీఆర్, మైనార్టీలకు తీపి కబురు అందించారు. బీసీలకు అందజేస్తున్న మాదిరిగా వందశాతం సబ్సిడీతో రూ.లక్ష సాయం ఇవ్వాలని, వెంటనే అమలు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం జీవో ఆర్టీ నెం. 78ద్వారా ప్రభుత్వ కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్ ఉత్తర్వులు కూడా విడుదల చేయగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30వేల మంది ముస్లిం, క్రిస్టియన్ కుటుంబాలకు మేలు జరుగబోతున్నది.
– కలెక్టరేట్, జూలై 23
కులాలు, మతాలకతీతంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, దార్శనిక పాలనతో ముందు కు సాగుతున్నది. ఇందులో భాగంగానే మైనార్టీలలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి కల్పనతో పాటు సంస్థాగత అభివృద్ధే లక్ష్యంగా పలు వినూత్న పథకాలు రూపొందించి, వాటిని సమర్థవంతంగా కొనసాగిస్తూ, వారి సంక్షేమంపై సర్కారుకు ఉన్న నిబద్ధతను చాటుతోంది. ఫలితంగా ఉమ్మడి పాలనతో పోల్చితే స్వరాష్ట్రంలో మైనార్టీల్లో నెలకొన్న పేదరికం, వెనుకబాటుతనం 70శాతానికి పైగా తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా 30శాతాన్ని కూడా పారదోలే క్రమంలోనే సీఎం కేసీఆర్ వందశాతం సబ్సిడీతో రూ.లక్ష రుణం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీలకు అందజేస్తున్న మాదిరిగానే వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయిస్తూ, ఆదివారం జీవో నెంబర్ 78ద్వారా ఉత్తర్వులు విడుదలయ్యాయి. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తూ, వారి సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలను కూడా గౌరవిస్తూ, గంగా జమున తెహజీబ్ను కాపాడే ప్రక్రియలో భాగంగా మైనార్టీలకు ఆర్థిక సాయం చేస్తుండడాన్ని జిల్లాలోని మైనార్టీ వర్గాలు స్వాగతిస్తున్నాయి.
రూ.లక్ష సాయం పథకానికి మైనార్టీల్లో అర్హులైన వారికి వర్తింపజేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు కూడా ఉత్తర్వులతో పాటు విడుదల చేసింది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింపజేయాలని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ముస్లింల నుంచి ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా తీసుకున్న దరఖాస్తుల్లో నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని, అలాగే తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కొత్తగా దరఖాస్తులు తీసుకుని అర్హులను గుర్తించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుదారు వ్యక్తిగత వయోపరిమితి ఈ ఏడాది జూన్ 2 నాటికి 21 నుంచి 55 ఏండ్లలోపు మాత్రమే ఉండాలని, వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారికైతే రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.2లక్షలుగా నిర్ణయించింది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఎంపిక జాబితాను టీఎస్ఎంఎఫ్సీ వెబ్సైట్లో ప్రదర్శించాలని, వన్టైం గ్రాంట్గా సబ్సిడీ విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
గత ప్రభుత్వాలు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయే తప్ప బాగోగులను ఏమాత్రం పట్టించుకోలె. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ పాలనలో మాకు గుర్తింపు దక్కింది. మైనార్టీల్లో విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా మైనార్టీ రెసిడెన్సియల్ స్కూళ్లు, రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు కానుక, షాదీముబాకర్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. మైనార్టీల్లోని పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇప్పుడు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేయడం హర్షనీయం. ఈ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలవడం ఖాయం.
– యూసుఫ్అలీ, మైనార్టీ నాయకుడు (మెట్పల్లి)
సీఎం కేసీఆర్ మైనార్టీల పక్షపాతి. ముస్లింల సంక్షేమాన్ని కోరుకునే ఏకైక నాయకుడు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్లలో మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ సారు ఒక్కరే. మా బాగోగుల కోసం ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి రాయితీపై అందించాలని నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషం. మైనార్టీలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న సీఎం అభిమతానికి కృతజ్ఞతలు. సమాజంలో కుల, మతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలేందుకు ఆయన చేస్తున్న కృషికి ముస్లింల మద్దతు ఎల్లవేళలా ఉంటుంది.
– మహ్మద్ సనావొద్దీన్ (కోరుట్ల)
దళితులకు దళిత బంధు, బీసీ కులవృత్తి దారులతోపాటు క్రిస్టియన్, ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నందుకు తెలంగాణ జాతిపిత, సీఎం కేసీ ఆర్కు ధన్య వాదాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చి నప్పటి నుంచి పేదలను ఆర్థికం గా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అన్ని వర్గాల పేదల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం తోడ్పడుతున్నది. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం కేసీఆర్ మాటలు నిజమవుతున్నాయి.
-పద్మభూషణ్, క్రిస్టియన్ (జగిత్యాల)
ప్రభుత్వం మైనార్టీలకు అందించనున్న రూ.లక్ష ఆర్థిక సాయంతో క్రైస్తవ కుటుంబాలకు ఒక భరోసా దొరుకుతుంది. వారికి ఎంతో లబ్ధి జరుగుతుంది. క్రైస్తవ కుటుంబాల్లో చాలా మంది నిరుపేదలున్నారు. వారికి సాయం అందితే కొంత నిలదొక్కుకుంటారు. రూ.లక్ష ఆర్థిక సాయం అందించడం చాలా గొప్ప విషయం.
-సీహెచ్ బాబు, మిషిన్ కాంపౌండ్, జగిత్యాల (జగిత్యాలరూరల్)
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటే. అన్నివర్గాల మాదిరి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించడం చాలా గొప్ప విషయం. మైనార్టీలకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు. హిందువుల కోసం కల్యాణ లక్ష్మి, మైనార్టీల కోసం షాదీ ముబారక్ ప్రవేశపెట్టి భరోసా కల్పించారు. దేశాన్ని, రాష్ర్టాన్ని ఇన్నేండ్లు పాలించిన కాంగ్రెస్ చేసింది శూన్యం. వాళ్లు చేసేది ఒకటి.. చెప్పేది మరొకటి. మైనార్టీలకోసం ఒక్క మంచిపనీ చేయలేదు. వారి పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి ఒక్క పథకమైనా చేపట్టిన పాపాన పోలేదు. బీఆర్ఎస్ సర్కారు మైనార్టీల సంక్షేమానికి ఒక్క ఏడాదిలో వ్యయం చేసిన బడ్జెట్ రూ.2200 కోట్లు.. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో కూడా అంతమొత్తం కేటాయించలేదు. మైనార్టీల కోసం రెసిడెన్షియల్ సూల్స్, కాలేజీలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తు న్నాం. ఇవ్వాళ ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నారం టే అది కేసీఆర్ పాలనా ఫలితమే. ఇంత గొప్ప పథకానికి శ్రీకా రం చుట్టిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
– ధర్మపురిలో విలేకరులతో మంత్రి కొప్పుల
మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించడం చాలా సంతోషం. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలను కేవలం అప్పటి ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయి తప్ప వారి అభ్యున్నతికి పాటుపడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లిం, క్రిష్టియన్, తదితర మైనార్టీలకు తమ ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ఉచిత విద్యను అందించేందుకు మైనార్టీ గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ముస్లింల రంజాన్, క్రిష్టియన్ల క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రభుత్వం తరపున కానుకలు ఇస్తున్నాం. షాదీముబారక్ కింద పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక సాయం చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. మైనార్టీ యువత ఆర్థికంగా ఎదగాలనే గొప్ప ఆలోచనతో సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు ముస్లిం బంధు పథకాన్ని అమలు చేయడం హర్షణీయం.
- మెట్పల్లిలో విలేకరులతో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలను గొప్ప మనసుతో ఆదుకుంటున్నది. గత ప్రభుత్వాలు మైనార్టీలను పట్టించుకోలే. కేసీఆర్ మైనార్టీల అభివృద్ధి కోసం లక్ష ఆర్థిక సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి రంజాన్కు కొత్త దుస్తులను అందించి పండుగకే ప్రాధాన్యత తెచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్.
– చాంద్పాషా, తుర్కాశీనగర్ (కొడిమ్యాల)