Sundaragiri | చిగురుమామిడి, మే 2 : తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి మండలంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడు బత్తిని సత్తయ్య గౌడ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన బత్తిని సత్తయ్య గౌడ్ (62) తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో మండలంలో వ్యవస్థాపక నాయకుడిగా అతికొద్దిమందిలో గుర్తింపు పొందాడు. ఉద్యమ నేత కేసీఆర్ అడుగుజాడల్లో మండలంలో అనేక కార్యక్రమాలను చేపట్టి బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారు. సుందరగిరి గ్రామ శాఖ అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు పార్టీకి సేవలందించారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటు కోసం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు పంటలకు నష్టపరిహారం అందించాలని అప్పటి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు సుందరగిరి లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ముందు నాలుగు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి రైతుల సమస్యలను పరిష్కరించింది. సత్తయ్య గౌడ్ ను గుండె సంబంధిత వ్యాధులతో నాలుగు రోజుల క్రితం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని సుందరగిరిలోని వారి నివాసానికి తీసుకురాగా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సింగిల్ విండో మాజీ చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ జంగ శిరీష, మైనార్టీ సెల్ నాయకుడు ఎండీ సర్వర్ పాషా, నాయకులు కొమ్ము కొమురయ్య, వీరస్వామి, కిరణ్ తదితరులు మృతదేహం వద్ద పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. వారు పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. కాగా బత్తిని సత్తయ్య గౌడ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.