మెట్పల్లి, నవంబర్ 25: మక్కజొన్న పంటను ఆదిలోనే కత్తెర పురుగు పీడిస్తున్నది. రోజురోజుకూ దీని ఉధృతి పెరుగుతుండడంతో సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు. వానకాలం సీజన్ పండించిన మక్కలకు మార్కెట్లో ఆమోదయోగ్యమైన ధర లభిస్తుండడంతో ప్రస్తుత యాసంగిలో పలువురు రైతులు మక్కజొన్న పంట సాగుపై ఆసక్తి చూపారు. దీనిలో భాగంగా ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, మల్లాపూర్, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో పంట సాగు విస్తీర్ణం పెరిగింది. 90 నుంచి 100 రోజుల వ్యవధిలో పంట చేతికి వస్తుండడం, నీటి తడి, శ్రమ పెద్దగా అవసరం లేకపోవడమే ఈ పంట సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత సీజన్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కత్తెర పురుగు ఆశించి మక్కజొన్నను దెబ్బతీస్తుంది. తత్ఫలితంగా దిగుబడిపై ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కత్తెర పురుగు మరింత ఉధృతం కాకుండా ప్రాథమిక స్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి
కత్తెర పురుగు ఉధృతి కాకుండా ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి దాని నివారణకు చర్యలు చేపట్టాలి. వారం నుంచి పది రోజులలోపు కత్తెర పురుగు ఉనికిని గమనించే లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8 నుంచి 10 అమర్చుకోవాలి. అదే విధంగా పురుగు ఉధృతిని అరికట్టేందుకు ఇమామేక్తిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు, లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా క్లోరాంత్రనిలిప్రోలు 80 మిల్లీలీటర్లు నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. లేదా స్పినటోరియం 5 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ద్రావణం మక్కజొన్న మొవ్వు సుడులలో పడేవిధంగా పిచికారీ చేయాలి. ఈ చర్యలు చేపడితే మక్కలో కత్తెర పురుగును నివారించవచ్చు.
-దీపిక, ఏవో, ఇబ్రహీంపట్నం