జగిత్యాల, జనవరి 23 (నమస్తే తెలంగాణ) ; మూడేళ్లుగా నష్టాలు చూస్తున్న మామిడి రైతులకు ఈ యేడాదీ నిరాశే మిగిలేలా ఉన్నది. డిసెంబర్ చివరి నాటికి తోటలు పూత పూసి పిందె దశకు చేరుకోవాల్సి ఉన్నా.. ఈసారి మొగ్గ కూడా కట్టకపోవడంతో ఆందోళన కనిపిస్తున్నది. వాతావరణంలో మార్పులు, చలి తీవ్రత, పొగ మంచు ప్రభావం చూపుతుండగా, తోటల్లో 60 శాతం పూత మాత్రమే వచ్చింది. ఇదే సమయంలో అధిక చలితో తెగుళ్లు, చీడపీడల ఉధృతి పెరిగింది. తేనెమంచు, రసం పీల్చే పురుగులు, బూడిద తెగులు కనిపిస్తుండగా, తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యానవన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లేకుంటే పూత, పిందె, కాయ దశల్లో ఎక్కువ నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుంచి రెండు నెలల కాలం మామిడి పంటకు కీలకమైందని, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
జగిత్యాల జిల్లా మామిడికి పెట్టింది పేరు. వరి తర్వాత ప్రధాన పంట మామిడే. 35 వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. జగిత్యాల, రాయికల్, మల్యాల, కొడిమ్యా ల, మేడిపల్లి, కోరుట్ల, సారంగాపూర్, గొల్లపల్లి మండలాల్లో ఎక్కువగా సాగవుతున్నాయి. జగిత్యాల మామిడి మార్కెట్కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఇక్కడి నుంచే మామిడి పండ్లను ఎగుమతి చేస్తుండగా, ఏటా సుమారు 400 కోట్ల మామిడి వ్యాపారం సాగుతున్నది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, కలకత్తా, ఛండీగఢ్, రాజస్థాన్, తదితర రాష్ర్టాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నది.
తేనె మంచు పురుగు : తేనేమంచు పురుగుతో కలిగే నష్టం ఎక్కువగా నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉంటుంది. తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూత కాడలు, పూలు, లేత పిందెల నుంచి విపరీతంగా రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల పూత, పిందె రాలిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థంపై కాస్మోడియం, మీలియేలా అనే శిలీంద్రాలు పెరిగి, ఆకులు, పూత కాడలు, కాయలపై మసి ఏర్పడుతుంది. దీని వల్ల ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగక కాయలు చిన్నవై రాలిపోతాయి. పెరిగిన కాయలపై మసి ఏర్పడి, నాణ్యతను కోల్పోవడంతో మార్కెటింగ్ కష్టమవుతుంది. పూత, పిందె సమయంలో ఈ పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయాల్లో ఈ పురుగులు చెట్ల మొదలు, కొమ్మ ల బెరడులోని పగుళ్లలో దాక్కొని ఉంటాయి. తోటల్లో కలుపు ఎక్కువ ఉన్నప్పుడు, మబ్బు పట్టినప్పుడు, గాలిలో తేమ శాతం ఎక్కువగా, ఉష్ణోగ్రత తక్కువగా నమోదైనప్పుడు ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగుల వల్ల 20 నుంచి వంద శాతం వరకు నష్టం వాటిల్లుతుంది.
నివారణ : తోటలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లీటరు నీటికి ల్యాండసైహలొత్రిన్ 1 మిల్లీ లీటర్ లేదా మోనోక్రోటోఫాస్ 2.5 మిల్లీ లీటర్ చొప్పున కలిపి పూత మొదలయ్యే, పిందెలు తయారయ్యే సమయాల్లో పూత, ఆకులపైనే కాకుండా మొదల్లు, కొమ్మలపైన కూడా పిచికారీ చేయాలి. పూత పూర్తిగా విచ్చుకోకముందే స్ప్రే చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేస్తే పుప్పొడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గదశలో కనిపిస్తే కరాటే 5 ఈసీ లేదా కాన్ఫిడార్ 0.5 మిల్లీ లీటర్ లేదా థయోమిఠాక్సామ్ (అక్టారా) 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత, కాత సమయంలో తేనెమంచు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు.
తామర పురుగులు : తామర పురుగులు 2 మి.మీ పొడవుండి, జాలరువంటి రెక్కలు కలిగి సూక్ష్మంగా ఉంటాయి. ఇవి కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి, గోకి, రసాన్ని పీల్చేస్తాయి. దీంతో చిగురు ఆకులు చాలా చిన్నవిగా ఉండి ఆ తర్వాత రాలిపోతాయి. పిందె ఏర్పడే దశలో కాయపై చర్మాన్ని గోకి, బయటకు వచ్చిన రసాన్ని పీల్చి వేస్తాయి. ఇవి ఆశించిన కాయలపై రాతి మంగు లేదా ఏనుగు మంగు ఏర్పడి కాయ నాణ్యత పడిపోతుంది.
నివారణ : టర్మిడాల్ 1.5 మిల్లీ లీటర్ లీటరు నీటికి కలిపి నల్లపూత దశలో అంటే పిందెలు ఎదిగే దశలో పిచికారీ చేయాలి. లేదా ల్యాండ సైహలోత్రిన్ 1 మిల్లీ లీటర్ లీటరు నీటికి కలిపి తెల్లపూత దశలో అంటే పూమొగ్గ దశలో పిచికారీ చేయాలి.
బూడిద తెగులు (పౌడరీ మిల్డ్యూ) : బూడిద తెగు లు పూల కొమ్మలను ఆశించి నష్టపరుస్తుంది. తెల్లని బూడిద లాంటి పొడి ఆకులు, పూత కాడల పై కనిపిస్తుంది. చలి ఎక్కువైన పరిస్థితుల్లో తెగు లు తీవ్రమవుతుంది. తెగులు సోకిన బాగాలు నల్ల గా మారిపోతాయి. ఆకులు, పూల కాడలు సక్రమంగా పెరగవు. తెగులుతో పంటకు 30 నుంచి 60శాతం వరకు పంట నష్టం కలుగుతుంది.
నివారణ : నీటిలో కరిగే గంధకం (సల్ఫర్) 3 గ్రాములు లేదా హెక్సాకొనజోల్ (కాన్టాఫ్ ఫ్లస్) 2 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కొమ్మల కత్తిరింపులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం సిఫారుసుల మేరకు సకాలంలో పాటించాలి.
పూత బాగా రావాలంటే : పూతకు డిసెంబర్ మంచి సీజన్ అయినా.. జనవరి, ఫిబ్రవరిలోనూ పూత వచ్చే అవకాశముంటుంది. పూత బాగా రావాలంటే కొత్తగా వచ్చే చిగుర్లపై ట్రిపుల్19ను ఒక లీటర్కు 10 గ్రాములు, 2 ఎంఎల్ మోనోక్రోటోఫాస్ను ఒక లీటర్ నీటితో కలిపి, 3 గ్రాముల వెట్టేబుల్ సల్ఫర్ను ఒక లీటర్ నీటితో కలిసి పిచికారీ చేసుకోవాలి.
పిందె రాలకుండా : పిందె రాలడాన్ని తగ్గించేందుకు 10 లీటర్ల నీటికి 2 మిల్లీ లీటర్ల ప్లానోఫిక్స్ కలిపి పూరెమ్మలు మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. లేదా 2, 4-డీ 10 పీపీఎం (1గ్రాము 2, 4-డీ పొడిని 100లీటర్ల నీటిలో కలిపి) ద్రావణాన్ని స్ప్రే చేయాలి.