రాజన్న సిరిసిల్ల జనవరి (నమస్తే తెలంగాణ): ‘అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాజన్నసిరిసిల్ల జిల్లా నంబర్వన్గా నిలిచి తెలంగాణకే తలమానికమైంది. రైతులు సుస్థిర ఆదాయం సాధించేలా స్కీంలకు రూపకల్పన చేసింది. ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో ప్రగతి పరుగులు పెడుతున్నది. అప్పారెల్ పార్కు స్థాపనతో నేతన్నకు చేతినిండా పనిదొరికింది. ఆక్వా, మత్స్య పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది. ఇది మనందరికీ గర్వకారణం’ అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రగతిపై చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
ప్రత్యామ్నాయ పంటలతో మెరుగైన ఆదాయం
ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం లభించేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహిస్తున్నది. పంట ఉత్పత్తుల నిల్వకోసం పెద్దసంఖ్యలో గోదాములను నిర్మించింది. జిల్లా వ్యాప్తంగా లక్షా 28వేల 361 మంది రైతులకు రూ. 1207 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. వివిధ కారణాలతో మరణించిన 1476 మంది రైతుకుటుంబాలకు రైతుబీమా కింద రూ. 73.80 కోట్లు చెల్లించింది. నర్మాలలో 309 ఎకరాల్లో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది.
వేములవాడ మండలం నాంపల్లిలో దక్కన్ ఆగ్రి రిసోర్స్ కంపెనీ 35 ఎకరాల్లో ధాన్యపు ఆధారిత ఇథనాల్ డిస్టీలరీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2.52 లక్షల 327 ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు చేపడుతున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా రూ. 2వేల కోట్లతో 10వేల మందికి ఉపాధి దొరికేలా 367 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఆక్వాహబ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన సాగునీరందిస్తున్నది. గూడు లేని నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా 3411 డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చింది.
అభాగ్యుల గౌరవం పెంచేలా ఆసరా..
అభాగ్యుల గౌరవం పెంచేలా ఆసరా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వృద్ధులు, వితంతు మహిళలు, గీత, నేత కార్మికులకు నెలకు రూ. 2016, దివ్యాంగులకు అదనంగా మరోవెయ్యి పింఛన్ ఇస్తున్నది. కార్పొరేట్ను తలదన్నేలా సిరిసిల్లలో రూ. 159 కోట్లతో 300ల పడకల దవాఖాన, రూ. 22.50 కోట్లతో వేములవాడలో 100 పడకల దవాఖానను ఏర్పాటు చేసింది. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది.
హరితహారంలో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టింది. పరిశుభ్రత పెంపొందిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్తో రాష్ర్టానికి దిక్సూచిలా నిలిచింది. ఈ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతిపౌరుడిపై ఉన్నది అంటూ ముగించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఆర్డీవో శ్రీనివాసరావు, తెలంగాణ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్స్పర్సన్ న్యాలకొండ అరుణ, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య పాల్గొన్నారు.