ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు! నిబంధనలను కాలరాస్తూ ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లోని పెద్దవాగుతో పాటు గోదావరి నుంచి పగలంతా తోడి, చీకటి పడగానే పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు.. లైసెన్స్ లేని డ్రైవర్లతో తీసుకెళ్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.
మెట్పల్లి, మే 24 : మెట్పల్లి పరిధిలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. మెట్పల్లి, మల్లాపూర్లోని పెద్దవాగు, గోదావరి నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో తరలిపోతున్నది. అసలే అక్రమ దందా, ఆ పై త మ ఇష్టారీతిగా ట్రాఫిక్ నిబంధనలను కాలరాస్తూ ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుక తరలించే ట్రాక్టర్కు నెంబర్ ప్లేటు ఉండదు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఉండదు, వాహనం నడిపే డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ అసలే ఉండదు. ముందు, వెనుక నెంబర్ప్లేట్లు ఉండవు. ఒక వేళ ఉన్నా అవి కనిపించకుండా సంఖ్యలను చెరిపేసి రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తున్నారు.
సంబంధిత విభాగం అధికారులు సైతం పట్టుబడిన వాహనాలను జరిమానా విధించి వదిలేస్తున్నారే తప్ప, ఆ వాహనాలకు నెంబర్ప్లేటు, ఇన్సూరెన్స్, చోదకుడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా, లేదా? అనే కోణంలో విచారించి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే పట్టుబడ్డ ట్రాక్టర్కు జరిమాన విధించి కట్టించడం, ఆ వెంటనే విడుదల చేయడం, మళ్లీ యథేచ్ఛగా ఇసుక రవాణా చేయడం పరిపాటిగా మారింది.
ఇప్పటికైనా సంబంధిత విభాగం అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై జరిమానా విధించడంతో పాటు వాహనానికి సంబంధించి నెంబర్ ప్లేటు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను పరిశీలించి ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై మెట్పల్లి సీఐ నవీన్ను సంప్రదించగా.. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలను పట్టుకుంటున్నామని, నంబర్ ప్లేట్స్, ఇన్సూరెన్స్తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వాహనాలను తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నామని చెప్పారు.