కరీంనగర్ నెట్వర్క్, ఫిబ్రవరి 20 : ‘తల్లీ వస్తున్నాం.. నిలువెత్తు బంగారం తెస్తున్నాం..’ అంటూ తరలివచ్చే భక్తులతో నేటి నుంచి దారులన్నీ సమ్మక్క దిక్కే సాగనున్నాయి. బుధవారం పిల్ల సారలమ్మ రాకతో జిల్లా అంతటా ‘వన’దేవతల జాతరకు తెరలేవనుండగా, నాలుగు రోజులపాటు ఉత్సవాలు జనసంద్రం కానున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోల్బెల్ట్తోపాటు గోలివాడ, నీరుకుళ్ల, కొలనూర్, రేకుర్తి, వీణవంక, కేశవపట్నం, హుజూరాబాద్లో జాతర వేడుకకు ఇసుకేస్తే రాలనంత జనంతో తరలిరానుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ఇప్పటికే తుది దశకు చేరగా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు.