Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 22: ఎన్నికలకు ముందు కళాకారులకు ఇచ్చిన వాగ్దానాలు… హామీలు సాధించే దిశగా సమర శంఖం పూరిస్తున్నట్లు ప్రముఖ కళాకారులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ కళా రంగాల్లో నిష్ణాతులైన 24 విభాగాల కళాకారుల అభ్యున్నతికి కళాతోరణం ముందడుగు వేయడం శుభ సూచికమని పలువురు కళాకారులు అభిప్రాయ పడ్డారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని స్నేహ సాహతీ గ్రంథాలయంలో ఆదివారం కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది.
జిల్లాలోని 24 విభాగాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. కళాకారుల సంక్షేమం, ఐక్యత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కార్యచరణ రూపొందించుకున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేసే విధంగా కళాతోరణం బాధ్యత తీసుకొని ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని కళాకారులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం జనగామ తిరుపతి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను అవిష్కరించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ కళాకారుడు సత్యనారాయణకు నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లాల కళాకారులు శ్రీనివాస్, గంగ భవానీలు పాల్గొని ఈ ప్రాంత కళాకారుల ఐక్యత తమకు ఆదర్శమని కొనియాడారు. ఈ సమావేశంలో కళాకారులు అశోక్ వేముల, బడికెల గణేశ్, జక్కిని శ్రీలత నేత, మేకల శ్రీకాంత్, వేణుగోపాల్, నిర్మాతల సంఘం అధ్యక్షులు కొమ్ము కుమార్, సీనియర్ కళాకారులు దామెర శంకర్, శంకర్, సత్యవతి, రాజేశ్, మహేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.