కరీంనగర్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : కర్షకలోకం మురుస్తున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతు బంధు యాసంగి సాయం ఖాతాల్లోకి చేరుతుండగా, మెస్సేజ్లు చూసి ఆనందపడుతున్నది. గడిచిన నాలుగు రోజుల్లో 90శాతం రైతులకు జమకాగా, బ్యాంకులు, ఏటీఎంల వద్దకు వెళ్లి నగదు విడిపించుకొని సంబురాలు చేసుకున్నది. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ ఊరూరా ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చెబుతున్నది.
కేసీఆర్ సారు దేవుడు
కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడు. ఆయన చేయబట్టి ఎవుసం రందీ లేకుండా ఉంది. తెలంగాణ రాక మునుపు ఎవుసం చేద్దామంటే దండుగ అనిపించేది. తెలంగాణ అచ్చినంక రైతులను అన్ని విధాలా సర్కారు ఆదుకోవడం వల్ల చానా మేలైతంది. పొద్దంతా కరెంటు, అప్పు మాఫీ, పుష్కలంగా సాగుకు నీళ్లతో ఎవుసం సాఫీగా పోతంది. రైతుబంధుతో అచ్చిన పైసలతో ఎరువులు, విత్తనాలు ప్రతి యేటా కొంటున్న. కడమ పైసలు కూలీలకు ఖర్చు చేస్తా. మళ్లోసారీ కూడా ఈ సర్కారే కావాలని మా ఇలవేల్పు మల్లన్న దేవుడిని కోరుకుంటున్న. నాకు ఎకరంన్నర భూమి ఉంది. ప్రతి పసలుకు రూ.7500 వస్తన్నయ్.
– పుట్టపాక కొంరయ్య, ఇప్పల్ నర్సింగాపూర్(హుజూరాబాద్)
మందుల దుఖాన్ల ఖాతా బంద్పెట్టినం
వ్యవసాయం జేత్తున్న మంటే అందరు చిన్న చూపు సూసిండ్రు. కాలమే లేదాయే.. ఎవుసం చేసి ఏం సంపాదిస్తవని అవమానించిండ్రు. నాకున్న ఐదెకరాల భూమిలో వరి సాగు చేసేందుకు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చేది. మందుల దుకాణాల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులన్నీ ఉద్దెర తెచ్చి సాగు చేసిన. వడ్లమ్మిన పైసలన్నీ అప్పులకే పెట్టిన. తెల్లారి మరొకరిదగ్గరికి పోయి చేయి చాపి అడ్డుక్కోవాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన రైతు బంధు చాలా మేలు జేసింది. ఏడాదికి రెండు సార్లు రూ.25వేలు చొప్పున రూ.50వేలు వస్తున్నయ్. అప్పులన్నీ తీరిపోయినయ్. మందుల దుకాణాల్లో ఉద్దెర ఖాతాలేదు. నగదు పెట్టి మందు బస్తాలు తెచ్చుకుంటున్న. ఎవుసమంటే చీదరించుకున్నోళ్లు ఇపుడు మేం వ్యవసాయం చేస్తమంటూ నాకే పోటీగా వత్తన్నరు. మా ఊళ్లే అందరు వరి పంటేసేటోళ్లు. రైతుబంధు వచ్చినంక రకరకాల పంటలేస్తున్నరు. ఐదెకరాల్లో రెండెకరాలు వరి, రెండు మూడు ఎకరాల్లో పామాయిల్ తోట పెడుతున్నా.
– బెందారపు తిరుపతిరెడ్డి, రైతు, గోపాల్రావుపల్లె(తంగళ్లపల్లి)
పెట్టుబడికి రంది లేదు
నా పేరు కొమురయ్య. మాది కిష్టంపేట. నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. చానా ఏండ్లుగా వరి, పత్తి పంటలు వేస్తున్న. ఒకప్పుడు పెట్టుబడులకు మస్తు ఇబ్బందైతుండె. వరి నాట్లు వేసినా.. పత్తి ఏరినా అప్పులు తెచ్చి కూలీలకు పైసలు ఇచ్చేది. కానీ కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మా బాధలు తీరినయి. రైతు బంధు కింద నాకు పసలుకు రూ.20 బ్యాంకు ఖాతాలో పడుతున్నయి. తెలంగాణ గవర్నమెంటుల పెట్టుబడికి రందీ లేకుండా పోయింది. గతంల మా రైతులను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలె. ఇప్పుడు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్, తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంట.
– భూమండ్ల కొమురయ్య, రైతు, కిష్టంపేట(చందుర్తి)
పెట్టుబడికి రంది లేదు..
నా పేరు దేశెట్టి నర్సయ్య. మాది జూలపల్లి మండలం కుమ్మరికుంట. ఊళ్లే నాకు రెండు ఎకరాల భూమి ఉంది. వరి సాగు చేసుకుంటున్న. ఒకప్పుడు ఎవుసం అంటే దుఃఖమచ్చేది. కరెంట్ రాదు. నీళ్లు లేవు. ఎన్నో ఇబ్బందులు పడ్డం. కానీ తెలంగాణ ప్రభుత్వల ఎవుసం పండుగలా నడుస్తంది. ప్రతి పసలుకు ఎకరానికి రూ.5వేలు ఇస్తంది. ఈ యాసంగి సాయం రూ. 10 వేలు అందినయ్. ఒకప్పుడూ పంట పెట్టుబడి కోసం అప్పు చేసేటోన్ని. ఇప్పుడూ ఆ బాధ తీరింది. పెట్టుబడులకు రంది లేదు. కేసీఆర్కు ధన్యవాదాలు.
– దేశెట్టి నర్సయ్య, రైతు, కుమ్మకుంట (జూలపల్లి)
అడక్కుండానే సమయానికి పెట్టుబడిసాయం
నాకు ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉన్నది. రైతుబంధు ఇస్తున్నప్పటి నుంచి సీఎం కేసీఆర్ ప్రతి పసలుకు టైమ్ కాగానే అడక్కుండానే బ్యాంక్ ఖాతాలో రూ.7500 జమ చేత్తండు. నేను ఎమ్మెస్సీ పూర్తి చేసిన. ఒకప్పుడు దున్నుల్లు మొదలు కాగానే పెట్టుబడికి మా నాన్న సావుకారు దగ్గరికి పోయి డబ్బులు తెచ్చేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ పెట్టుబడికి సాయం, రైతు బీమా అందిస్తుండడంతో ఎలాంటి భయం లేకుండా భరోసా ఏర్పడింది. ఎంతో మంది యువరైతులు కూడా చిన్నా, చితక ఉద్యోగాలు వదిలి వ్యవసాయం చేసుకుంటున్నారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులకు రైతుబంధు గొప్పవరంలా మారింది. ఎక్కడా ఇలాంటి పథకాలు లేవు. కేవలం సీఎం కేసీఆర్ కృషితోనే రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడికో పోయి ప్రైవేట్ పని చేస్తూ ఊడిగం చేయడంకన్నా ఉన్న ఊరిలోనే అన్ని రకాల సౌకర్యాలున్న వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుబంధు సాయం చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. – పులాల సామ్రాట్, యువరైతు(వీణవంక)
రైతుబంధుతో ఆనందం
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతుబంధు పథకంతో రైతులు ఆనందంగా ఉన్నారు. దేశంలో ఎక్కడా ఇంత పకడ్బందీగా, రైతులకు నేరుగా ప్రభుత్వం పథకాలు అందడం లేదు. కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే ఏటా యాసంగి, వానకాలం పెట్టుబడి సహాయం సరైన సమయంలో రావడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులను అభివృద్ధి చేసినట్లే, భవిష్యత్తులో బీఆర్ఎస్తో దేశంలోని అన్నిరాష్ర్టాల్లో రైతుబంధు లాంటి రైతు సంక్షేమ పథకాలు అమలు చేసి, దేశాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తారు. రోజుకు 126 కోట్ల అప్పు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయకపోగా, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ఆదాని, అంబానీలకు కట్టబెడుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన అప్పులు అభివృద్ధి, సంక్షేమానికి అవసరమైన, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులకు, 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లకు ఖర్చుచేస్తున్నారు. భావి ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత ముందుకెళ్లాలి. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించాలి.
– వ్యాళ్ల హరీశ్రెడ్డి, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం నాయకుడు(పాలకుర్తి)
ఎవుసం పండుగలా నడుస్తంది..
మాది జూలపల్లి మండల కేంద్రం. నాకు మూడెకరాల భూమి ఉన్నది. వరి, పత్తి పండిస్తున్న. గతంలో ఎవుసం చేయాలంటే ఇబ్బందులు పడేటోళ్లం. పంటకు పెట్టుబడి కష్టంగా ఉండేది. కానీ తెలంగాణ గవర్నమెంట్ వానాకాలం, ఏసంగి పంటకు పెట్టుబడి ఇచ్చి ఆదుకుంటుంది. యాసంగి సాయం బ్యాంక్ ఖాతాల జమైంది. రూ.15 వేలు అందినయి. బ్యాంకుల డబ్బులు తీసుకొని ఎవుసం పనులు మొదలు పెట్టిన. గతంలో ఎవుసం పనులు మొదలు పెట్టాలంటే పైసల కోసం ఇబ్బంది పడుతుంటిమి. సీఎం కేసీఆర్ సారు అన్ని విధాల రైతులను ఆదుకుంటున్నరు. సంతోషంగా ఉంది. ఎవుసం పండగులా నడుస్తంది.
– కల్లెం శ్రీనివాస్రెడ్డి, రైతు, మండల కేంద్రం (జూలపల్లి)