కరీంనగర్ నెట్వర్క్, జనవరి 11: పంటకు పెట్టుబడి సాయం మొత్తం రూ.50వేల కోట్లు జమకావడంపై ఊరూరా రైతన్న సంబురాలు హోరెత్తుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి పాల్గొన్నారు. రైతులు, నాయకులతో కలిసి ఎడ్ల బండ్లతో ర్యాలీ తీశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ధర్మారం మండలం దొంగతుర్తిలో రైతుబంధు సమితి, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. డీజే సౌండ్స్తో రైతు వేదిక దాకా ర్యాలీ తీశారు. చిగురుమామిడి మండలం సుందరగిరి, నవాబ్ పేట్, ఇందుర్తి, బొమ్మనపల్లి గ్రామాల్లో రైతు బంధు సంబురాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పాల్గొన్నారు. రామంచలో నిర్వహించిన రంగోలి, వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో బద్దం రాజేశ్వరెడ్డి పొలంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్, రైతులు కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిరిసిల్లలోని చంద్రంపేటలో రైతులు, ప్రజాప్రతినిధులు ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. రైతు వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య పాల్గొన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్లోని రైతు వేదికలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు చిత్రపటాలకు, మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్, బండలింగాపూర్, చెర్లకొండాపూర్ గ్రామాల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు.