రైతుబంధు, రైతుబీమా దేశానికే ఆదర్శం
పార్టీలో నిబద్ధతతో పని చేసిన వారికి గుర్తింపు: మంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్, జూన్ 27 : రైతు సంక్షేమానికే రాష్ట్ర సర్కారు తొలి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక సంస్కరణల బాట పట్టించిందని పేర్కొన్నారు. కిషన్రావుపేటలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మండపంలో సోమవారం జరిగిన వెల్గటూర్ మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సర్కారు ముమ్మాటికీ రైతు పక్షపాతి అని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కేంద్రంలో 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రైతులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ సర్కారు రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు, ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తున్నదన్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 24లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 315 గోదాముల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ డీ 83/బీ కెనాల్కు మేడారం లింక్ త్వరగా పూర్తి చేస్తామన్నారు. కొత్తగా నియామకమైన కమిటీ సభ్యులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో అంతర్గత కలహాలు మానాలని, నిబద్ధతో పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులకు రూ.5 నుంచి 10 లక్షలు ఇస్తే మార్కెట్ కమిటీ పదవులు ఇచ్చే సంస్కృతి ఉండేదని, ఇవ్వాళ నిజమైన తెలంగాణ ఉద్యమ నాయకులకు పదవులు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్గా పత్తిపాక వెంకటేశ్, వైస్ చైర్మన్గా పోడేటి రవి గౌడ్, డైరెక్టర్లుగా మాచెర్ల జ్యోతి, బోరే శంకరయ్య, జీరెడ్డి మహేందర్ రెడ్డి, కొంగల చంద్రారెడ్డి, జాబు రాజన్న, ఇప్పల లచ్చయ్య, జెల్లేల కనకయ్య, కుతాడి నాగరాజు, ఎండీ అబ్బాస్, బూరగడ్డ రవి, కొర్రి ఎల్లయ్య, కానపర్తి సుధాకర్రావుతో డీఎంవో ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్, ధర్మపురి, పెగడపల్లి ఏఎంసీల చైర్మన్లు అయ్యోరి రాజేశ్, తిరుపతి నాయక్, ప్యాక్స్ చైర్మన్లు గూడ రాంరెడ్డి, గోలి రత్నాకర్, సురేందర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, రైతులు, మహిళలు ఉన్నారు.