MLA Vijaya Ramana Rao | ఓదెల, మే 5 : పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి 35 లక్షలు నిధులు మంజూరు చేయించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును మల్లికార్జున ఆలయ పాలకవర్గ సభ్యులు, అధికారులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఒక ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే రూ.కోటితో ఆలయ ఆవరణ లోపలి భాగంలో సిసి రోడ్ల నిర్మాణం, రూ.15 లక్షలతో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అలాగే రూ.20 లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వీటికి సంబంధించిన పనులను త్వరలో చేపడతామని అన్నారు.
ఈ పనులను జూన్ నెలలోపుగా పూర్తి చేస్తామని తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రధాన ఆలయంగా పేరుగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిని దృష్టిపెట్టుకొని నేను ఎమ్మెల్యేగా గెలిచాక ఆలయ మార్గంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టి సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓదెల మండల కేంద్రంతో అనుసంధానంగా ఉన్న వివిధ గ్రామాల రోడ్లను ఆధునికరిస్తున్నట్టు తెలిపారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి పరివాహక ప్రాంతంలోని దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసినట్లు, అయితే ఓదెల ఆలయం గోదావరి పరివాహక ప్రాంతంలో లేనందున ప్రత్యేక ప్యాకేజీ కింద అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించినట్లు తెలిపారు.
ఇందుకోసం సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం కొత్తగా దాతల సహకారంతో 21 వసతి గదులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఓదెల ఆలయ అభివృద్ధికి మరింత కట్టుబడి ఉన్నామని విజయ రమణారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ ఈవో సదయ్య, డైరెక్టర్లు కట్కూరి సమ్మిరెడ్డి, ఉప్పుల శ్రావణ్ కుమార్, జీలుక రవీందర్, కొండ శ్రీనివాస్, తీర్థాల రాజారాం, తాళ్లపల్లి శ్రీనివాస్, ఈరవేన రవికుమార్, గంట రమేష్, సామల యమునా హరికృష్ణ, కోదాటి మనోహర్ రావు, జంగ కొమురయ్య , ప్రధాన అర్చకులు వీరభద్రయ్య, అర్చకులు అభిషేక్, సిబ్బంది కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.