సిరిసిల్ల తెలంగాణ చౌక్ : నేర పరిశోధన, భద్రతా చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ, విపత్తు పరిస్థితుల్లో పోలీస్ జాగిలాల (Police Dogs) కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ మహేష్ బి గీతే ( SP Mahesh B Geete ) అన్నారు. శిక్షణా సామర్థ్యం వల్ల విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నామని తెలిపారు. పోలీస్ జగిలాల సంరక్షణలో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాటి కోసం నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయ పేర్కొన్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయని వెల్లడించారు.
మాదకద్రవ్యాలు (Drugs), బాంబులు (Explosives), ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో, ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనది అని అన్నారు. పోలీస్ జాగిలాలకు అధునాతన శిక్షణ, వైద్య సంరక్షణ, తగిన సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.
ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు జగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన హ్యాండ్లర్స్ ఉన్నారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, నటేష్,ఆర్.ఐలు రమేష్, యాదగిరి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు , డాగ్స్ హ్యాండ్లర్స్ కార్తీక్,సురేష్, శ్రీనివాస్, కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.