Godavarikhani | కోల్ సిటీ, జూన్ 13 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో )ను సందర్శించి, అక్కడ రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్మాణాలను స్వయంగా వీక్షించి గమ్యాన్ని ముద్దాడిన ఘనత దక్కించుకున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన బాల మేధావి రిశ్విక్. అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ నిర్వహించిన ప్రపంచ స్థాయి ‘భగవద్గీత పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం శ్వేత-కిరణ్ దంపతుల కుమారుడు రిశ్విక్ ఇస్రో సందర్శనకు ఎంపికయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను సందర్శించాడు. ఈ సందర్భంగా శేషాద్రిపురంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ టాపర్స్ అవార్డ్ సెరెమనీలో తన తల్లిదండ్రులు, తమ్ముడు అయాన్ష్ తో కలిసి పాల్గొన్న రిశ్విక్ ను ఇస్రో మాజీ చైర్మన్ డా. ఎస్. సోమనాథ్ నేషనల్ టాపర్ మెడల్ తో పాటు మెమెంటోను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా రిశ్విక్ మాట్లాడుతూ తనను ఇస్రో సందర్శనకు ఎంపిక చేసిన ఇస్కాన్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇస్రోలో శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాల నిర్మాణం తదితర అంశాలపై విలువైన సమాచారాన్ని అందించారని పేర్కొన్నాడు. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ను ప్రత్యక్షంగా కలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపాడు. కాగా ఇస్రో సందర్శనకు తనను ప్రోత్సహించిన కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ మంజులా శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తన తల్లిదండ్రులకు రిశ్విక్ కృతజ్ఞతలు తెలిపారు.