కరీంనగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లాలో కొందరు బియ్యం అక్రమ రవాణాదారులు ముఠాగా ఏర్పడి రెచ్చి పోతున్నారు. పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొందరు మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అందిస్తున్నారన్న విమర్శలుండగా, జిల్లా కేంద్రంలోని పలు టిఫిన్ సెంటర్లు, హోటళ్ల యజమానులు కూడా ఈ బియ్యాన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజులుగా పోలీసులు, సివిల్ సప్లయిస్ అధికారులు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేసి 25 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరు టిఫిన్ సెంటర్ల యజమానులపై 6ఏ కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల నగర శివారులోని రేకుర్తి బుడిగ జంగాల కాలనీలో తనిఖీలు చేసి 250 క్వింటాళ్ల బియ్యం స్వా ధీనం చేసుకున్నారు. రైస్ మిల్లుల్లో ఈ దందా ఇం కా పెచ్చుమీరుతోందని వచ్చిన సమాచారం మేర కు సీపీ సత్యనారాయణ ఆదివారం రాత్రి మానకొండూర్లోని రెండు మిల్లులను స్వయం గా వెళ్లి తనిఖీ చేశారు. పీడీఎస్ బియ్యంగా అనుమానిస్తున్న నమూనాలను సేకరించి పరిశీలన కో సం పంపించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నల్గొండ జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఓ మిల్లుకు వ్యాన్లో తరలిస్తున్న 250 క్వింటాళ్ల బియ్యాన్ని అల్గునూర్ వంతెనపై పోలీసులు పట్టుకున్నారు.
కిలో బియ్యం దొరికినా పీడీ యాక్ట్ : సీపీ
రాంనగర్, డిసెంబర్ 10: జిల్లాలో పీడీఎస్ బియ్యం దందాను అరికట్టేందుకు సీపీ సత్యనారాయణ ప్రత్యేక నజర్ పెట్టారు. పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏ ర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గతేడాది రూ. 18 లక్షల విలువైన 2,350 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని పౌరసరఫరాల శాఖకు పోలీస్ శాఖ అప్పగించింది. ఈ కేసులు విచారణలో ఉన్నాయి. అయితే ఇది వరకు అనుభవం ఉన్న వాళ్లే ఈ దందాకు పాల్పడుతున్నారని భావించిన సీపీ, పాత నేరస్తులపై నిఘా పెంచారు. అంతే కాకుండా 2016 నుంచి బియ్యం అక్రమ రవాణాలో పాత నేరస్తులను సోమవారం కమిషనరేట్కు పిలిపించుకున్నారు. వివిధ కేసుల్లో మొత్తం 150 మంది ఉండగా, 102 మంది హాజరయ్యారు. కొందరు మిల్లర్లు కూడా కనిపించారు. వీరందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక నుంచి ఒక్క కిలో బియ్యం మీ వద్ద దొరికినా పీడీ కేసులు నమోదు చేసి తాట తీస్తానని తీవ్రంగా హెచ్చరించారు. పీడీఎస్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్న మిల్లర్ల వివరాలు కూడా సేకరించామని, వారిలో ఐదుగురిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని, బోనగరి వేణుగోపాల్ కిషన్, గంగారెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీపీ వెల్లడించారు. కాగా, పీడీఎస్ బియ్యం కొనుగోళ్లు, అమ్మకాలు అక్రమంగా రవాణా చేసే సమాచారం తెలిసినవారు వెంటనే డయల్ 100, సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతరం దాడులు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇక్కడ అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయసారథి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.