కరీంనగర్ కమాన్చౌరస్తా, ఆగస్టు 23: పాలిటెక్నిక్ విద్యను బలిపెట్టే కుట్రలు చేయద్దని, పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హితవు పలికారు. జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పూర్వపు పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేదర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ముఖాముఖి నిర్వహించగా.. విద్యార్థినులు తమ గోడు వెల్లబోసుకున్నారు. పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని మారిస్తే భవిష్యత్తులో తాము ఈసెట్ రాసే అవకాశం కోల్పోతామని, పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యకు దూరమవుతారని వాపోయారు.
జీవో 97తో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేయగా, అండగా ఉంటానని ఎమ్మెల్యే గంగుల భరోసానిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, విద్యార్థులు, అధ్యాపకులు, విద్యా నిపుణులతో సంప్రదింపులు జరపకుండా, కనీసం అసెంబ్లీలో చర్చ కూడా చేయకుండా ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. తాను స్వయంగా ఇంజినీరింగ్ విద్యను అభ్యసించానని గుర్తు చేసిన గంగుల.. పాలిటెక్నిక్ పూర్తి చేసి నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందే విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారని తెలిపారు. అలాంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం.. దానికి భిన్నంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలల భూములను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. జీవో 97 రద్దు చేసే వరకు విద్యార్థుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యా విధానంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి జీవో 97ను రద్దు చేయాలని నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఇన్చార్జి చుక శ్రీనివాస్, నాయకులు గంగాధర చందు, మొగిలోజు వెంకట్, పలువురు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.