మహా సాహితీ దిగ్గజం దివికేగింది. సంస్కృత భాష చిన్నబోయింది. అమర భాషా పాండిత్యం విశ్రమించింది. 86 ఏండ్ల ఆధ్యాత్మిక, ఆధునిక, అభ్యుదయ, మధుర మంజుల మనోహర కవిత్వం నిష్క్రమించింది. ప్రముఖ సంస్కృత భాషా పండితుడు, కవి, మహా మహోపాధ్యాయ, అమర భాషా ప్రేమికుడు పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారథి అస్తమించారు. నెలరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. తెలంగాణ వాచస్పతిగా గౌరవం అందుకున్న శ్రీ భాష్యం ఇక లేరనే వార్త తెలియగానే సాహితీ లోకం అశ్రునివాళులర్పించింది. కరీంనగర్లోని ఆయన స్వగృహానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, శిష్యులు తరలి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతి సాహిత్య లోకానికి తీరనిలోటంటూ సాహితీవేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ సంతాపం తెలుపగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతా రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ తదితరులు శ్రీభాష్యం పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు.
కరీంనగర్ జిల్లా చేగుర్తిలో సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో శ్రీభాష్యం నరసింహాచార్య, గోపమాంబ దంపతులకు 1937 మార్చి 10న జన్మించారు. శ్రీభాష్యం విజయసారథి తల్లి వద్ద సంస్కృత భాష, సంగీతం నేర్చుకున్నారు. ఆయన ప్రతి విషయాన్ని అప్పుడే ప్రశ్నించే వారు. బాల్యం నుంచే ఆయన రచనలు చేస్తూ వచ్చారు. 11వ ఏటనే ‘శారద పదకింకిణి’ని స్వరపరిచారు. 16వ ఏట ‘విషాదలహరి’, ‘శబరీ పరిదేవనం’, 17 ఏటా ‘మనోరమ’ నవల, 18 ఏటా ‘ప్రవీణ భారతం’ నవల రాశారు. చిన్నతనంలో రజాకార్ల ఆగడాలు చూసిన శ్రీభాష్యం కమ్యూనిస్టు భావ జాలంతో, విప్లవవాదంవైపు, హేతువాదం వైపు మొగ్గు చూపేవారు. వీటిని గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్లోని శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృత కళాశాలలో చేర్పించారు. అక్కడ మొదలైన ఆయన సంస్కృత భాషా పరిచయం స్వత సిద్ధంగా ఉన్న కవితా శక్తికి జతకూడి కవిగా దశాబ్దాలపాటు సాహితీరంగంలో తనదైన జైత్రయాత్రలను కొనసాగించారు. వరంగల్ సంస్కృత కళాశాల నుంచి ఆయన విద్యాభ్యాసం కోసం 1978లో కాశీకి వెళ్లారు. అక్కడ విజయసారథి ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్ర్తాలను అధ్యయనం చేశారు. ఆ తర్వాత అక్కడి కళాశాలలో అధ్యాపక వృత్తిని చేపట్టి అక్కడే పదవీ విరమణ పొందారు. పలు విశ్వవిద్యాలయాలతో పాటు ముంబై, కోల్కతా, నాగ్పూర్, ఢిల్లీ వంటి అనేక నగరాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. పశుపతనాథ శాస్త్రి సూచనల మేరకు భారతీయ సంస్కృతిని భద్రపరుస్తూ విశేష ప్రచారానికి పూనుకున్నారు. అందులో భాగంగానే మానేరు నదీతీరాన కరీంనగర్ శివారులోని బొమ్మకల్ రోడ్లో యజ్ఞ వరాహ స్వామి క్షేత్రాన్ని నిర్మించి, సర్వ వైదిక సంస్థానాన్ని ఏర్పాటు చేసి 35 ఏళ్లుగా విశేష కృషి చేశారు. వేదాల్లోని మౌలిక జ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు.
ప్రముఖ సంస్కృత భాషా పండితుడు, మహాకవి, మహా మహోపాధ్యాయ, అమర భాషా ప్రేమికుడు పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారథి ఇక లేరు. తుదికంటూ తన జీవితాన్ని రచనలకే అంకితం చేసిన ఆయన, బుధవారం తెల్లవారుజామున అస్తమించడం సాహితీలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉదయం కరీంనగర్లోని ఆయన నివాసానికి పెద్దసంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు చేరుకొని శ్రీభాష్యం సేవలను కొనియాడారు. ఆయన మృతి సాహితీలోకానికి తీరని లోటని పేర్కొన్నారు.
– కరీంనగర్ , డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కమాన్ చౌరస్తా
‘మీ తెలంగాణలో ఇంత మంచి సంస్కృత పండితులున్నారా..?’ అన్న శివతాండవ కవి మాటలకు చిన్ననవ్వుతో బదులిచ్చి తన అవిశ్రాంత సంస్కృత సృజనను కొనసాగించిన సృజనశీలి పండితుడు శ్రీ భాష్యం విజయసారథి. సంస్కృతమే తన భాషగా, వ్యక్తీకరణగా తనకు తానే నిర్దేశించుకొని వందకు పైగా సంస్కృత గ్రంథాలు రాసి జాతీయస్థాయిలో తెలంగాణ ధ్వజాన్ని నిలిపిన ప్రతిభావంతుడు. ఉర్దూ అధికార భాషగా ఉండి విద్యాలయాల్లో ఉర్దూ మాధ్యమానికే పెద్ద పీట వేసిన నిజాం కాలంలో సంస్కృతం చదువుకుని తన సృజనను ఇదే భాషలో చేయాలని నిర్ణయించుకున్న మహనీయుడు. సంస్కృతం అంటే దేవతల పూజలు, పురాణ కథలు అనుకుంటున్న స్థితిలో సామాజిక అంశాలను తీసుకుని సృజన చేసిన కవి ఆయన. సంప్రదాయ రూపంలో ఆధునిక భావాలను ప్రయోగశీలతను ఆవిష్కరిస్తూ సంస్కృత భాషలో ఆయన రచనలు సాగించారు. అందుకే ఆయనకు ‘అమర భాషలో ఆధునికుడు’ అనే ఖ్యాతి వచ్చింది. ఆయన రాసిన ‘భారత భారతి’ అనే కవితా సంపుటిలో 60 శ్లోకాలు ఉన్నాయి. ఈ కావ్యం మొత్తం ఆధునిక సామాజిక సమస్యలను ప్రస్తావించడంతోపాటు వాటికి పరిష్కారాలను కూడా సూచించింది. దేశ స్వాతంత్య్రాన్ని, సమగ్రతను చాటి చెప్పిన గొప్ప కావ్యం ఇది. ఇలాంటి వందకు పైగా గొప్ప కావ్యాలను ఆయన సంస్కృత భాషలో రచించారు. ఆయన కావ్యాల్లో సుప్రభాతాలు, స్తోత్రాలు, దేశభక్తి రచనలు, ఆధిక్షేప కవితలు, ఆప్త లేఖలు, ఖండ కావ్య పరంపర, ప్రహేళికలు, విమర్శ, అనువాద రచనలు, వర్ణనా కావ్యాలు, మంత్రమాయ రచనలు ఉన్నాయి. సంస్కృతంలో ఖండకావ్య ఒరవడిని ప్రారంభించిన కవి శ్రీభాష్యం. లేఖా సాహిత్యంలో కూడా ఆయన మంచి కవిత్వాన్ని ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఆయన 25కు పైగా సుప్రభాతాలు రాశారు. బాసర సరస్వతీ ఆలయం, వరంగల్ భద్రకాళీ ఆలయం, ఇల్లందకుంట రామాలయం, హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో వీటిని వినిపిస్తున్నారు.
మహా పండితులు కరీం నగర్ కమాన్ లాంటి శ్రీ భాష్యం విజయ సారథి, సిరిసిల్ల సిరివెలుగు వైకల్యాన్ని సవాలుగా తీసుకొని గెలిచిన కవయిత్రి బూర రాజే శ్వరి ఇద్దరూ ఒకే రోజు ఆకాశంలో చుక్కలైపోయారు. ఒకరు మహోపాధ్యాయులు, మరొకరు ఒడి చూడని సరస్వతి. సాహితీ కుసుమాలకు నివాళులు. ‘కవియూ మరణించే ఒక తార గగనమెక్కె’.
– డాక్టర్ పత్తిపాక మోహన్, మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుడు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
శ్రీభాష్యం విజయసారథి తన 86 ఏండ్ల జీవితంలో ఉభయ తెలుగు రాష్ర్టాలే కాకుండా భారత దేశం గర్వించ దగిన రచనలు చేశారు. 22 ఏళ్లకే కవిగా తనదైన ముద్ర వేశారు. ఆయన సంస్కృతం, తెలుగు, ఉర్దూ భాషల్లో రాసిన వందకు పైగా కావ్యాల్లో సుప్రభాత, కావ్య, దేశభక్తి, లేఖా సూక్తి, మాలికా, ఉదాహరణ, సంగీత, సాంఘిక, చైతన్య అనువాద, ప్రహేళికలు, విమర్శ, ప్రహసన వంటివి ఎన్నో ఉన్నాయి. బాల్యం నుంచే ఖండ కావ్యాల రచనలతో భాష్యం విజయసారథి అద్భుతమైన పాండిత్యాన్ని ప్రదర్శించారు. ‘సీసం’ అనే తెలుగు కవితా రూపాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, సంస్కృతంలో ఎపిస్టోలరీ రూపాన్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తిగా ప్రసిద్ధికెకారు. ముఖ్యంగా తన కవిత్వంలో గరిష్ఠ సంఖ్యలో ‘ధాతు’లను ఉపయోగించి వెలుగులోకి వచ్చారు. 12 సాంస్కృతిక రచనలు, 7 తెలుగు రచనలతోపాటు, సర్వ వైదిక సంస్థానం స్థాపించి తెలుగు కావ్యాలకు ప్రచారం కల్పించే బాధ్యతలు భుజసంధాలపై వేసుకున్నారు. పంచ మాత్రక గుణాలతో పాడుకొనేందుకు వీలుగా గేయకావ్యంగా ‘మందాకిని’ని రచించి సంస్కృత రచనల్లో నూతన ఒరవడిని సృష్టించారు.
పద్మశ్రీ భాష్యం విజయ సారథి, సిరిసిల్ల రాజేశ్వరి ఒక్క రోజే మరణించడం సాహితీ లోకానికి తెలుగు రాష్ర్టాలకు తీరని లోటు. భాష్యం విజయ సారథి మాతృ భాష తెలుగు, సంస్కృతం, ద్రావిడ భాషల్లో కవిత్వాలు రాసే గొప్ప పండితులు. ఆయన మరణం కరీంనగర్లోనే కాదు యావత్తు తెలుగు దేశానికి ముఖ్యంగా సంస్కృతి తెలిసినటువంటి భారత జాతికి తీరని లోటుగా భావిస్తున్నా. సాహిత్యానికి గొప్ప అలంకరణ పోయింది. రాజేశ్వరి చనిపోవడం చాలా బాధాకరం. కాళ్లతో కవిత్వం రాయడం చిన్న విషయం కాదు. మదిలో మెదిలిన అభిప్రాయాలను కళాత్మకంగా తీర్చిదిద్దడం చేతులు ఉన్న వాళ్లకే సాధ్యం కాదు. అలాంటిది రాజేశ్వరి కాలి వేళ్లతో కవిత్వాలు రాయడం చాలా గొప్ప విషయం. మాలాంటి కవులను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది రాజేశ్వరి. దివ్యాంగులకు స్ఫూర్తి దాయకమైన రాజేశ్వరి మరణించడం బాధాకరం.
– నలిమెల భాస్కర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ చేసిన ఉద్యమాలు, సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ‘చంద్రశేఖర ప్రశస్తిః’ పేరిట సంస్కృత పుస్తకం రాశారు. అందులో ప్రతి శ్లోకంలో సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని, ఆయన వాక్చాతుర్యాన్ని, రాజనీతిజ్ఞతను అభివర్ణించారు. పండితుడు, ఓపిక కలవాడు, ధర్మాలు తెలిసిన వాడిగా వర్ణించారు. తన జాతి ఎదుగుదలకు మొక్కవోని దీక్ష చేసి విజయం సాధించి, స్వరాష్ర్టాన్ని సాధించిన నేతగా కేసీఆర్ గురించి అనేక శ్లోకాల్లో వివరించారు.
శ్రీభాష్యం విజయసారథి పద్మశ్రీతోపాటు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 2020లో అరుదైన గౌరవం పొందారు. తెలుగు, ఉర్దూ, సంస్కృత భాషల్లో ఆయన చేసిన సేవలు, రాసిన కావ్యాలు, పుస్తకాలను గుర్తించి సాహితీ రంగంలో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అదే ఏడాది జనవరి 25న కేంద్ర ప్రకటించగా, 2021 నవంబర్ 8న రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు. విజయ సారథి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2017లో ఆగస్టు 15న హైదరాబాద్ గోల్కొండ వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున విశిష్ట సాహిత్య పురస్కారాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ అందించి ఘనంగా సన్మానించారు. వీల్చైర్లో వచ్చిన విజయ సారథి వద్దకే వెళ్లిన సీఎం ఆయన రచనలతోపాటు ఆయన అమర భాషకు చేసిన సేవలను కొనియాడి స్వయంగా సన్మానించారు. అయ్యదేవర కాళేశ్వరరావు చేతుల మీదుగా మహాకవి బిరుదును, కలకత్తాలో జరిగిన జాతీయ సంస్కృత కవి పండి త సమ్మేళనంలో ‘యుగకవి’ బిరుదును పొందారు. రాష్ట్రీయ మహా పీఠం తిరుపతి నుంచి మహామహోపాధ్యాయ , జైపూర్ లో బిర్లా ఫౌండేషన్ నుంచి వాచస్పతి బిరుదులను అందుకున్నారు. గవర్నర్ కృష్ణకాంత్ ద్వారా స్వర్ణ కంకణాన్ని, సాహిత్య పరిషత్ నుంచి క్రియేటివ్ సంట్ పోయెట్, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ సంస్కృత స్కాలర్ లాంటి పురస్కా రాలు అందుకున్నారు. హేతువాద, అభ్యుదయ భావాల అనంతరం తాను మానవ తావాదానికి కట్టుబడి ఉన్నారు. మనుషులు ఆనందం పొందడానికి అనేక దారులున్నాయని అందులో భారతీయ సాహిత్యం, సంస్కృతి ప్రధానమైన రహదారి అని ఆయన వివరించే ప్రయత్నంచేశారు. తెలంగాణ ప్రాంతం గొప్ప చారిత్రక సాంస్కృతిక చరిత్ర కలిగిన ప్రాంతమని, ఇక్కడ ప్రతిభావంతులైన వారు ఎంతోమంది ఉన్నారని ఎలుగెత్తి చెప్పారు. ప్రాచుర్యం ప్రోత్సాహం లేక తెలంగాణ సృజనాత్మక ప్రతిభ ఎల్లలు దాటలేదని తెలిపారు. 2008లో శాతవాహన కళోత్సవాల్లో కరీంనగర్ జిల్లా ప్రాశస్త్యం గురించి పుస్తకం రాశారు.
శ్రీభాష్యం విజయసారథికి ఒక తనయుడు వరప్రసాదాచార్యులు. ప్రస్తుతం సర్వవైదిక సంస్థానం ట్రస్ట్ ఉపకులపతిగా ఉంటూ, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే విజయసారథి సతీమణి హేమలత కన్నుమూయగా, ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒకటిన్నర సమయంలో కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మహాపండితుడు అస్తమించిన విషయం తెలుసుకొని సాహితీలోకం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, శిష్యులు తరలి వచ్చి కన్నీటి నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ర్టానికి గర్వకారణమైన విజయసారథి మరణం తీరనిలోటని సాహితీ వేత్తలు చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్ స్థానికంగా లేకపోవడంతో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే మోహన్రెడ్డి, కలెక్టర్ ఆర్వీకర్ణన్, సీపీ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కే రామకృష్ణ, జడ్పీ ఉపాధ్యక్షుడు, తెలుగు అకాడమీ డైరెక్టర్ డాక్టర్ కే యాదగిరి, గండ్ర లక్ష్మణ్ రావు, ఎమ్మార్వో వెంకట్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. తదితరులు నివాళులర్పించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్లలోని పద్మనాయక శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
శ్రీభాష్యం విజయసారథి సంస్కృత భాషకు అందించిన సేవలు చిరస్మరణీ యం. ఆయన సంస్కృత భాషను ప్రజ ల్లోకి తీసుకెళ్లేందుకు ఎనలేని కృషి చేశారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వివిధ విద్యాసంస్థల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించిన మహా వ్యక్తి. కరీంనగర్ యజ్ఞవరాహస్వామి ఆలయ ట్రస్టీగా విశేష కృషి చేశారు. ఆయన పేరిట తర్వలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంస్కృత భాష పరిరక్షణకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
సంస్కృత భాషా పండితుడిగా, నగరంలో ఆధ్యాత్మిక వేత్తగా పేరుగాంచిన కవి శ్రీభాష్యం విజయసారథి మన నుంచి దూరం కావడంతో చాలా బాధాకరం. నగరంలో యజ్ఞవరాహస్వామి ఆలయాన్ని నిర్మించి, సర్వవైదిక సంస్థానం ద్వారా ఆధ్యాత్మికతను ఆయన పోషించారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిది.
– గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి
సంసృత మహాకవి, గీర్వాణ వాచస్పతి, మహా మహోపాధ్యాయ, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి సంసృత సాహిత్యానికి తీరని లోటు. సంసృత భాషలో యావద్భారత దేశంలో గల పండితులలో వేళ్లపై లెకించదగిన వారిలో శ్రీభాష్యం విజయసారథి ఒకరు. సంసృత భాషలో గేయ చందస్సు సృష్టించి మందాకినీ కావ్యం రచించి ఉత్తర భారతదేశంలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని యుగ కర్తా, యుగోద్ధర్తా, సరస్వతీ సుతోత్తంసా అనే బిరుదులు పొందిన మహనీయుడు.
– గాజుల రవీందర్, ఉపాధ్యాయుడు, కవి, వ్యాఖ్యాత
బహుముఖ పాండిత్యం, ప్రజ్ఞ కవితాశక్తి, ఉపాసనా బలం కల్గిన మహాకవి, మహాజ్ఞాని శ్రీభాష్యం విజయసారథి. శ్రీ భాష్యం విజయసారథికి రాష్ట్ర ప్రజ్ఞాభారతి పక్షాన రాష్ట్రస్థాయి అవార్డునిచ్చి గౌరవించుకోవడం మా సంస్థకు దకిన గౌరవంగా భావిస్తున్నాం. అంతటి మహనీయుడి మృతి యావత్ తెలంగాణకే కాక దేశానికి కూడా తీరనిలోటే.
-డీ నిరంజనాచారి, సీఏ, ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు
సంసృత భాషలో వేదాంతానికి భాష్యం చెప్పగల పాండిత్యం ఉండి సామాన్యుల వద్దకు సంసృత భాషను చేర్చడానికి కృషి చేసిన దార్శనికులు శ్రీభాష్యం విజయసారథి. యావత్భారత సంస్కృత కవులను ముగ్ధులను చేసిన మందాకిని కావ్యంతో యుగకర్తగా ప్రశంసించబడ్డారు. పద్మశ్రీ బిరుదంతో తెలంగాణకు తలమానికమైన మహాకవి పండితుడు, ఆచార్యుడు గిరిశిఖరం వలె ఒరిగిపోయారు.
– డా గండ్ర లక్ష్మణరావు, సాహితీ గౌతమి అధ్యక్షుడు
చిన్న వయసులోనే సంస్కృత కవిగా గుర్తింపు పొందిన శ్రీభాష్యం విజయసారథి పండితుడిగా, సాంస్కృతిక విశ్లేషకుడిగా యావత్ భారతంలో పేరు గడించారు. ఆయన సంస్కృత భాషకు చేసిన సేవలు గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు. ఉత్తర తెలంగాణ తెలంగాణ సంస్కృత భాషలో పద్మశ్రీ అందుకునే వారు మరొకరు ఉండరేమో అనిపిస్తుంది. ఆయన మననుంచి దూరమవడం చాలా భాధాకరం.
– డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్
నాటి తరానికి, నేటి తరానికి వారధిగా నిలబడి దేవభాషకు ఇతోధిక సేవలందించిన మాన్యులు పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మన జిల్లాలో జన్మించడం మన పుణ్యం. దాదాపు 150కి పైగా సంసృ్కత గ్రంథాలను అందించడమే కాకుండా, వందల సంఖ్యలో దేవత సుప్రభాత గీతాలు రాయడం, వారి మందాకిని వంటి కావ్యాలు ఉత్తర భారతంలో పాఠ్యాంశాలుగా ఉండడం అసామాన్యమైన విషయం. ఇంతటి ప్రజ్ఞాశాలి అయిన శ్రీ భాష్యం విజయసారథి ఆ పుణ్యభూమి ఒడిలో ఒరగడం అమర భాషకు తీరని లోటు.
– మందల నగేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ప్రజ్ఞాభారతి