కార్యకర్తలే బలం.. బలగంగా భావించే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. పార్టీ శ్రేణుల యోగక్షేమాలను భుజాలపై వేసుకున్నది. మిగతా పార్టీలకు భిన్నంగా.. ఏ కష్టమొచ్చినా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నది. గులాబీ కుటుంబంలో సభ్యత్వం తీసుకుంటే చాలు, ప్రతి ఒక్కరికీ 2 లక్షల ప్రమాద బీమా చేయించి, అందుకయ్యే ప్రీమియం మొత్తాన్ని కూడా చెల్లించి భరోసానిస్తున్నది.
దురదృష్టవశాత్తూ సభ్యత్వం తీసుకున్న వారు చనిపోతే.. అతడి కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా ఆదుకుంటున్నది. ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా 2 లక్షల బీమా చెక్కును నేరుగా కుటుంబానికి అందిస్తున్నది. అవసరమైతే వ్యక్తిగతంగానూ సాయం అందేలా చూస్తున్నది. ఇలా ఒకటి రెండు కాదు.. వందలాది కుటుంబాలకు ఈ తరహా సాయం అందించి, భరోసానిస్తున్నది.
– కరీంనగర్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ)
నా భర్త పెరుమాండ్ల మొగిలి. కులకశ్పి(కల్లు గీత) పని చేసుకుంట మా కొడుకులు పవన్ కుమార్, పవన్ కళ్యాణ్ను ఏలోటూ లేకుంట చూసుకునేది. ఏడాది కింద తాటి చెట్టు పైనుంచి పడి చనిపోయిండు. దీంతో మా ఇల్లు ఆగమైంది. మా ఇంటి పరిస్థితి అంతంతే. ఇద్దరు కొడుకుల భవిష్యత్తు ఏంటి అని నాకు రంది పడ్డ. కానీ, మా ఆయన ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీల తిరుగుతుండె. మా ఆయనతోపాటు మేం కూడా పార్టీ సభ్యత్వం తీసుకున్నం. సభ్యత్వం తీసుకునేటప్పుడు గివన్నీ ఎందుకునుకున్నం.
కానీ, మా ఆయన పేరు మీద ఇన్సూరెన్సు వచ్చినంక తెలిసింది. రూ.రెండు లక్షల బీమా చెకును స్వయంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సార్ మా ఇంటికి వచ్చి ఇచ్చిండు. వీటితోపాటు రైతు బీమా, గీత కార్మిక శాఖ నుంచి పరిహారం వచ్చింది. పార్టీ బీమాతో పాటు ప్రభుత్వ పథకాలు మాకు వర్తించకపోతే శానా ఇబ్బంది పడేటోళ్లం. నేను కూలి పనులు చేసుకుంటున్న. ఇద్దరు కొడుకులను బాగా చదివిస్తున్న. మా ఇంటిని బీఆర్ఎస్సే రోడ్డున పడకుండా నిలబెట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం.
కరీంనగర్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కటే జెండా, ఒక్కటే ఎజెండా అని ఎందరో గులాబీ సైనికులు కదిలారు. పార్టీ జెండాను మోసిన అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చురుకుగా పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటారు. అప్పటి పరిస్థితుల కారణంగా అనేక మంది ప్రాణత్యాగాలు కూడా చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది.
నాడు ఉద్యమంలో ప్రాణత్యాగాలను గుర్తుంచుకొని, అనేక కుటుంబాలను ఆదుకున్నది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం చేయడంతోపాటు అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పించింది. ఇటు పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకు కూడా బీఆర్ఎస్ కొండంత అండగా నిలబడుతున్నది. పార్టీ క్రియాశీల, సాధారణ సభ్యత్వం పొందిన వారికి 2 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ ఆలోచన చేశారు. ఆయన చేసిన ఆలోచన ఇపుడు ఎన్నో కుటుంబాలను ఆదుకుంటుండగా, పార్టీలో సభ్యత్వం ఉండి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.
చాలావరకు పార్టీలు తమ కార్యకర్తలకు ఎన్నికల వరకే ప్రాధాన్యతనిస్తాయి.. ఏండ్ల కేండ్లు పార్టీ కోసం కష్టపడ్డా కనీసం పట్టించుకోకుండా దూరం పెడుతాయి.. ఇక ప్రమాదవశాత్తూ ఆ కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందించవు. కానీ, బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నది. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ 2 లక్షల ప్రమాద బీమా చేయించడంతోపాటు ఆపద సమయాల్లో భరోసాగా కల్పిస్త్తున్నది.
నిజానికి ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోతే.. ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుదో ఆర్థం చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు తలకిందులై కుటుంబాలు రోడ్డు పాలయ్యే ప్రమాదమున్నది. ఇలాంటి పరిస్థితులు పార్టీలో ఎవరికీ రావద్దన్న ఉదాత్త ఆశయంతో బీఆర్ఎస్, కార్యకర్తలకు బీమా చేయిస్తున్నది. తద్వారా కొన్ని వందలాది కుటుంబాలకు ఆపద సమయాల్లో కొంత మేరకైనా ధీమా కలుగుతున్నది.
రూ.2లక్షలు డిపాజిట్ చేసిన..
మాది ధర్మపురి మండలం నాగారం. నా భర్త పసుల అనిల్ కార్పెంటర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించేటోడు. మాకు ఇద్దరు కూతుర్లు ప్రశష్ట, ప్రవష్ట ఉన్నరు. కొడుకు ఓమ్శ్రీ ఉన్నడు. అమ్మాయిలు మూడో తరగతి చదువుతున్నరు. ఏడాది వయసున్న నా కొడుకు మా అమ్మ వద్ద ఉంటున్నడు. నా భర్త కార్పెంటర్గా పనిచేస్తూనే బీఆర్ఎస్లో కార్యకర్తగా ఉన్నడు. ఏ కార్యక్రమానికైనా గులాబీ కండువా, జెండాతో ముందుండేవాడు. కానీ ఇదే ఏడాది ఫిబ్రవరిలో ధర్మపురిలో తన పని ముగించుకొని రాత్రి 8గంటలకు ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డడు.
దవాఖాన్ల చికిత్స పొందుతూ చనిపోయిండు. నాలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దు. ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలో తెలియక కుంగిపోయిన. మంత్రి ఈశ్వర్ సారు మా ఇంటికి వచ్చి ఓదార్చిండు. బీఆర్ఎస్ ప్రమాదబీమా కింద రూ.2లక్షలు వస్తయని అన్నరు. కొద్ది రోజులకే చెక్కు తెచ్చి ఇచ్చిండు. ఆ డబ్బులను ఇద్దరు కూతుళ్ల పేరిట డిపాజిట్ చేసిన. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించేందుకు ధర్మపురిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నా. దవాఖానలో వచ్చే జీతంతో ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్న. బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసినం కాబట్టి భవిష్యత్తులో నా కూతుళ్ల చదువు, పెండిళ్లకు ఇబ్బంది రాదని నిర్భయంగా ఉన్నా. ఏఎన్ఎం పూర్తి చేసిన నాకు ఏదైనా ప్రభుత్వ దవాఖానలో ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నా.
– పసుల అంజలి, ధర్మపురి
ఆపత్కాలంలో భరోసా
మరణించిన వ్యక్తి లోటు తీర్చలేనిదే అయినా.. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. ప్రమాద బీమా ఇపుడు ఎన్నో కుటుంబాలకు ఆసరా అవుతున్నది. 2 లక్షల సాయం ఎంతో కొంత అవసరాలు తీరుస్తున్నది. పార్టీ నుంచి వచ్చే 2 లక్షలే కాకుండా వారి పేరిట గుంట, రెండు గుంటల వ్యవసాయ భూమి ఉన్నా మరో 5 లక్షల రైతు బీమా అందుతున్నది. గీత, నేత వంటి వృత్తుల్లో ఉన్నవారికి అదనంగా మరో 5 లక్షల బీమా సదుపాయం కూడా అందిస్తున్నది. ప్రమాదంలో మరణించిన పార్టీ కార్యకర్తలు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని నాయకులు వారికి అండగా నిలబడుతున్నారు.
అర్హులైన వారు ఉంటే వారి కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నారు. పార్టీ అందించిన ఆర్థిక సహాయంతో కార్యకర్తల కుటుంబాలు తమ అవసరాలను తీర్చుకుంటున్నాయి. ఇంటి నిర్మాణం చేసుకోవడం, పిల్లల చదువులకు ఉపయోగించుకోవడం, వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడం, ఎదిగిన పిల్లలు ఉంటే పెండ్లిళ్లు చేయడం వంటి పనులకు ఈ ఆర్థిక సహాయాన్ని వినియోగించుకుంటున్నాయి.
కార్యకర్తలకు అండగా ఉంటున్నాం
ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలం, బలగం. వారిని ఆదుకునేందుకే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీమా సదుపాయాన్ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సదుపాయం వర్తింపజేస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉంటున్న కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా మా ఎమ్మెల్యేలు, నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు తక్షణం స్పందించి వారికి అండగా నిలుస్తున్నారు. సభ్యత్వం ద్వారా వచ్చే 2 లక్షల బీమానే కాకుండా మా కార్యకర్తలు సహజంగా మరణించినా పార్టీ పరంగా వారిని ఆదుకుంటున్నాం. ఇలా చాలా మందికి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వచ్చి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా కార్యకర్తలకు ఆపద వస్తే ఆదుకోవడంలో ముందుంటున్నారు. బీఆర్ఎస్నూ చూసి కొన్ని పార్టీలు కూడా బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కానీ, ఆచరణలో మాత్రం విఫలం అవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కేసీఆర్ సార్ తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందుకే మరణించిన కొద్ది రోజుల్లోనే మా కార్యకర్తలకు బీమా క్లయిం అవుతున్నది.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
బిడ్డ పెండ్లికోసం డిపాజిట్చేసిన
మాది రెక్కాడితే గాని పూటగడవని పరిస్థితి. నా భర్త గోదూరి శంకర్ (45) వ్యవసాయ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఓ వైపు కూలీ పని చేసుకుంటూనే మరో వైపు బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని పార్టీ కోసం పని చేసిండు. మాకు బిడ్డ ఆకాంక్ష, కొడుకు అక్షయ్ ఉన్నరు. బిడ్డ కోరుట్ల గురుకుల కళాశాలల డిగ్రీ చదువుతుంది. కొడుకు అక్షయ్ బతుకుదెరువు కోసమని ఆరు నెలల కింద దుబాయి పోయిండు. బీఆర్ఎస్ అంటే నా భర్తకు బాగా ఇష్టం ఉండేది. అయితే, 2022 మార్చి 5న ఓ ఫంక్షన్కు వెళ్లి వస్తూ మల్లాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంల చనిపోయిండు.
ఇంటి పెద్ద దిక్కు పోయినంక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ టైంలనే బీఆర్ఎస్ మా ఇంటికి భరోసా ఇచ్చింది. ప్రమాద బీమా కింద రూ.2 లక్షల పరిహారం చెక్కు వచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ సార్ మా ఇంటికి వచ్చి ఇచ్చిన్రు. ఆ పైసలు ఖర్చు పెట్టకుండా అట్లనే మా బిడ్డ పెండ్లి కోసమని బ్యాంకుల డిపాజిట్ చేసినం. నా భర్త ఉన్నప్పుడు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. అందులోనే ఉంటున్నం.
– భార్య గోదూరి లలిత, చిట్టాపూర్, మల్లాపూర్ మండలం(మెట్పల్లి)
కేసీఆర్ మా దేవుడు
నా పేరు పరచూరి రమణమ్మ, నా భర్త పేరు మల్యాద్రి. ఆంధ్రప్రదేశ్లోని గుంటిపల్లి మాది. 30 ఏండ్ల కింద ఉపాధి కోసం జగిత్యాలకు వలస వచ్చినం. కూలీ పని చేస్తూ బతుకుతున్నం. మేం ఇక్కడికి వచ్చిన తర్వాతనే సంతానం కలిగింది. ఇద్దరు కొడుకులు మహేశ్, మహేంద్ర, కూతురు మమత ఉన్నరు. పెద్దోడు, చిన్నోడు మాతోనే మేస్త్రీ పని చేస్తరు. అప్పుడు చేసి అమ్మాయి మమత పెండ్లి చేసినం. ఆంధ్రా నుంచి వచ్చినమన్న మాటే కానీ మేం పూర్తిగా తెలంగాణవాళ్లమై పోయినం.
నా భర్త అటు పనిచేసుకుంటనే ఇటు బీఆర్ఎస్లో తిరుగుతుండే. అయితే అంతా మంచిగ ఉంది. బిడ్డ పెండ్లి చేసినం. కొడుకులు పనిచేసుకుంటున్నరు అనుకుంటున్న టైంల నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. కేసీఆర్ దేవునోలే బీఆర్ఎస్ సభ్యత్వం కింద రూ.2లక్షలు మా కుటుంబానికి పంపిండు. అప్పులు కట్టుకున్నం. అవసరాలకు వాడుకున్నం. ఈ సారి కూడా కేసీఆర్నే గెలిపించి, రుణం తీర్చుకుంటం.
బిడ్డ పెండ్లి కోసం డిపాజిట్ చేసిన..
మాది మంథని మండలం ధర్మారం. మేం ముదిరాజ్ కులస్తులం. నా భర్త బొంతల ఆర్జయ్య చేపలు పడుతూ మా కుటుంబాన్ని సాకెటోడు. బీఆర్ఎస్లో కార్యకర్తగా పని చేసేటోడు. ఏడాది కింద చేపలు పట్టేందుకు చెరువులోకి దిగి కాళ్లకు నాచు తట్టుకొని చెరువులో మునిగిచనిపోయిండు. మాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. నా భర్త చని పోవడంతో నా బతుకు ఆగమైంది. గుంట భూమి కూడా లేదు, ఇద్దరు పిల్లలను ఎలా సాదాలో అర్థం కాలే. పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్ సార్ వచ్చి ధైర్యం చెప్పిండు.
బీఆర్ఎస్ సభ్యత్వం కింద రూ. 2లక్షల చెక్కు ఇచ్చిండు. కొంచెం ధైర్యమచ్చింది. ఆ డబ్బులు నా బిడ్డ పెండ్లి కోసం డిపాజిట్ చేసి పెట్టిన. ఇప్పుడు నా కొడుకు సంతోష్, కూతురు శ్రావ్య ఇద్దరు డిగ్రీ చదువుతున్నరు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు ఎల్లప్పుడూ రుణ పడి ఉంటా.
– బొంతల స్వరూప, ధర్మారం, మంథని
కుటుంబాలకు ధీమా
బీఆర్ఎస్ మిగతా పార్టీలకు భిన్నంగా తన కార్యకర్తల బాగోగులు చూసుకుంటున్నది. క్రియాశీల, సాధారణ సభ్యత్వం పొందిన 60 ఏండ్లలోపు ఉన్న ప్రతి కార్యకర్తకూ 2 లక్షల ప్రమాద బీమా చేయిస్తున్నది. అందుకయ్యే ఖర్చును పార్టీనే భరిస్తున్నది. ప్రమాదవశాత్త్తూ సదరు ప్రాణాలు కోల్పోతే.. బీమా ద్వారా వచ్చే 2 లక్షల చెక్కును తీసుకెళ్లి సదరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆ కుటుంబాలకు అందిస్తున్నారు.
అంతే కాదు, సదరు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చూసి.. అవసరమైతే వ్యక్తిగతంగానూ సాయం చేస్తూ వారి కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చిన తక్షణం స్పందించి వారిని ఆదుకుంటూ ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు వందలాది కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది.
మా కుటుంబానికి ఆసరైనయి..
మాకు గుంట భూమి లేదు. 40 ఏండ్ల నుంచి కిరాయికే ఉంటున్నం. రెక్కాడితేగానీ కడుపు నిండదు. నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. మా ఆయన కొలిపాక నర్సయ్య ట్రాలీ డ్రైవర్. ఇద్దరం కష్టపడి పనిచేసి పిల్లలను పెద్దచేసినం. ఇద్దరు బిడ్డల పెండ్లి చేసినం. అటు పనిచేసుకుంటనే మరోవైపు బీఆర్ఎస్ నాయకుడిగా పనిచేస్తుండె. ఎన్నికలు వచ్చిందంటే చాలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేటోడు.
మా ఇద్దరు కొడుకులు కూడా కూలీ పనే చేస్తరు. ఇగ జీవితం మంచిగా ఉన్నదనుకునే టైంల 2022లో హన్మంతుపేట వద్ద రోడ్డు ప్రమాదంలో నా భర్త చనిపోయిండు. అప్పటికే మాకు కొన్ని అప్పులు ఉండె. ఎట్లా తీర్చేదని రందిపడ్డా. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా కింద రూ.2 లక్షలు వచ్చినయి. అప్పులు తేర్పుకున్నం. మిగిలిన పైసలతో అత్తమామ ఇచ్చిన అర గుంట భూమిలో నీడ ఏర్పాటు చేసుకుంటం. కేసీఆర్ సారూ ఇచ్చిన రూ.2 లక్షలు ఆపదలో ఆదుకున్నయి. సార్కు రుణపడి ఉంటా.
– కొలిపాక ఓదెమ్మ, పెద్దపల్లి
పార్టీ మాకు అండగా నిలిచింది
నా భర్త దేశ్పాండే సుధాకర్ (52) నగరంలోని ఓ హోటల్లో వంటమనిషిగా పని చేసుకుంటూనే బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పని చేసిండు. ఏడేళ్ల పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ తన పని వదులుకొని పార్టీ గెలుపుకోసం పని చేశారు. అయితే, 2016 జనవరి 5న ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయిండు.
మాకు పెద్ద దిక్కు పోయిందని బాధ పడుతున్న సమయంలో పార్టీ నుంచి రూ.2 లక్షల బీమా చెక్కును మంత్రి కమలాకర్ ఇచ్చిన్రు. ఈ డబ్బులను అదే టైంల నిర్మాణంలో ఉన్న ఇంటి కోసం ఖర్చు పెట్టి పూర్తి చేసుకున్నం. మాకు ఇద్దరు కూతుళ్లు మమత, మౌనిక. మా ఆయన బతికున్నప్పుడే పెద్దమ్మాయి పెళ్లి చేశాం. చిన్నమ్మాయి పెళ్లి టైంల కూడా స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆర్థికంగా ఆదుకున్నరు. ఆయన బీఆర్ఎస్లో పనిచేసినందుకు పార్టీ మా ఇంటికి అండగా నిలిచింది. ప్రభుత్వం నుంచి నాకు పింఛన్ కూడా వస్తంది. ఇంత మంచి సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరిచిపోయేది లేదు. పార్టీకి అన్ని సమయాల్లోనూ అండగా ఉంటాం.
– దేశ్పాండే రజని, (కరీంనగర్ కార్పొరేషన్)
గడపగడపకూ గులాబీ జెండా
ఉమ్మడి జిల్లా ఆది నుంచీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నది. అందులోనూ పార్టీకి అత్యధిక సభ్యత్వం మన పూర్వ జిల్లాలోనే ఉన్నది. పూర్వ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి ఏడున్నర లక్షలపై చిలుకు సభ్యత్వం ఉన్నది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50 వేలకు తగ్గకుండా ఉండగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా సభ్యత్వమున్నది. మెజార్టీ నియోజకవర్గాల్లో 60 వేల నుంచి 80 వేల మధ్య ఉంది. గతంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కూడా స్వచ్ఛందంగానే సాగింది. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న పథకాలు, కండ్ల ముందు కనిపిస్తున్న ఫలాలు వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటున్న ప్రజలు.. స్వచ్ఛదంగా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు.
నిజానికి ఇతర పార్టీలేవీ సభ్యత్వం విషయంలో బీఆర్ఎస్ దరిదాపుల్లోనూ లేవు. అంతేకాదు, ఇంత పెద్దమొత్తంలో కూడా ఏ పార్టీ గతంలో సభ్యత్వం నమోదు చేయలేదు. సభ్యత్వ నమోదును కూడా పకడ్బందీగా చేశారు. ఇతర పార్టీల మాదిరి కాకుండా పూర్తి వివరాలతో కంప్యూటరీకరణ చేశారు.